Suryaa.co.in

Editorial

‘కమల’వనంలో అవినీతి పుష్పాలు

– వందకోట్ల రూపాయల ‘ఉత్తుత్తి ఉద్యోగాల’ కుంభకోణం కథ కంచికేనా?
– కోర్ కమిటీ ముందుకు రాని త్రిసభ్య కమిటీ నివేదిక
– గత నవంబర్ లో నివేదించినా బయటపెట్టని బీజేపీ నాయకత్వం
– పార్టీ పెద్దల పాత్రపై చర్చించాల్సి వస్తుందనే భయమే కారణమా?
– బాధితులు, నిందితుల వద్ద త్రిసభ్య కమిటీ వాస్తవాల సేకరణ
– ఓ కేంద్రమంత్రి- రాష్ట్ర కీలకనేత, ఉత్తరాంధ్ర జోనల్ ప్రముఖుడి సహా పార్టీ పెద్దలకు ఉద్యోగాలిచ్చానని చెప్పిన నిందితుడు
– కాకినాడ ఆర్‌ఎస్‌ఎస్ నేతకు 48 ఉద్యోగాలు
– ఫిర్యాదుచేసినా పట్టించుకోని ఆర్‌ఎస్‌ఎస్ నేతలు
– కథలో నిందితులు, బాధితులూ బీజేపీ వారే
– పార్టీలో ‘పెద్ద తలల’ పాత్రపై అనుమానాలు?
– ‘ఉద్యోగాల కథ’లో చక్రం తిప్పిన ఓ ఉత్తరాంధ్ర బీజేపీ ప్రముఖుడు?
– ఆయన అనుచరుడి ద్వారా ఉద్యోగాల అమ్మకాలు
– ఆ డబ్బుతో ఎంకెపట్నం వద్ద బినామీల పేర్లతో భారీగా భూముల కొనుగోలు చేశారన్న ఆరోపణలు
– జైలు నుంచి బయటకొచ్చి మళ్లీ అదే కథ నడిపిస్తున్న నిందితుడు
– నాలుగువేల ఉద్యోగాలంటూ నిరుద్యోగులపై మళ్లీ కొత్త వల
– స్మార్ట్‌విలేజ్, రూర్బన్ ఉద్యోగాల కుంభకోణం
– ‘సూర్య’ చేతిలో త్రిసభ్య కమిటీ నివేదిక
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఇప్పటికే కేంద్రస్థాయి నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తామంటూ సొంత పార్టీ కార్యకర్తలను బురిడీ కొట్టించి, కేసుల పాలవుతున్న బీజేపీ అగ్రనేతల వ్యవహారంపై జాతీయ నాయకత్వం చర్యలు తీసుకోని నిర్లక్ష్యం.. మరికొందరికి ఆదర్శంగా మారుతోంది. కొద్దికాలం క్రితం ఉత్తరాంధ్రలో నిరుద్యోగులను, ఉద్యోగాల పేరుతో బురిడీ కొట్టించిన.. స్మార్ట్‌విలేజ్, రూర్బన్ ఉద్యోగాల కుంభకోణంలో, నిందితులు-బాధితులూ బీజేపీ నేతలేనన్న వాస్తవం వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంపై బీజేపీ అనకాపల్లి పార్లమెంటు జిల్లా పార్టీ నియమించిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన 33 పేజీల నివేదిక “సూర్య” చేతికి చిక్కింది.

అయితే బీజేపీ అనకాపల్లి పార్లమెంటు జిల్లా త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదిక బుట్టదాఖలయింది. అనకాపల్లి కిసాన్‌మోర్చా జోనల్ ఇన్చార్జి పి.రవిరాజు, బీజేపీ ఉపాధ్యక్షుడు డి.బుసిరాజు, ఉపాధ్యక్షుడు పట్టాభి ప్రసాద్‌తో కూడిన త్రిసభ్య కమిటీ తన నివేదికను 30-11-20121న రాష్ట్ర కమిటీకి నివేదిక సమర్పించింది. అయినా, రాష్ట్ర కమిటీ ఇప్పటిదాకా కోర్ కమిటీ ముందు పెట్టలేదు. దానిపై కోర్ కమిటీలో చర్చిస్తే.. పార్టీలో పెద్దతలల పేర్లు బయటపెట్టాల్సి వస్తుందన్న భయమే, దానికి కారణమన్నది పార్టీ వర్గాల వాదన.

యోజన వెల్ఫేర్ సొసైటీ పేరుతో స్మార్ట్ విలేజ్-రూర్బన్ పథకం కింద.. కొద్దికాలం క్రితం జరిగిన ఉద్యోగాల కుంభకోణం, ఉత్తరాంధ్ర నిరుద్యోగులను నిండా ముంచింది. ఇందుపూడి సుధాకర్ అనే మాజీ బీజేపీ నేతకు.. ఉద్యోగాల కోసం ఓ కేంద్రమంత్రి సహా, బీజేపీ రాష్ట్ర-జిల్లా అగ్రనేతలు సిఫార్సు చేసిన వైనం, ఆ పార్టీ వేసిన త్రిసభ్య కమిటీ విచారణలో వెలుగుచూసింది. ప్రధానంగా రాజమండ్రికి చెందిన ఓ బీజేపీ రాష్ట్ర కీలక నేత, బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ ప్రముఖుడు సిఫార్సు చేసినవారికి, భారీ స్ధాయిలో ఉద్యోగాలిచ్చినట్లు.. నిందితుడే స్వయంగా త్రిసభ్య కమిటీ ముందు, అంగీకరించిన వైనం విస్మయం కలిగిస్తోంది.

అయితే.. ఉద్యోగాలు తీసుకున్న రాష్ట్ర-జిల్లా-జోనల్ బీజేపీ ప్రముఖులు.. తమ సొంత పార్టీ కార్యకర్తలకే వాటిని అంటకట్టి, లక్షలాది రూపాయలు సంపాదించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో దాదాపు 100 కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలొస్తున్నాయి. నిందితుడు సుధాకర్‌ను.. నిరుద్యోగ బాధితుల ఫిర్యాదు మేరకు అరెస్టు చేసినా, ఇటీవలే ఆయన బెయిల్‌పై తిరిగొచ్చారు.

అంతేకాదు.. నాలుగువేల ఉద్యోగాలంటూ, పెందుర్తిలో మళ్లీ నిరుద్యోగులతో పరీక్ష రాయించడంతో, పాత కథ కొత్తగా తెరపైకి వచ్చింది. కానీ.. నిందితుడి చేతిలో మోసపోయిన బీజేపీ సాధారణ కార్యకర్తలు, పార్టీకి సంబంధం లేని నిరుద్యోగులకు మాత్రం.. ఇప్పటిదాకా ఉద్యోగాల కోసం డబ్బులు మాత్రం తిరిగి ఇవ్వలేదు. గతంలో తనకు డబ్బులు కట్టిన వారికి ఉద్యోగాలిస్తానని, సుధాకర్ హామీ ఇస్తున్నట్లు నిరుద్యోగులు చెబుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో, బీజేపీ రాష్ట్ర అధ్యక్ష కేసులో ఉన్న… ఉత్తరాంధ్ర జోనల్ ప్రముఖుడు, ఆయన బినామీ అయిన నర్సీపట్నం బీజేపీ నేత ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వీరంతా కలసి నర్సీపట్నం రోలుగుంట మండలం కోరుకొల్లు గ్రామం, ఎంకెపట్నంలోని 9 సర్వేనెంబర్లలో.. 80 ఎకరాల భూమి బినామీపేర్లతో కొన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆ మేరకు పలువురు బాధితులు కూడా త్రిసభ్య కమిటీకి చెప్పినట్లు సమాచారం.

నిజానికి ఉద్యోగాలిస్తామంటున్న స్మార్ట్‌విలేజ్-రూర్బన్ పథకానికి, కేంద్ర ప్రభుత్వానికీ ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆ పేరుతో నిందితుడు బీజేపీ నేతలను బురిడీ కొట్టించి, వారినే బ్రోకర్లుగా మార్చిన వైనం విస్మయానికి గురిచేస్తోంది. తమ సంస్ధపై ఏ ప్రభుత్వ శాఖ నియంత్రణ ఉండదని, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ నిధులతో 12 కంపెనీలు తమకు ఆర్ధిక సాయం చేస్తాయని, నిందితుడు సుధాకర్ స్వయంగా త్రిసభ్య కమిటీ ముందు వెల్లడించినట్లు సమాచారం. ఈ వ్యవ హరంలో తాము మీడియాను కూడా మేనేజ్ చేసినట్లు నిందితుడు చెప్పినట్లు తెలిసింది.

అయినా నిరుద్యోగులు-సాధారణ బీజేపీ కార్యకర్తలు, ఇందులో ఉద్యోగాల కోసం వేలంవెర్రిలా ఎగబడ్డారు. బీజేపీ నేతల సిఫార్సుతో ఒక్కో ఉద్యోగాన్ని 2 నుంచి 4 లక్షల వరకూ కొనుకున్నారు. కొందరు బీజేపీ జిల్లా నేతలు వారి నుంచి కొంత వసూలు చేసి, అందులో కొంత తాము తీసుకుని, మరికొంత నిందితుడి మనుషులకు ఇచ్చారన్నది ఒక ఆరోపణ. ఉద్యోగాలు ఇచ్చిన వారిని గ్రామాలకు పంపి, తమ సంస్థలో ఉద్యోగాలున్నాయని ప్రచారం చేయించి, మరికొందరిని బలి చేశారు.

రెండు కేటగిరీలో ఉద్యోగాలిచ్చిన సంస్థ.. అందుకు ఒకరికి 19 వేలు, మరొకరికి 25 వేల రూపాయల జీతం ఇస్తామని వారిని ఉద్యోగాల్లో తీసుకుంది. అయితే, నాలుగయిదు నెలల తర్వాత, ఒక నెల మాత్రమే జీతాలిచ్చినట్లు నిరుద్యోగులు బీజేపీ త్రిసభ్య కమిటీకి వెల్లడించారు. ఆ తర్వాత కుంభకోణం మీడియాలో రావడం, సంస్ధ నిర్వహకుడిని పోలీసులు అరెస్టు చేయడంతో, నిరుద్యోగులు రోడ్డునపడ్డారు. అంటే నిరుద్యోగులు కట్టిన డబ్బులే, నెలజీతంగా ఇచ్చారన్న మాట. ఆ విధంగా చైన్‌సిస్టమ్‌లా మారిన ఈ కుంభకోణంలో, దాదాపు 100 కోట్లు చేతులు మారినట్లు ఆరోపణలొచ్చాయి. నిజానికి ఈ కథంతా మీడియాలో రావడంతో అసలు డొంక కదిలింది.

త్రిసభ్య కమిటీ ముందు హాజరైన నిందితుడు సుధాకర్.. తాను ఓ కేంద్రమంత్రి, రాజమండ్రికి చెందిన రాష్ట్ర బీజేపీ కీలకనేత, బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ ప్రముఖుడితో పాటు.. అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ ప్రముఖులకు పెద్ద సంఖ్యలో ఉద్యోగాలిచ్చినట్లు వెల్లడించినట్లు సమాచారం. కాకినాడకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడికి సైతం, 48 ఉద్యోగాలిచ్చినట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

ఇంకా వైసీపీ,బీజేపీ, జనసేన నేతలు సిఫార్సు చేసిన వారికీ కొన్ని ఉద్యోగాలిచ్చానని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో పోలీసు అధికారులు సిఫార్సు చేసిన వారికి, 25 ఉద్యోగాలిచ్చినట్లు సదరు నిందితుడు, త్రిసభ్య కమిటీకి వెల్లడించడం విశేషం.

ఈ కుంభకోణం వెలుగులోకి రాకముందు వరకూ.. బీజేపీ జిల్లా కార్యదర్శిగా పనిచేసిన నిందితుడు సుధాకర్, ఆ తర్వాత పార్టీ పదవికి రాజీనామా చేయడం మరో విశేషం. తాను మంత్రులు, రాజకీయ నాయకులకు కోట్లాదిరూపాయలు లంచం ఇచ్చి, ఈ ప్రాజెక్టులు తెచ్చి ఉద్యోగకల్పన చేస్తున్నానని, సుధాకర్ త్రిసభ్య కమిటీకి సెలవిచ్చారట. పైగా.. తన దగ్గర వీఐపీలతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ 600కు పైగా ఉన్నాయని సుధాకర్.. స్వయంగా త్రిసభ్య కమిటీకి చెప్పడం చూస్తే.. నిందితుడికి ఏ స్థాయిలో పలుకుబడి ఉందో స్పష్టమవుతుంది.

ఇంకో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే… రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్ నుంచి బీజేపీకి దిశానిర్దేశం చేసే, రాష్ట్ర బీజేపీ కీలక నేత సైతం.. సదరు నిందితుడికి ఫోన్ చేసి, బీజేపీ కార్యకర్తలకు ఉద్యోగాలివ్వాలని కోరటం. ఈ కుంభకోణంలో బీజేపీ ఉత్తరాంధ్ర జోనల్ ప్రముఖుడి బినామీగా ఉన్న, ప్రధాన అనుచరుడు కీలకపాత్ర పోషించినట్లు త్రిసభ్య కమిటీ గుర్తించినట్లు తెలుస్తోంది.

నర్సీపట్నానికి చెందిన ఆ బినామీ నేత ఇంటికి, సదరు ఉత్తరాంధ్ర జోనల్ ప్రముఖుడు తరచూ వచ్చేవారని, ఆయన చొరవతోనే ఆ ప్రాజెక్టు వచ్చిందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దానితో నిరుద్యోగులు దానిని నిజమని నమ్మి, ఉద్యోగాల కోసం జిల్లా స్థాయి బీజేపీ నేతలను కలసి, ఉద్యోగాల కోసం డబ్బులిచ్చినట్లు.. త్రిసభ్య కమిటీ ముందు హాజరైన బాధితుల మాటల్లో స్పష్టమయింది. ఆ బినామీ నేత ద్వారానే.. ఎంకెపట్నంలో 80 ఎకరాల భూమి కొనుగోలు చేశారన్న ప్రచారం జరుగుతోంది.

ఆ మేరకు బీజేపీ ప్రతిష్ఠను భ్రష్ఠుపట్టించిన ఆ బినామీతోపాటు, మరొక నేతకి పార్టీలో ఎలాంటి బాధ్యతలు ఇవ్వవద్దని కూడా, త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. అయినప్పటికీ రాష్ట్ర నాయక త్వం, త్రిసభ్య కమిటీ సూచనను బేఖాతరు చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. త్రిసభ్య కమిటీ సూచించిన ఆ ఇద్దరూ, ఇంకా పార్టీ పదవుల్లోనే కొనసాగుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అసలు ఈ కుంభకోణం అంతా, బీజేపీ నేత శివనారాయణరాజు పార్టీ అగ్రనేతల దృష్టికి తీసుకువెళ్లడంతో బయటపడినట్లు తెలుస్తోంది. ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన, తొలుత ఈ వ్యవహారాన్ని ఆర్‌ఎస్‌ఎస్ నేతల దృష్టికి తీసుకువెళ్లినా, వారు ఎలాంటి చర్య తీసుకోలేదు. ఆ తర్వాత ఉత్తుత్తి ఉద్యోగాల కుంభకోణం వెలుగుచూసింది.

అయితే, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడి.. దాదాపు వందకోట్ల రూపాయలు నష్టపోయిన ఈ కుంభకోణంపై, త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను, బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటిదాకా కోర్ కమిటీలో చర్చించకపోవడంపై అనేక విమర్శలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు- నిందితులను విచారించి, అందులో తమ అభిప్రాయం కూడా పొందుపరిచి ఇచ్చిన 33 పేజీల నివేదికను.. బీజేపీ రాష్ట్ర నాయకత్వం బుట్టదాఖలు చేయడంపై, పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది.

అందులో ఒక కేంద్రమంత్రి, రాజమండ్రికి చెందిన ఓ రాష్ట్ర కీలక నేత, పార్టీ ఉత్తరాంధ్ర జోనల్ ప్రముఖుడు, విశాఖ బీజేవైఎం నేతల పేర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆ నివేదికను కోర్ కమిటీలో చర్చిస్తే.. వారందరి పేర్లు ఎక్కడ బయటకొస్తాయోనన్న భయంతోనే, త్రిసభ్య కమిటీ నివేదికను తొక్కిపెట్టారన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

LEAVE A RESPONSE