Suryaa.co.in

Andhra Pradesh

ల్యాండ్, శాండ్, వైన్, మైన్, కబ్జాల అవినీతి సామ్రాట్ జగన్

– చిల్లర రాజకీయాలు వద్దు…నువ్వు నా ముందు ఒక బచ్చా
-మా సభలకు అడ్డంకులా…నాడు నేను అనుకుంటే నువ్వు రోడ్డుపై తిరిగేవాడివి కాదు
-జగన్ ను ఇంటికి పంపేందుకు జనం సిద్ధం..అభ్యర్థులు దొరక్క జగన్ సందిగ్ధం
-మూడు ప్రాంతాల ప్రజలు…ఫ్యాన్ మూడు రెక్కలు విరగ్గొట్టాలి
-పర్చూరు రా…కదలిరా సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు

పర్చూరు : వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ధనవంతుడైతే…ప్రజలు మరింత పేదవాళ్లయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఐదేళ్లుగా రాష్ట్రంలో అభివృద్ధి లేక ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని తెలిపారు. టీడీపీ పాలనలో ప్రజల తలసరి ఆదాయం పరుగులు పెడితే నేడు పతనావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు.

పర్చూరు రా…కదలిరా సభలో శనివారం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ….‘‘వచ్చే ఎన్నికల్లో విజయం మనదే. పర్చూరు పౌరుషం చూడు జగన్. నువ్వు..నీ పార్టీ భూస్థాపితమవ్వడం ఖాయం. ఎక్కడికక్కడ తెరలు కట్టుకుని తిరగడం కాదు… ధైర్యముంటే పర్చూరు సభను చూడు. నీకు టీవీ చూడాలంటే భయంగా ఉంటే యూట్యూబ్ లింక్ పంపిస్తాం చూసుకో. పర్చూరులో మీటింగ్ అనగానే జగన్ రెడ్డి ప్యాంటు తడిచిపోయింది. అందుకే దేవాదాయ భూమి అంటూ అడ్డంకులు సృష్టించాడు. సభకు భూమి ఇచ్చాడని రైతుకు నోటీసు ఇప్పించాడు.

వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 52 రోజుల్లో తెలుగుదేశం-జనసేన సునామీ రాబోతుంది. అడ్డుకునేందుకు ఎవరైనా వస్తే తొక్కుకుంటూ పోతాం.

చిల్లర రాజకీయాలు వద్దు…నా ముందు నువ్వొక బచ్చా

చీరాల ప్రజలు ఛీకొట్టిన ఓ నీచున్ని పర్చూరుకు పంపించాడు. అతనితో లాభం లేదని ఇప్పుడు మరొకరిని పంపిస్తున్నాడు. ఎవరు వచ్చినా మీకు మిగిలేది ఓటమే.

నా రాజకీయాల ముందు నువ్వొక బచ్చా. మీ నాన్నే నా దెబ్బకు భయపడ్డాడు. నీ లాంటి బచ్చాకు నేను భయపడను. తెలుగుజాతి, పేదవాడి కోసం, తెలుగింటి ఆడపడుచు కోసం నేను పని చేస్తున్నా. దానిని అడ్డుకోవటం నిన్ను పుట్టించిన వాడి వల్ల కూడా కాదు.

రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తిని ఓడించాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ప్రజలు, యువత, ఆడబిడ్డల భవిష్యత్తుల కోసం పనిచేస్తున్నా.

అవినీతి కేసులో జైలుకెళ్లొచ్చినా జగన్ లో మార్పు లేదు

నాడు తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకొని రూ.43వేల కోట్లు దోచేశాడు. అక్రమాస్తుల కేసులో 16 నెలలు జైల్లో ఉన్నాడు. అయినా జగన్ లో మార్పు రాలేదు. ఊరూరా తిరిగి ముద్దులు పెట్టి, తల నిమిరే సరికి ప్రజలు కరిగిపోయి ఓట్లు వేశారు. అధికారంలోకి వచ్చాక జగన్ నిజస్వరూపం బయటపడింది. జగన్ ఓ సైకో..అవసరం కోసం కాళ్ళు పట్టుకుంటాడు..తర్వాత కాళ్ళు లాగేస్తాడు. రాష్ట్రాన్ని చెడబట్టాడు. వ్యవస్థలను నాశనం చేసి ల్యాండు, సాండు, వైన్, మైన్ ఏది దొరికినా వదిలిపెట్టలేదు..జగన్ ఒక భూ బకాసురుడు.

జగన అన్నం తినటం మానేసి ఉదయం అల్పాహారంగా ఇసుక, మధ్యాహ్న భోజనంగా మైన్స్, రాత్రికి డిన్నర్ గా జే బ్రాండ్ మద్యం డబ్బులు తింటున్నాడు. గ్రానైట్ వ్యాపారులు కప్పం కట్టలేదని అక్రమ కేసులు బనాయించారు. మైనింగ్ అధికారులు పోలీసులతో కారం పొడిని తీసుకొని రౌడీల మాదిరిగా బీభత్సం సృష్టించారు. అధికారముందని ఊర్ల మీద ఆంబోతుల్లా పుడతున్నారు. నీ అక్రమాలకు కళ్లెం వేసి ఎక్కడ కూర్చబెట్టాలో పెట్టి ప్రజలను కాపాడుకునే బాధ్యత నాది.

మన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ను పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చినా మారలేదు. దీంతో రూ.350 కోట్లు ఫైన్ వేశారు. సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చేశారు.

జగన్ బటన్ నొక్కుడుతో బాదుడే బాదుడు…

ఈ ప్రభుత్వంలో ప్రజలు, ఆడబిడ్డలు, నేను, పవన్ కళ్యాణ్ కూడా బాధితులమే. వీళ్ళ దోపిడీలకు అడ్డొస్తే మనపైనే దాడులు చేస్తున్నారు. మిమ్మల్ని, రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మేము ముందుంటాం. ఇది కేవలం మా పోరాటమే కాదు ప్రజలందరి పోరాటం.

జగన్ రెడ్డి బటన్ నొక్కడం వల్ల ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయి. చెత్త పన్ను, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసరాల సరుకుల ధరలు అన్నీ పెరిగాయి. ఐదేళ్ళలో ఒక్కో కుటుంబంపై రూ.8 లక్షల భారం పడింది. జాబ్ క్యాలెండర్ విడుదలకు ఎందుకు నీ బటన్ పని చేయలేదు. ఐదు జనవరిలు పోయాయి..ఇంతవరకూ ఒక్కసారి కూడా జాబ్ క్యాలెండర్ వదల్లేదు. మద్యపాన నిషేధంపై బటన్ ఎందుకు నొక్కలేదు.

మద్యనిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నాడు. ఆడబిడ్డల మంగళసూత్రం తెంచిన వ్యక్తికి ఓటు వేస్తారా? సీపీఎస్ రద్దు ఎంత పని అన్నా వారంలో చేస్తానన్నాడు…నువ్వు పోయే వారం కూడా వచ్చింది..అయినా బటన్ నొక్కలేదు. గుంతలు పడిన రోడ్లను బాగు చేయటానికి బటన్ నొక్కలేదు. దోపిడీపై శ్రద్ధ పెట్టి ఆర్థిక ఉగ్రవాదిలా మారాడు.

కానీ జగన్ రెడ్డి మాత్రం తన ఆస్తులను పెంచుకుని దేశంలోనే ధనిక సీఎం అయ్యాడు. ఖనిజ సంపద, సహజవనరులన్నీ దోచుకుంటున్నాడు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి ఉంటేనే సంక్షేమ కార్యక్రమాలు చేయగలం.

మూడు రాజధానులు పోయి…ఇప్పుడు నాలుగో రాజధానా.?

అమరావతిని పూర్తి చేసివుంటే రాష్ట్రం ఉన్నత స్థితిలో ఉండేది. అమరావతి నిర్మాణం పూర్తికాగా 10 వేల ఎకరాలు మిగిలేది. వాటిని విక్రయించుకంటే ప్రభుత్వానికి రూ.2 నుంచి రూ.3 లక్షల కోట్ల ఆదాయం వచ్చేది. వాటి ద్వారా సంక్షేమ పథకాలు అమలు చేసుకునేవాళ్లం. ఉన్నచోటే పనలు చేసుకునేవాళ్లు. నేడు మట్టి, పాచి పనులు చేయటానికి కూడా వేరే ప్రాంతాలకు వెళ్తున్నారంటే సిగ్గు అనిపించదా జగన్?

అమరావతే రాజధాని అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి తర్వాత మూడు రాజధానులు అని డ్రామాలు ఆడాడు. ఇప్పుడేమో నాలుగో రాజధానిగా హైదరాబాద్ ఉండాలంటున్నారు. బిక్ష మొత్తుకుంటే ఆస్తిలో ఎవరైనా వాటా ఇస్తారా? విభజన జరిగింది..రాష్ట్రం నష్టపోయింది. నేను రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని పోరాటం చేశాను.

సరైన న్యాయం చేయాలని నాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెప్పినా వినకుండా రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని బీజీపీతో విడిపోయాం. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్న జగన్ హామీ ఏమైపోయిందో..రాష్ట్రాన్ని జగన్ రెడ్డి సర్వనాసనం చేశాడు. కేంద్రం సాయం చేస్తామన్నా తీసుకోలేని మూర్ఖుడు జగన్ రెడ్డి.

పడిపోయిన వృద్ధిరేటు

దేశంలోనే నెంబర్-1 అభివృద్ధి రాష్ట్రంగా ఏపీని మార్చాను. టీడీపీ హయాంలో 14 శాతం ఉండే వృద్ధిరేటు…ఈ ప్రభుత్వం వచ్చాక 10.93 శాతానికి పడిపోయింది. సంవత్సరానికి రూ.30 వేలకోట్ల ఆదాయం ప్రభుత్వానికి తగ్గిపోయింది. విభజన జరిగినప్పుడు తలసరి ఆదాయం ఏపీ, తెలంగాణ మధ్య 35 శాతం తేడా ఉండేది. మనకంటే తెలంగాణ 35 శాతం అధికంగా తలసరి ఆదాయం ఉంటే…2014 తర్వాత ఏపీలో సుపరిపాలన ద్వారా వ్యత్యాసాన్ని 27.5 శాతానికి తెచ్చాను.

ఇప్పుడు జగన్ నిర్వాకం వల్ల తలసరి ఆదయాంలో రాష్ట్రం తెలంగాణతో పోల్చితే నేడు ఏపీ 44 శాతం తక్కువగా ఉంది. మళ్లీ రాష్ట్రాభివృద్ధి జరగాలంటే తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రావాలి..సునామీ వచ్చి రామరాజ్య స్థాపన జరగాలి.

ఆడబిడ్డలకు చేయూతనిస్తా

ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కును, 9 శాతం స్థానిక సంస్థల్లో మహిళలకు ఎన్టీఆర్ రిజర్వేషన్ కల్పించారు. నేను డ్వాక్రా సంఘాలు పెట్టి ఆడబిడ్డలు ఆర్థికంగా పైకి రావడానికి కృషి చేశాను. ఉద్యోగాల్లో, కాలేజీ ప్రవేశాల్లో 33 శాతం రిజర్వేషన్ అవకాశం మహిళలకు కల్పించాం.

పిల్లలే సమాజానికి ఆస్తి. అందుకే తల్లికి వందనం ద్వారా యేటా రూ.15 వేలు ఇస్తాం. దీపం పథకం ద్వారా యేటా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తాం. యువతే నా ఆస్తి..నా ఆశ యువతపైనే ఉంది. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలే మా బాధ్యత. యేటా జాబ్ క్యాలెండర్లు ఇస్తాం, మెగా డీఎస్సీలు నిర్వహిస్తాం. ఉద్యోగం రాకపోతే వచ్చే వరకు నెలకు రూ.3 వేల భృతి ఇస్తాం.

ఇప్పుడు సింగపూర్ కంటే హైదరాబాద్ బ్రహ్మాండంగా రానిస్తోంది. అది నా విజనరీ. నేను విజనరీ…జగన్ ప్రజనరీ 52 రోజులు యువత ఇంట్లో ఉండొద్దు… సైకిల్ ఎక్కి తెలుగుదేశం-జనసేన జెండాలు పట్టుకోవాలి. యువతకు జగన్ గంజాయి అలవాటు చేశాడు. గంజాయి భవిష్యత్తు కావాలా…బంగారు భవిష్యత్తు కావాలో ఆలోచించుకోవాలి.

టీడీపీ-జనసేనతోనే బంగారు భవిష్యత్తు సాధ్యం. తుపాను వచ్చి రాష్ట్రంలో 12 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులు నష్టపోయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం పంట కాలువలను తవ్వలేని…పూడికతీయలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది. భవిష్యత్తులో ఏ రైతుకూ అన్యాయం జరగకుండా రైతును రాజు చేయడం తెలుగుదేశం-జనసేన తీసుకుంటాయి. అందుకే అన్నదాత కింద రూ.20 వేలు యేటా ఆర్థిక సాయం చేస్తాం. సబ్సీడీలు కూడా అందిస్తాం.

రాష్ట్రంలో పులివెందుల పంచాయితీలు

ఇటీవల వాలంటీర్ల మీటింగ్ లో చొక్కా మడత పెడతపెట్టాలంటున్నాడు. నువ్వు చొక్కా మడత పెడితే మా తమ్ముళ్లు కుర్చీలు మడతపెడతారు..నీ కుర్చీ ఊడిపోతుంది. ఇస్త్రీ పెట్టెతో మీకు వాతలు పెట్టేరోజులు దగ్గర్లోనే ఉన్నాయి. పులివెందుల పంచాయితీలను రాష్ట్రంలో చేస్తున్నాడు.

అవినీతిలో మునిగిన వైసీపీ ఎమ్మెల్యేలు

చీరాలలో ఛీ కొట్టిన వ్యక్తిని తీసుకువచ్చి పర్చూరుకి ఇన్చార్జ్ గా నియమించారు. అమరావతిలో ఓ పెద్ద సైకో ఇక్కడేమో చిన్న సైకో. ఫాం-7 ను ఉపయోగించి 14 వేల ఓట్లు తొలగించాడు. దొంగ ఓట్లపై ఏలూరి సాంబశివరావు పోరాడాడు. దీనికి బాధ్యులైన ముగ్గురు పోలీసులు సస్సెండ్ అయ్యారు. రాష్ట్రంలో కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమైంది. దుర్యోధనుడు ఎక్కడ దాక్కన్నా వదిలేదిలేదు. చెరుకు తోటలను కాల్చడం తప్ప ఏదీ చేతకాని దద్దమ్మ బాపట్ల ఎంపీ. కబ్జాలు, బెదిరింపులు, అక్రమాలు తప్ప పార్లమెంటులో పొడిచిందేమీ లేదు.

అమరావతి రోడ్లు తవ్వి గ్రావెల్ ఎత్తుకుపోతున్నాడు..అన్నీ అయిపోయి ఇప్పుడు సినిమా తీస్తున్నారు. త్వరలో ప్రజలే మీకు రియల్ సినిమా చూపిస్తారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే బాల వీరాంజనేయులపై దాడికి వచ్చాడు… సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు. వీరాంజనీయులు హీరో అయితే…సుధాకర్ బాబు జీరో అయ్యాడు. ఇప్పుడు అతని సీటే గల్లంతయ్యింది.

కోన రఘుపతి…అధికారంలోకి వచ్చాక కమర్షియల్ రఘుపతిగా మారాడు. సెంటుపట్టా స్థలాల్లో రూ.20 కోట్లు కొట్టేశాడు. కప్పం కట్టందే ఏ పనీ కానివ్వడు. రూ.100 కోట్లు ఇసుక ద్వారా సంపాదించాడు. వేమూరులోని చెత్త సంతనూతలపాడులో సెంటు అవ్వదు. చెత్తను డంపింగ్ యార్డుకు పంపిస్తాను. చీరాలలో కరణం బలరాంను ఎమ్మెల్యేగా గెలిపిస్తే బావుకుందామని వైసీపీలోకి వెళ్ళాడు. ఇప్పుడు మరలా తిరిగి వస్తాను గెలిపించండి అంటున్నాడు.

రేపల్లెలో తన అక్కను వేధిస్తున్నాడని ఎదురు తిరిగిన అమర్నాథ్‌ను దహనం చేస్తే ముఖ్యమంత్రి పంట్టించుకోలేదు. మోపిదేవి వెంకటరమణకు శాశ్వతంగా పేకాట ఆడే రోజుకు జగన్ రెడ్డి తీసుకువచ్చాడు. వీళ్ళందర్నీ చిత్తు చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇంకొల్లులో ముస్లీం సోదరులు ఎక్కువగా ఉన్న చోట ఆటోనగర్‌ ఏర్పాటు చేస్తాం.

పర్చూరులో 25వేల మందికి రెండు సెంట్ల చొప్పున స్థలం ఇచ్చి ఇచ్చి ఇళ్లు కట్టిస్తాం. చీరాలలో టెక్స్‌ టైల్ పార్కును ఏర్పాటు చేస్తాం. మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గం ఉన్న చేనేతలకు 500 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇస్తాం. చీరాల, బాపట్ల బీచ్ లను అభివృద్ధి చేస్తాం. నార్కట్ పల్లి-అద్దంకి-మేదరమెట్ల రహదారి విస్తరణ చేస్తాం. ఎర్రంచిన్నపాలిరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ను పూర్తి చేస్తాం.

గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోతే గేట్లు పెట్టలేని దద్దమ్మ జగన్ రెడ్డి. వాటికీ మరమ్మత్తులు చేస్తాం. గ్రానైట్ పరిశ్రమకు పూర్వ వైభవం తీసుకువస్తాం. గుంటూరు ఛానెల్ విస్తరణ కోసం రూ.200 కోట్లు మంజూరు చేస్తే దానిని నిలిపివేశారు.

గోదావరి నీళ్ళను నాగార్జున సాగర్ రైట్ మెయిన్ కెనాల్ కు తీసుకువచ్చి పంటలకు నీళ్ళు ఇస్తాం. అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తాం. పండుగ కానుక, విదేశి విద్య, చంద్రన్న భీమా..ఇలా జగన్ రద్దు చేసిన పథకాలను మళ్లీ అమలు చేస్తాం. నల్లమడుగు వాగును ఆధునీకరణ చేస్తాం.

 

LEAVE A RESPONSE