జగన్ రెడ్డి పాలనలో రైతుల ఇళ్లలో చీకటి కాంతులు

– రైతు భరోసాలో అంకెల గారఢీ- అసలు ఎంత విడుదల చేశారో సమాధానం చెప్పాలి– అన్నదాతలను ఆదుకోవడంలో విఫలం
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కె. అచ్చెన్నాయుడు
రైతుల లోగిళ్లలో చీకటి కాంతులు నింపి కోట్ల రూపాయల ప్రకటనలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారు. రైతు భరోసాలో అంకెల గారఢీతో అన్నదాతలను మోసం చేస్తున్నారు. నిన్న రైతు భరోసా పేరుతో ఎన్ని నిధులు విడుదల చేశారో ప్రజలకు చెప్పే దమ్ము ఉందా? నిన్న రైతు భరోసా కింద విడుదల చేసింది కేవలం రూ.30 కోట్లు మాత్రమే. రూ.1213 కోట్లు విడుదల చేస్తున్నట్లు చెప్పడం రైతులను మోసం చేయడమే. ఇప్పటివరకు రైతు భరోసా పేరుతో రూ.18,777 కోట్లు చెల్లించామనేది పచ్చి అబద్ధం. ఇందులో 60శాతం వరకు నిధులు కేంద్ర ప్రభుత్వానివి. అంకెల గారఢీతో రాష్ట్ర ప్రజలను తప్పదారి పట్టిస్తున్న జగన్మోహన్ రెడ్డి రైతులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. ఓ వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించక, మరోవైపు పెట్టుబడి వ్యయం పెరిగి రైతులు క్రాప్ హాలిడేలు ప్రకటిస్తుంటే.. జగన్మోహన్ రెడ్డి మాత్రం పెద్దఎత్తున సాయం అంటూ వందల కోట్ల రూపాయల ప్రకటనలతో వారిని మోసం చేస్తున్నారు.
64.06 లక్షల మందికి రైతు భరోసా పథకం వర్తింపజేస్తామని హామీ ఇచ్చి.. అమలులో మాత్రం 45 లక్షల మందికి కుదించారు. 15.36 లక్షల మంది ఉన్న కౌలు రైతులను 41వేలకు కుదించారు. ఇది నమ్మకద్రోహం కాదా? ఒకేదఫాలో రూ.12,500 ఇస్తామని హామి ఇచ్చి 3 దఫాల్లో రూ.7,500 మాత్రమే చెల్లిస్తున్నారు. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6 వేలు చొప్పున ఐదేళ్లకు రూ.30 వేలు నష్టపోతున్నారు. ప్రతి రైతు కుటుంబానికి ఐదేళ్లలో రూ.50 వేల వరకు లబ్ధి చేకూరుస్తామని మేనిఫెస్టోలో తెలిపి.. రూ.37,500 మాత్రమే ఇస్తూ.. రూ.67,500 ఇస్తున్నట్లుగా అసత్యాలు చెబుతున్నారు.
సాగునీటి ప్రాజెక్టులను జగన్ రెడ్డి పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. చంద్రబాబు గారి హయాంలో 23 ప్రాజెక్టులు పూర్తిచేసి 32 లక్షల ఎకరాలను స్థిరీకరించారు. ఐదేళ్లలో చంద్రబాబు గారు రూ.64వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. మూడు విడతలలో రుణమాఫీ కింద రూ.15,279 కోట్లు రైతుల ఖాతాలలో చంద్రబాబునాయుడు గారు జమ చేయడం జరిగింది. రూ.50వేల లోపు రైతు రుణాలను ఒకే దఫాలో రద్దు చేశారు. రైతు రుణమాఫీ ద్వారా ఒక్కో రైతు రూ.1,10,000 లబ్ధి పొందారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే.. 4, 5 విడతల రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు రూ.40వేలు, అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.15 వేలు చొప్పున ఐదేళ్లలో 1,15,000 వచ్చి ఉండేవి. జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నది కేవలం రూ.37,500 మాత్రమే.
జగన్మోహన్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రెండున్నరేళ్లలో సుమారు 1500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.7 లక్షల పరిహారం చెల్తిస్తామని చెప్పి మోసం చేశారు. లక్ష లోపు రుణం తీసుకున్న రైతుకే సున్నా వడ్డీ పరిమితం చేస్తూ జీవో 464 విడుదల చేశారు. చంద్రబాబు గారి పాలనలో రైతు వడ్డీని ప్రభుత్వమే చెల్లించేది. జగన్‌ పాలనలో వడ్డీని రైతు బ్యాంకుకు ముందుగానే చెల్లించాల్సిన పరిస్థితి. జగన్ రెడ్డి పాలనలో డ్రిప్‌ ఇరిగేషన్‌ పథకం అటకెక్కింది. రైతు రథం పథకాన్ని రద్దు చేశారు. ఇప్పుడు యంత్ర సేవా పథకం పేరుతో రైతులను మోసం చేస్తున్నారు. రైతుకు ఇప్పటి వరకు ఒక్క వ్యవసాయ యంత్ర పరికరాన్ని కూడా అందజేయలేదు. ఇప్పటికైనా అంకెల గారఢీ మానుకుని కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలి.

Leave a Reply