రాజ్యసభలో వి.విజయసాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు
న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కోవిడ్ మహమ్మారితోపాటు వర్షాల కారణంగా కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్ (కేఎస్పీఎల్) నిర్మాణ పనుల్లో జాప్యం జరిగినట్లు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తెలి తెలిపారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు.
కాకినాడ-వైజాగ్-శ్రీకాకుళం మధ్య సహజవాయువు పైప్ లైన్ నిర్మాణానికి పెట్రోలియం, నాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ) 2014 జూలై 16న ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ను అనుమతించినట్లు మంత్రి చెప్పారు. కేఎస్పీఎల్ పైప్ లైన్ ప్రాజెక్ట్లోని కాకినాడ-వైజాగ్ సెక్షన్ను 2021 జూన్ 30 నాటికి, వైజాగ్-శ్రీకాకుళం సెక్షన్ను 2022 జూన్ 30 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
అయితే కోవిడ్ మహమ్మారి విజృంభణ, ఎడతెరిపిలేని వర్షాల కారణంగా పైప్ లైన్ నిర్మాణ పనుల్లో జాప్యం జరిగింది. దీంతో కాకినాడు-వైజాగ్ సెక్షన్ నిర్మాణ గడువును 2022 సెప్టెంబర్ 30, వైజాగ్-కాకినాడ సెక్షన్ గడువును 2023 సెప్టెంబర్ 30 వరకు పొడిగించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ సంస్ష పీఎన్జీఆర్బీని కోరినట్లు మంత్రి వెల్లడించారు.