Home » రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర

రైతులకు చట్టబద్ధంగా మద్దతు ధర

-దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో 30 లక్షల ఉద్యోగ ఖాళీలు
-మోడీ , అమిత్ షా ఆందోళనలో ఉన్నారు
-పంజాబ్ ఎన్నికల ప్రచారంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఫరీద్ కోట్ : ఇండియా కూటమి అధికారంలోకి రాగానే చట్టబద్ధంగా రైతులకు కనీస మద్దతు ధరను అందిస్తాం, రైతుల కష్టానికి తగిన ఫలితం రాబోయే రోజుల్లో దక్కనుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం పంజాబ్ రాష్ట్రంలోని ఫరీద్ కోట్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని మొగ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో భట్టి విక్రమార్క పలు సమావేశంలో ప్రసంగించారు.

దేశంలో వరి, పత్తి, చెరకు రైతులకు మద్దతు ధర లభించడం లేదు నరేంద్ర మోడీ నల్ల చట్టాలు తెచ్చి వారి ధనాన్ని లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు అని ఆరోపించారు. దేశంలోని నిరుద్యోగులకు అప్రెంటిషిప్ హక్కు కల్పిస్తూ కొత్త చట్టాన్ని తీసుకొస్తామన్నారు. దేశంలోని పట్టభద్రులు, డిప్లమా చేసిన వారందరికీ ఈ హక్కు ఇవ్వబోతున్నామన్నారు. దేశంలోని పబ్లిక్ ప్రైవేటు సెక్టార్లలో సుమారు 30 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.

ఆగస్టు 15 లోపు ఈ ఉద్యోగాలను ఇండియా కూటమి ప్రభుత్వం భర్తీ చేస్తుంది, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలో ఆసుపత్రుల్లో నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తాం అన్నారు. ఒక ఏడాది కాలం పక్కగా తొలి ఉద్యోగం లభిస్తుంది. ఉచిత శిక్షణ అందుతుందన్నారు. కోట్లాదిమంది నిరుద్యోగులకు ఏడాదికి లక్ష రూపాయల నగదు వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు.

నెలకు రూ .8500 వేస్తాం, ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు లభిస్తున్న రోజువారి కూలీలు రూ. 250 నుంచి రూ. 400 కు పెంచుతాం, ఆశ అంగన్వాడి మహిళల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని వివరించారు. గత పది సంవత్సరాల కాలంలో మోడీ 25 మందికి సంబంధించిన రూ. 16 లక్షల కోట్ల అప్పులు మాఫీ చేశారు. ఆ విధంగా ఆయన 24 ఏళ్ల పాటు ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేందుకు సరిపడా డబ్బులను వారికి ఇచ్చారు అని తెలిపారు.

బిజెపి ప్రభుత్వం 25 మందిని కుబేరుని చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లాదిమంది దేశ ప్రజల్ని లక్షాధికారులని చేస్తుందని భరోసా ఇచ్చారు. మోడీ, అమిత్ షా ఆందోళనలో ఉన్నారు. అభివృద్ధిని చూసి ఓటు వేయమని మోడీ అడగడం లేదు. మటన్, మందిర్, మంగళసూత్రం, మైనార్టీతో లాంటి అంశాలనే ప్రధాని మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ను చూసి బిజెపి భయపడుతుంది, అందుకే కాంగ్రెస్ నేతల్ని టార్గెట్ చేసి మోడీ విమర్శలు చేస్తున్నారని తెలిపారు.

ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల్లో ఎస్సీ, ఎస్టీలు ఎందరో చెప్పడం లేదు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రిజర్వేషన్ ప్రకారం పోస్టులు ఇస్తాం. మహిళలకు 50 శాతం జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తాం అన్నారు.

Leave a Reply