Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రలోభాలకు లొంగిపోవద్దు

• వైసీపీ అవినీతి సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని చూస్తోంది
• గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి ఆశీర్వదించండి
• నేను జగన్ లా మాటలు చెప్పను.. పిఠాపురం ప్రజలకు అండగా ఉంటా
• మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాం… రూ. 20 వేల వేట విరామ భృతి
• పిఠాపురం నియోజకవర్గం ఎన్నికల ప్రచార ర్యాలీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్

‘వైసీపీ అవినీతి సొమ్ముతో పిఠాపురం ప్రజల ఓట్లు కొనాలని చూస్తోంది. ముఖ్యంగా మత్స్యకార గ్రామాల్లో డబ్బు, మద్యం వెదజల్లి గెలవాలని చూస్తోంది. అది ప్రజల ఆరోగ్యాలు నాశనం చేసిన కల్తీ మద్యం తాలూకు డబ్బు. వైసీపీ ప్రలోభాలకు తలొగ్గవద్దు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి కూటమికి మద్దతు తెలపండి. పిఠాపురం అభివృద్ధికి కట్టుబడి ఉంటామ’ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. పిఠాపురం ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి మద్దతు తెలపగా, జన ప్రభంజనం మధ్య పవన్ కళ్యాణ్ రోడ్ షో సాగింది. రోడ్ షోలో భాగంగా చిత్రాడ, జగ్గయ్యచెరువు, పాదగయ క్షేత్రం సర్కిల్, గొల్లప్రోలు, మల్లవరం, కోనపాపపేట, మూలపేట, ఉప్పాడ తదితర గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గ్రామగ్రామాన గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి తనతో పాటు కాకినాడ పార్లమెంటు ఎంపీ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ… పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని చాలా గ్రామాల్లో తాగునీరు, సాగునీటి సమస్యలు ఉన్నాయి. డ్రెయిన్లలో పూడికలు తీసే దిక్కు లేక మురుగునీటి పారుదల ఇబ్బందికరంగా తయారయ్యింది. చెత్త పన్ను వసూలు చేస్తున్న ఈ చెత్త ప్రభుత్వం రోడ్ల వెంట ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటోంది. ఎస్ఈజెడ్ పరిధిలో ఉపాధి అవకాశాలు లేవు. మత్స్యకారులకు భరోసా లేదు.

కెమికల్ ఫ్యాక్టరీలు వదిలే రసాయన వ్యర్ధాలు మూలంగా మత్స్య సంపదను దెబ్బ తింటోంది. రిలయన్స్, ఒ.ఎన్.జి.సిల డ్రిల్లింగ్ కి మత్స్య సంపద చెదిరిపోతోంది. ఆయా కంపెనీల నుంచి న్యాయంగా మత్స్యకారులకు అందాల్సిన పరిహారం అందడం లేదు. తీర ప్రాంతం కోతకు గురై గ్రామాలు కోతకు గురవుతుంటే పట్టించుకునే నాధుడు లేడు. గాజు గ్లాసు గుర్తు మీద ఓటు వేసి నన్ను గెలిపించండి. కూటమి నాయకత్వంతో కలసి మత్స్యకారుల సమస్యలు పరిష్కరిస్తాం.

మత్స్యకారులకు అండగా ఉంటాం. సబ్సిడీ డీజిల్ తీర ప్రాంతాలకు అందుబాటులో ఉంచుతాం. వేట విరామ భృతి రూ. 20 వేలు అందచేస్తాం. సబ్సిడీపై వేట సామాగ్రి అందచేస్తాం. తీర ప్రాంతం కోతకు గురి కాకుండా జీయో ట్యూబ్ వ్యవస్థను తీసుకువస్తాం. కెమికల్ ఫ్యాక్టరీలు సముద్ర జలాలను విషతుల్యం చేయకుండా కాలుష్యకారకాలను శుద్ధి చేసిన తర్వాత సముద్రంలోకి వదిలేలా చర్యలు తీసుకుంటాం. ఇంటింటికీ ఉద్యోగాలు ఇస్తామని ఎస్ఈజెడ్కి భూములు తీసుకుని మాట తప్పారు. అక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. సెజ్ బాధితుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాము.

రోడ్ షో లో పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ వర్మ , బీజేపీ ఇంఛార్జ్ కృష్ణంరాజు , జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సాగర్, జానీ మాస్టర్, పెద్ద సంఖ్యలో మూడు పార్టీల శ్రేణులు పాల్గొన్నాయి.

LEAVE A RESPONSE