– నీ మాటలవల్ల తెలంగాణ సమాజం తలదించుకుంటుంది
– దేశంలో మన పరువుపోయింది
– కావాల్సింది సుందరాంగుల పోటీలు కాదు
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి నీకు చేతకాకపోతే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్న. ఎన్నికలప్పుడు నువ్వు పలికిన ప్రగల్భాలు, ఇచ్చిన హామీలు నేను నెరవేర్చలేనని బేషరతుగా క్షమాపణ చెప్పు. ముక్కు నేలకు రాసి తప్పుకో.
చేతనైన వారు వస్తారు చేస్తారు. లేదు సిగ్గుమాలిన పద్ధతిలో అలానే కొనసాగుతా అంటే సందర్భం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. నిన్ను గెలిపించిన ఖర్మానికి అప్పటివరకు భరిస్తారు.
నీ మాటలవల్ల తెలంగాణ సమాజం తలదించుకుంటుంది. దేశంలో మన పరువుపోయింది. తెలంగాణ ప్రజలు, ఉద్యోగులు భయపడేవారు కాదు. ప్రేమకు లొంగుతారు బెదిరింపులకు కాదు. మాయచేసుడు మత్తరించుడు తెలంగాణ ప్రజల రక్తంలో ఉండదు బిడ్డా. ఎస్మా ప్రయోగించిన వారి గతమేయ్యిందో తెలుసుకదా.
దసరా పండుగే వద్దు తెలంగాణ కావాలని కొట్లాడిన గొప్పవారు ఆర్టీసీ కార్మికులు.
రేవంత్ రెడ్డి దివాలా కోరు ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డి అబద్దాలకోరని తేలిపోయింది. 2014 లో 30 వేల కోట్ల ఓన్ టాక్స్ రెవెన్యూ ఉన్న రాష్ట్రం 11 ఏళ్లలో లక్ష 30 వేల కోట్ల ఆదాయంకు చేరుకుంది అంటే ఇది దివాలా రాష్ట్రమా ?
లక్షకోట్ల బడ్జెట్ మూడు లక్షల కోట్లకు పెరగడం దివాలానా ? నిన్ను CM చేసిన ఖర్మానికి నువ్వు ధ్వంసం చేస్తున్నది తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ రాష్ట్ర గొప్పతనాన్ని.
ఇది నీ సిగ్గు మాలినతనానికి, నీ బుద్ధిలేనితనానికి, అనుభవలేమికి నిదర్శనం.
ఇంత చేతకానితనంతో ఎందుకు ప్రజల దగ్గరికి వచ్చి ఓట్లు వేయమని అడిగావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్న మాటలు యావత్ తెలంగాణ ప్రజలు తలదించుకునేలా, వారి ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఉన్నాయి. మొత్తం తెలంగాణ సమాజమే దిగజారిపోయేందనేలా ఆత్మన్యూనతా భావంతో మాట్లాడుతున్నారు.
తెలంగాణ ఎన్నడూ కూడా పేదది కాదు.. తెలంగాణ పేదరికంలో ముంచబడింది.
తెలంగాణకు 50 శాతం పైబడి ఆదాయం హైదరాబాద్ నుంచే వస్తోందని చెప్పినం. కానీ, అలాంటి రాష్ట్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి…. ఒక వ్యక్తిని, పార్టీని దృష్టిలో పెట్టుకుని .. ఇవాళ దివాళా తీసిందని పదేపదే చెబుతూ ఆయన దివాళాకోరుతనాన్ని బయటపెట్టుకుంటున్నారు.
పరిపాలించే చేతగాక, చేవలేక, అనుభవం లేక, మాటల్లో, చేతల్లో గంభీరత లేని రేవంత్ రెడ్డి.. చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాళాకోరు రాష్ట్రంగా.. తెలంగాణ ప్రజలను ఎందుకు పనికిరానివారుగా చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.
గత పదేళ్లలో వరి ఉత్పత్తిలో, జీఎస్డీపీ వృద్ధిలో, తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది. అనేక రాష్ట్రాల కంటే ఎక్కువ బడ్జెట్ తో ముందుకు సాగింది. ఇటీవల భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్లో నాలుగు కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం రూ. 3 లక్షల 4 వేల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు — దివాళా తీసిన రాష్ట్రమా అది?
రెవెన్యూ పరంగా: నేను ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో (2014-2019), రాష్ట్ర ఆదాయం క్రమంగా పెరిగింది: 2014–15లో రూ. 29,285 కోట్లు, 2015–16లో రూ. 39,975 కోట్లు, 2016–17లో రూ. 48,000 కోట్లు, 2017–18లో రూ. 56,528 కోట్లు, 2018–19లో రూ. 64,000 కోట్లు, 2019–20లో రూ. 67,597 కోట్లు, కరోనా కాలంలోనూ 2020–21లో రూ. 66,000 కోట్లు, 2021–22లో రూ. 96,845 కోట్లు, 2022–23లో రూ. 1,07,000 కోట్లు, 2023–24లో రూ. 1,19,000 కోట్లు, 2024–25లో సైతం రూ. 1,28,000 కోట్ల ఆదాయం ఉంది. 2025లో దాదాపు రూ. 1,30,000 కోట్లు రాష్ట్ర ఆదాయం ఉంది. ఈ లెక్కలు స్పష్టంగా బలమైన ఆర్థిక స్థితిని సూచిస్తున్నాయి. దీన్ని దివాళా అని ఎలా అంటారు?
నాన్-ట్యాక్స్ ఆదాయం విషయానికొస్తే.. 2014–15లో రూ. 6,447 కోట్లు, 2022–23లో రూ. 19,554 కోట్లు (భూముల అమ్మకాల వలన), 2023–24లో రూ. 23,020 కోట్లు, 2024–25లో (మార్చ్ మినహాయిస్తే) రూ. 6,000 కోట్లు, ఇలాంటి స్థిరమైన ఆదాయ వృద్ధి వున్నప్పటికీ.. రేవంత్ రెడ్డి అనవసరంగా ‘దివాళా’ మాటలు మాట్లాడటం దురుద్దేశంతో నిండినది.
భారత ప్రభుత్వం నుంచి వచ్చే ట్యాక్స్ డెవల్యూషన్ ద్వారా వచ్చే వనరులు కూడా ఇలా ఉన్నాయి:
2014–15లో రూ. 8,189 కోట్లు, 2022–23లో రూ. 19,668 కోట్లు, 2023–24లో రూ. 16,536 కోట్లు (మార్చ్ మినహాయిస్తే) మొత్తంగా, 2014లో రాష్ట్ర రెవెన్యూ రూ. 51,000 కోట్లు ఉండగా, 2025 నాటికి అది రూ. 1,56,000 కోట్లకు చేరింది. తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూడా 2014లో కేవలం ఎఫ్ఆర్బీఎం రుణం వచ్చింది కేవలం రూ. 9,410 కోట్లు మాత్రమే.. కానీ నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏడాదిలో ఎఫ్ఆర్బీఎం కింద తీసుకున్న అప్పు రూ. 64,457 కోట్లుగా ఉంది.
ఒకవేళ అప్పుతీసుకునేందుకు ఎల్జిబిలిటీ లేకపోతే, బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు అంగీకరించకపోతే.. మరి బ్యాంకుల నుంచి రూ. 64,457 కోట్ల అప్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎలా తెచ్చుకోగలిగింది? ఏ రాష్ట్రంలో అయితే పెట్టుబడి వ్యయం పెరుగుతుందో.. ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనడానికి నిదర్శనం.
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి వ్యయం విషయంలో కూడా 2014-15లో రూ. 8,373 కోట్లు ఉంటే.. 2023-24 లో రూ. 44 వేల కోట్లు, .. రేవంత్ రెడ్డి సర్కారులో కూడా రూ. 32 వేల కోట్లుగా ఉంది. 2024-25లో రూపాయి కూడా సాంక్షన్ లేదని చెబుతున్నా కూడా రూ. 32 వేల కోట్లు ఉంది. తెలంగాణలో గ్యారంటీ రుణాలను పక్కనపెడితే… ఇప్పటికీ కూడా తెలంగాణకు ఉన్న అప్పు రూ. 4 లక్షల 63 వేల 583 కోట్లు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు కూడా రూ. 77 వేల 333 కోట్ల అప్పు ఉండేది. 2024-25లో తెలంగాణ రాష్ట్రానికి గ్యారంటీ రుణాలు పక్కనపెడితే ఉన్న అప్పు రూ. 4 లక్షల 63 వేల 583 కోట్లు గా ఉంది.కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ 2015లో ప్రవేశపెట్టినప్పుడు వచ్చిన ఆదాయం కేవలం రూ. 73వేల కోట్లు. ఇవాళ జీఎస్టీలో వస్తున్న ఆదాయం రూ. 2 లక్షల 40 వేల కోట్లుగా ఉంది.
జీఎస్టీలో… స్టేట్ జీఎస్టీ.. సెంట్రల్ జీఎస్టీ ఉంటుంది. 2014 -15లో లక్ష కోట్ల బడ్జెట్ పెట్టిన తెలంగా రాష్ట్రంలో… 11 సంవత్సరాల కాలం తర్వాత భట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రూ. 3 లక్షల 4 వేల కోట్లుగా ఉంది. మరి రాష్ట్రం పురోగమిస్తున్నట్లా? అభివృద్ధి చెందుతున్నట్లా? దివాళా తీస్తున్నట్లా?
రూ. 9 వేల కోట్ల అప్పు పుట్టేందకు ఎల్జిబిలిటీ ఉన్న రాష్ట్రంలో.. కేవలం ఒక్క సంవత్సరం కాలంలోనే రూ. 64 వేల కోట్లు అప్పు తెచ్చుకున్నరంటే పతార ఉన్నట్లా? లేనట్లా? మొత్తం దేశంలో జీఎస్డీపీ .. తెలంగాణ రాష్ట్రం 14 శాతంగా ఉంది. 2025-26 కి రూ. 18 లక్షల కోట్ల సంపద సృష్టించబడుతుందని అంచనా వేయడం జరిగింది.
సంపద సృష్టించబడుతుంటే.. దివాళా తీసిన రాష్ట్రమని ఎట్ల అంటావ్ రేవంత్ రెడ్డి? కేవలం ఒకే ఒక్క సంవత్సరంలో రూ. 64 వేల కోట్ల అప్పు తెచ్చుకుని, అప్పుపుట్టట్లేదని ఎట్ల అంటవ్? ఏం నీతి నీది రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజలు గమనించాలి. పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో జనాభా 5 కోట్లకు పైనే. కేంద్ర ప్రభుత్వం సహకారంతో అభివృద్ధిలో ముందుకెళ్తోంది.
ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ.. ఇలా 6 గ్యారంటీల పేరుతో, 66 హామీలు ఇచ్చినప్పుడు, ఎట్ల అమలవుతుంది అని ప్రశ్నించిన. అప్పుల కుంపటి అని మాట్లాడిన రాష్ట్రంలో.. ఏ ధైర్యంతో, ఏ నమ్మకంతో మీరు గ్యారంటీలు, హామీలు ఇచ్చిన్రు? మనసుంటే మార్గముంటుందని, కడుపు కట్టుకుని కష్టపడితే రూ. 40 వేల కోట్లు లెక్కకాదని రేవంత్ రెడ్డి మాట్లాడిండు. రైతు రుణమాఫీని ఒకే సంవత్సరంలో అమలు చేస్తానని చెప్పిండు.
2024 ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు, ఇవాళ మాట్లాడుతున్న మాటలకు తేడా ఎంతుందో తెలంగాణ ప్రజలు గమనించాలి. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి ముడిపడి ఉందని నమ్మే నాయకుడు ప్రధాని నరేంద్ర మోదీ. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీల్లో పనిచేసే కార్మికులకు పైసల్లేవు. కాంట్రాక్టర్లు బిల్లుల కోసం ధర్నాలు చేస్తున్న పరిస్థితి. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు, మెస్ చార్జీలు ఇవ్వడం లేదు.
నిజంగా ఆపద ఉన్నపుడు గంభీరత ఉండాలి. ప్లానింగ్ ఉండాలి. మరింత కమిట్ మెంట్ ఉండాలి. మరింత కష్టపడే పద్ధతి ఉండాలి. కోఆర్డినేషన్ ఉండాలి. అనుభవజ్నులైన సలహాలతో పాలనను పటిష్టంగా ముందుకుతీసుకుపోవాలి. కానీ ఇంత తొందరగా నువ్వు కాడెత్తేస్తవని, తెలంగాణ సమాజాన్ని కుంగదీస్తవని, ఇంత తొందరగా దేశంలో తెలంగాణ పరువు తీస్తవని ఎవ్వరూ ఊహించలేదు. ఇది మీ దిక్కుమాలిన తనానికి, రేవంత్ రెడ్డికి పాలనలో అనుభవంలేనితనానికి నిదర్శనమని భావిస్తున్నాం.
తెలంగాణ ఆఫీసర్లు బ్యాంకులకు పోతే దొంగ లెక్క చూస్తున్నారని మాట్లాడతావా? దొంగ లెక్క చూస్తే 64 వేల కోట్ల రూపాయలు అప్పు ఎలా పుట్టింది? కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ కర్ణాటకలో అధికారం ఇస్తే, ఇలానే ఖతం పట్టించారు. తెలంగాణలో కూడా అదే పరిస్థితి తీసుకొచ్చారు. కాంగ్రెస్ ని ఆదర్శంగా తీసుకోండి రేవంత్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోండి అని మాట్లాడుతున్నారు ఇదా మీ ఆదర్శం? నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఖతం అవుతారు.
రాష్ట్రంలో ఉన్న స్కీములను కూడా నడపలేక కాడెత్తేసిండు రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రజలను వంచిస్తున్నడు. అధికారం అప్పజెప్పిన కర్మానికి వందేండ్లు చరిత్ర కలిగిన మా తెలంగాణ గొప్పతనాన్ని పాతరేయొద్దని రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం.
కావాల్సింది సుందరాంగుల పోటీలు కాదు. చేస్తే చేసుకో మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజల మీద దృష్టి పెట్టు. రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్ మెంట్ లో పోలీసులు, ఆర్టీసీ కార్మికులు రుణం తీసుకునే పరిస్థితి లేదు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ రావడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ వచ్చే పరిస్థితి లేదు. కళ్యాణలక్ష్మి డబ్బులు పిల్లలు పుట్టిన తర్వాత వస్తున్న పరిస్థితి ఏర్పడింది.
గత ముఖ్యమంత్రి ఆర్టీసీ కార్మికులు ధర్నా చేస్తే… సంఘాల ద్వారానే ఆర్టీసీ దివాళా తీసిందని చెప్పి, సంఘాలను క్లోజ్ చేసిండు. కానీ ఆ తర్వాత కార్మికులు మోకరిళ్లలే.. రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల ముందు మోకరిళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.
రూ. 18 వేల 500 కోట్ల ఆదాయం వస్తుందని రేవంత్ రెడ్డి చెబుతున్నడు. అంటే తెలంగాణలో రూ. 2 లక్షల 40 వేల కోట్లు సంవత్సరానికి వచ్చే ఆదాయం ఉంది. మరి ఎందుకు మేనేజ్ చేయడం లేదు? 2024-25లో భట్టి విక్రమార్క రూ. 2,91,159 కోట్లు బడ్జెట్ ప్రవేశపెడితే, అందులో రూ. 70 వేల కోట్లు ఖర్చు పెట్టలేకపోయినమని చెప్పిన్రు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ పదేళ్ల పాలనలో ఒక కుటుంబమే దోచుకుంటోందని, రాచరిక పాలన నడుస్తోందని ప్రచారం చేసిన్రు. బీఆర్ఎస్ పేవలంగా పరిపాలించారని కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి, కర్మానికి.. బీఆర్ఎస్ కు పదేళ్లు పడితే.. కాంగ్రెస్ కు కేవలం 10 నెలల్లోనే వైఫల్య పాలనతో వ్యతిరేకతను మూటగట్టుకుంది.
2024 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయలేనప్పుడు తెలంగాణ ప్రజల ముందు ముక్కునేలకు రాసి, భేషరతుగా క్షమాపణ చెప్పి పాలన నుంచి తప్పుకో. లేదంటే అట్లనే పాలన చేస్తనంటే.. ప్రజలు కర్రుగాల్చి వాతపెట్టక తప్పదని హెచ్చరిస్తున్నం.
ఎన్టీఆర్ హయాంలో ఉద్యోగులను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తే, ఏం జరిగిందో రేవంత్ రెడ్డి గుర్తుతెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన రిటైర్డ్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. ఉద్యోగుల డీఏలు చెల్లించాలని, ఆర్టీసీ కార్మికులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ సమాజం కుంగిపోవద్దు. మీకు అండగా బీజేపీ ఉంటుంది.
రాష్ట్ర బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్, రాష్ట్ర బిజెపి ఓబిసి మాజీ అధ్యక్షులు ఆలే భాస్కర్, అధికార ప్రతినిధులు వెంకటరెడ్డి, కట్ట సుధాకర్ రెడ్డి. బిజెపి నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.