– ఎడ్లబండిపై హిందూపురం నుంచి మంగళగిరికి 760 కిలోమీటర్ల ప్రయాణం
– దారి మధ్యలో అన్ని జిల్లాలో తిరిగి రైతు సమస్యలపై వాకబు
– వాటిని పవన్కు వివరించేందుకు తాడేపల్లి వచ్చిన రైతు నవీన్
– మూడురోజుల నుంచి పొన్ కోసం ఎదురుచూపు
విజయవాడ: అభిమానం ఏదైనా చేయిస్తుంది. తాను అభిమానించే వ్యక్తి కోసం ఎంతదూరమయినా వెళ్లేలా చేస్తుంది. ఇప్పుడు హిందూపురం నియోజకవర్గానికి చెందిన నవీన్ అనే ఓ యువ రైతు 760 కిలోమీటర్లు ఎడ్లబండిపై చేసిన యాత్ర కూడా అలాంటిదే. నవీన్ ఏం చేశారో మీరే చూడండి.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసేందుకు నవీన్ అనే యువ రైతు 760 కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణం చేసి, మంగళగిరి చేరుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. నవీన్ హిందూపురం నుంచి ఎడ్లబండిపై 28 రోజుల పాటు ప్రయాణించి ఇటీవల మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్నాడు.
రైతులు ఎదుర్కొంటున్న కష్టాలను డిప్యూటీ సీఎం పవన్ కు చెప్పాలని ఆ రైతు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మీదుగా వందలాది కిలోమీటర్లు ఎడ్లబండిపై ప్రయాణించాడు. ఆయా ప్రాంతాల్లోని రైతులతో మాట్లాడుతూ, వారి సమస్యలు కూడా తెలుసుకున్నాడు. గత మూడు రోజులుగా తాను పవన్ కోసం ఎదురుచూస్తున్నట్టు చెప్పాడు. రైతుల కష్టాలపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసేందుకు అనుమతించాలని ఆ రైతు అభ్యర్థించాడు.