యుద్ధవిమానం మోడల్‌పై హనుమాన్ బొమ్మను తొలగించిన హెచ్ఏఎల్

ఏరో ఇండియా-2023లో ప్రదర్శించిన హెచ్ఎల్ఎఫ్‌టీ-42 యుద్ధవిమానం మోడల్‌పైనున్న హనుమంతుడి చిత్రాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) మంగళవారం తొలగించింది. విమానం తోక భాగంలో ఈ చిత్రాన్ని ఏర్పాటు చేశారు.

స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘మరుత్’ యుద్ధవిమానం స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ‘హెచ్ఎల్ఎఫ్‌టీ-42’ విమానాన్ని రూపొందించింది. ఈ విమానం తాలూకు మోడల్‌ను బెంగళూరులో ప్రస్తుతం జరుగుతున్న ఏరో ఇండియా షోలో ప్రదర్శించింది. మరుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. పవనసుతుడు హనుమంతుడు కాబట్టి.. హెచ్ఎల్ఎఫ్‌టీ-42పై హనుమంతుడి చిత్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది.

అధునాతన ఎలక్ట్రానిక్ యుద్ధ నైపుణ్యాల్లో పైలట్లకు శిక్షణ ఇచ్చేందుకు హెచ్ఎల్ఎఫ్‌టీ-42ను రూపొందించారు. ఇందులో యాక్టివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఎరే, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సూట్, ఫ్లై బై వైర్ వంటి అత్యాధునిక వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం భారత్ వద్ద సబ్ సానిక్ హాక్-132, సూపర్ సానిక్ మిగ్-21 శిక్షణ విమానాలు ఉన్నాయి.

ఇక సోమవారం ప్రారంభమైన ఏరో ఇండియా-2023 షో ఐదురోజుల పాటు జరుగుతుంది. ఇందులో 700లకు పైగా రక్షణ రంగ సంస్థలు, 98 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారు. ఈ వైమానిక ప్రదర్శనతో భారత్‌లోకి 75 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా.

Leave a Reply