– గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం
అమరావతి: రాష్ట్రంలో రానున్న రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. రాయలసీమలో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
ఉష్ణోగ్రతలు 38°C నుంచి 40°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని చెప్పారు. హోర్డింగ్స్, చెట్లకింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిల్చోవద్దని సూచించారు. పిడుగులతో కూడిన భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోణంకి కూర్మనాథ్ అన్నారు.
20వ తేదీన తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్సార్, అన్నమయ్య, శ్రీసత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
మే 21 అనంతపురం, అన్నమయ్య, శ్రీసత్యసాయి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
మే 22 (గురువారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణ, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు.
అయితే, సోమవారం రాత్రి 7 గంటల నాటికి అల్లూరి జిల్లా ఏటపాకలో 41.2 మిల్లీమీటర్లు, మన్యం జిల్లా కురుపాంలో 36.7 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో 33.5 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు అయిందని అన్నారు.