అడవులతోనే మానవ మనుగడ సాధ్యం

– అటవీ యేతర భూముల్లో చెట్ల పెంపకంపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్
– రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు సీఎం వైయస్ జగన్ అధిక ప్రాధాన్యం
– 33 శాతంకు అడవుల విస్తీర్ణం పెంచాలన్నది సీఎం లక్ష్యం
– జగనన్న పచ్చతోరణం, సోషల్ ఫారెస్ట్, నరేగా ద్వారా పెద్ద ఎత్తున మొక్కల పెంపకం
– ఆర్బీకేల ద్వారా భూసార పరీక్షలు చేయిస్తున్నాం
– అటవీయేతర భూముల్లో పెద్ద ఎత్తున ఉద్యానవనాలను ప్రోత్సహిస్తాం
– యుఎస్ఎయిడ్ చేస్తున్న ప్రయత్నాలకు పూర్తి సహకారం అందిస్తాం
– అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ లో పచ్చదనాన్ని పెంచడానికి సీఎం వైయస్ జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో 23 శాతంగా ఉన్న అడవుల విస్తీర్ణంను 33 శాతంకు పెంచాలనే లక్ష్యాన్ని సీఎం వైయస్ జగన్ నిర్ధేశించారని తెలిపారు. విజయవాడలో యుఎస్ ఎయిడ్, కేంద్ర అటవీ, పర్యావరణశాఖల ఆధ్వర్యంలో అటవీయేతర ప్రాంతాల్లో చెట్ల పెంపకం (టిఓఎఫ్ఐ) కార్యక్రమం పై ఏర్పాటు చేసిన వర్క్ షాప్ కు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతీప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం టిఓఎఫ్ఐ బ్రోచర్ లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…
యుపి, హర్యానా, రాజస్థాన్, అస్సాం, ఒడిస్సా, తమిళనాడుతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ అటవీయేతర భూముల్లో చెట్ల పెంపకం కార్యక్రమంను అమలు చేసేందుకు కేంద్ర అటవీమంత్రిత్వ శాఖ, యుఎస్ఎయిడ్ సంస్థలు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు, వృక్షసంపద ద్వారా ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు పెంచేందుకు ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమం ప్రారంభించిన తరువాత కొత్తగా 2.8 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో అటవీయేతర భూముల్లో చెట్లు వృద్ది చెందడం శుభపరిణామం అన్నారు. ఒక ఏడాదికి 30 నుంచి 45 చెట్లు ఏకంగా ఒక టన్ను కార్బన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని, స్వచ్ఛమైన ఆక్సీజన్ ను అందిస్తున్నాయని, చెట్ల ప్రాధాన్యత ఏమిటో దీనిని బట్టి అర్థం చేసుకోవాలని అన్నారు. అటవీయేతర భూముల్లోని చెట్లు 420 మిలియన్ టన్నుల కార్భన్ డై ఆక్సైడ్ ను పీల్చుకుని, ప్రాణవాయువును అందిస్తున్నాయని, ఈ వృక్ష సంపద వల్ల దాదాపు 1.31 కోట్ల మంది జీవనోపాధి అవకాశాలను పొందుతున్నారని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లోనూ పచ్చదనంను మరింతగా వృద్ది చెందేలా చేసేందుకు సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో జగనన్న పచ్చతోరణం కింద దాదాపు కోటీ ఇరవై లక్షల మొక్కలను నాటామని తెలిపారు. అవెన్యూ ప్లాంటేషన్ కింద సుమారు 17 వేల కిలోమీటర్ల పరిధిలో దాదాపు 65 లక్షలకు పైగా మొక్కలను నాటామని వెల్లడించారు.

వినూత్నంగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన రైతుభరోసా కేంద్రాల ద్వారా భూసార పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఏ ప్రాంతంలో ఎటువంటి మొక్కలు పెరుగుతాయో శాస్త్రీయంగా నిర్ధారించి రైతులకు పూర్తి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. దీనిలో భాగంగానే ఒక్క చిత్తూరు జిల్లాల్లోనే లక్షల ఎకరాల్లో మ్యాంగో ప్లాంటేషన్ చేసి, ప్రజల ఆర్థిక ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అలాగే ఉద్యానవనాల ద్వారా పెద్ద ఎత్తున పండ్లతోటలను పెంచడం, రైతుల ఆర్థిక స్థితిని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.

రైతుల కోసం ఈ ప్రభుత్వం మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని కూడా ఏర్పాటు చేసి, వారికి అండగా నిలుస్తోందని తెలిపారు. ఆర్బీకేల ద్వారా భూసార పరీక్షలు నిర్వహించడమే కాదు, రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు, యంత్రాలను కూడా అందిస్తున్నామని అన్నారు. అటవీయేతర ప్రాంతాల్లో పచ్చదనం కోసం సచివాలయాల్లో అగ్రికల్చర్, హార్టీకల్చర్ అసిస్టెంట్ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

గత ఏడాది COP-26 (Glasgow)లో భారత ప్రధాని నరేంద్రమోదీ పర్యావరణ ఒప్పందాలపై కీలక సంతకాలు చేశారని, దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేదం విధించారని అన్నారు. దీనిని స్పూర్తిగా తీసుకుని మన రాష్ట్రంలో సీఎం వైయస్ జగన్ ప్లాస్టిక్ వినైల్, ఫ్లెక్సీలపై నిషేదం విధించారని తెలిపారు. గ్లోబల్ వార్మింగ్ వల్ల ప్రకృతి ప్రతికూలతలను ఎదుర్కొంటున్నామని, దీనిని నియంత్రణలోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా అడవులు, అటవీయేతర ప్రాంతాల్లో చెట్ల పెంపకంను ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అర్భన్ ప్రాంతాల్లో అటవీశాఖ ఆధ్వర్యంలో నగరవనాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలకు అహ్లాదాన్ని పంచే పచ్చదనం, ఆరోగ్యకరమైన పరిసరాలు, స్వచ్ఛమైన గాలిని అందించేలా నగరవనాలను తీర్చిదిద్దుతున్నాం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 28 ప్రాంతాలను ఎంపిక చేశాం. ఈ ఏడాది సుమారు రూ.15 కోట్లతో 16 నగర వనాలను నిర్మించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోంది.

అటవీ యేతర భూముల్లో మొక్కల పెంపకం ద్వారా వ్యవసాయ ఆధారిత జీవనోపాధితో పాటు పశుసంపద, కలప, అటవీ ఉత్పత్తుల వల్ల ప్రజల ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుందని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమానికి ప్రభుత్వ చేయూత ఉంటుందని, అటవీశాఖ ద్వారా సంపూర్ణ సహకారంను అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ (ఇఎఫ్ఎస్&టి) నీరబ్ కుమార్ ప్రసాద్, అటవీ దళాల అధిపతి వై.మధుసూదన్ రెడ్డి, యుఎస్ఎయిడ్ మిషన్ డైరెక్టర్ వీణారెడ్డి, చీఫ్ ఆఫ్ పార్టీ (టిఓఎఫ్ఐ) డాక్టర్ చంద్రశేఖర్, యుఎస్ఎయిడ్ డిప్యూటీ డైరెక్టర్ వర్గీస్ పౌల్, పలువురు అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply