Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ పాలనలోనే రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి

– రాజమండ్రి పేపర్ మిల్లు యజమానులను ఎమ్మెల్యే, ఆయన తండ్రి బెదిరిస్తున్నారు
– ఇదిగో ఆ బెదిరింపు వీడియో.. వినండి
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గణాంకాలతో సహా వివరించిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌

తాడేపల్లి: గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులకే ఈరోజు కూటమి ప్రభుత్వం ప్రధాని మోదీతో శంకుస్థాపనలు చేయిస్తోందని వైయస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆక్షేపించారు. ఈ ప్రభుత్వంలో ఆరున్నర నెలల్లో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ రాలేదని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన గుర్తు చేశారు.
రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ ప్రాజెక్టుల శంకుస్ధాపనల కోసం రావడం మంచి పరిణామం. ఈరోజు ప్రధాని శంకుస్ధాపనలు చేయబోయే గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టు, రైల్వే జోన్, బల్క్‌ డ్రగ్‌ పార్కు.. ఇవన్నీ గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలో సీఎం వైయస్‌ జగన్‌ చొరవతో రాష్ట్రానికి వచ్చిన ప్రాజెక్టులు.

నిజంగా వారికి దమ్ము, ధైర్యం ఉంటే, రాష్ట్రానికి ఏం సాధించారో చెప్పాలి. అలాగే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించబోమని ప్రధాని మోదీతో ప్రకటన చేయించడంతో పాటు, కర్నాటకలోని విశ్వేశ్వరయ్య స్టీల్‌ ప్లాంట్‌కు ఇస్తున్నట్లు రూ.15వేల కోట్ల కేటాయింపు జరిగేలా చూడాలి.

ఎన్టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుపై వైయస్సార్‌సీపీ ప్రభుత్వంలోనే ఒప్పందం జరిగింది. బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ను 17 రాష్ట్రాలతో పోటీపడి, నాడు మన రాష్ట్రం సాధించింది. దక్షిణాదిలో మరే రాష్ట్రానికి అప్పుడు అది సాధ్యపడలేదు.

పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారంటూ, టీడీపీ పిచ్చి విమర్శలు చేస్తోంది. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి రేటు ఎక్కువగా ఎవరి హయాంలో నమోదైంది అన్నది చూస్తే, పారిశ్రామికవేత్తలు అసలు ఎవరిని చూసి భయపడుతున్నారో అందరికీ తెలుస్తుంది. కేంద్రం చెప్పిన లెక్కల ప్రకారం చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి పారిశ్రామిక వృద్ధి రేటు 11.92 శాతంగా ఉంటే, 2024లో జగన్‌ దిగిపోయే నాటికి ఆ వృద్ధి రేటు 12.61 శాతంగా నమోదైంది.

ఇంకా చంద్రబాబు హయాంలో రాష్ట్ర రుణంలో 19.54 శాతం పెరుగుదల కనిపిస్తే, అది జగన్‌హయాంలో 15 శాతం మాత్రమే.

అలాగే తలసరి ఆదాయం (పీసీఐ) 2018–19 నాటికి రూ.1.54 లక్షలు కాగా, 2023–24 నాటికి అది రూ.2.19 లక్షలకు పెరిగింది. పారిశ్రామిక ఉత్పత్తుల విలువలో చంద్రబాబు హయాంలో దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, జగన్‌ పాలనలో 2022–23 నాటికే 8వ స్థానానికి ఎగబాకింది. దేశ జీడీపీలో చంద్రబాబు హయాంలో మన రాష్ట్ర జీడీపీ వాటా 4.47 శాతం కాగా, జగన్‌గారి హయాంలో అది 4.83 శాతానికి పెరిగింది.

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలనలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయి. కమీషన్ల కోసం పారిశ్రామికవేత్తలను దారుణంగా వేధిస్తున్నారు. వారిని బెదిరిస్తున్నారు.
అంటూ.. రాజమండ్రిలోని ఇంటర్నేషనల్‌ పేపర్‌ మిల్లు నిర్వాహకులను రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు బెదిరిస్తూ మాట్లాడిన ఆడియో వినిపించారు. ఆ పేపర్‌ మిల్లు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ చౌదరి తాత చిట్టూరి ప్రభాకర్‌ చౌదురి గతంలో రాజమండ్రి ఎమ్మెల్యేగా పని చేశారు.

వేల కోట్ల టర్నోవర్‌ ఉన్న పేపర్‌ మిల్లు మూతపడితే అందులో పని చేసే వేలాది కార్మికుల జీవితాలు రోడ్డున పడిపోవా? అలా టీడీపీ నేతలు డబ్బుల కోసం బెదిరిస్తుంటే, వారు కంపెనీలు ఎలా నడుపుతారు? నిజానికి పేపర్‌ మిల్లు లాకౌట్‌ సమయంలో ప్రభుత్వం కలుగజేసుకుని, అది కొనసాగించేలా చూడటమో లేదా కార్మికులను ఆదుకోవాలన్న కనీస ప్రయత్నం కూడా చేయలేదని మార్గాని భరత్‌ ఆక్షేపించారు.

కార్మికుల వేతన ఒప్పందంలో టీడీపీ పాత్ర లేదు

– పేపర్‌ మిల్లు కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌ చౌదరి.

‘తాము అధికారంలో ఉన్నప్పుడు 2019 జనవరిలో వేతన ఒప్పందం చేశామని టీడీపీ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. కానీ అది అవాస్తవం. పేపర్‌ మిల్లు కార్మిక సంఘం తరఫున వేతన ఒప్పందం చేసింది నేను. తమ హయాంలో ఒప్పందం జరిగింది కాబట్టే అది తామే చేశామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. వేతన ఒప్పందంలో ఏ ఎమ్మెల్యే, లేదా మంత్రి సంతకం కూడా లేదు. టీడీపీ నాయకుల పాత్ర లేదని చెప్పడానికి ఈ ఒప్పందమే సాక్ష్యం’.

‘నాటి ఎంపీ మార్గాని భరత్‌ నేతృత్వంలో కార్మికులకు రూ.6 వేలు చెల్లించేలా పేపర్‌ మిల్లు యాజమాన్యాన్ని ఒప్పిస్తే.. తండ్రీ కొడుకులు ఆదిరెడ్డి అప్పారావు, శ్రీనివాస్‌.. గత ఎన్నికల్లో లబ్ధి కోసం రూ.10 వేలు ఇప్పిస్తామని నమ్మబలికారు. ఎన్నికల్లో గెల్చిన తర్వాత నెల రోజుల్లో రూ.10 వేలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. పేపర్‌ మిల్లు కార్మికులు నమ్మి ఓటేస్తే పట్టించుకోకుండా నట్టేట ముంచారు.

LEAVE A RESPONSE