– ట్రాఫిగురా సీఈవో సచిన్ గుప్తాతో మంత్రి నారా లోకేష్ భేటీ
ముంబయి: లాజిస్టిక్స్, చమురు, ఖనిజాలు, ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో పేరెన్నికగన్న ట్రాఫిగురా ఇండియా సీఈవో సచిన్ గుప్తాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో భేటీ అయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 243.2 బిలియన్ డాలర్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించిన ట్రాఫిగురా… ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్తో 1.4 బిలియన్ డాలర్ల విలువైన ఎల్ఎన్జీ సరఫరా ఒప్పందం చేసుకుంది.
విశాఖపట్నం పోర్టు నుంచి బొగ్గు, జింక్, అల్యూమినియం వంటి వస్తువులను ఎగుమతి చేస్తోంది. ట్రాఫిగురా సంస్థ ఆయిల్, పెట్రోలియం ఉత్పత్తుల రవాణా, మెటల్, మినరల్స్, బల్క్ కమాడిటీస్ రవాణా, గ్యాస్, పవర్, రెన్యువబుల్ ఎనర్జీ, షిప్పింగ్, లాజిస్టిక్స్ రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ట్రాఫిగురా ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యాన్ని విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కోల్డ్ స్టోరేజి, ఎగుమతి మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ ఆహ్వానించారు.
భారత్ లో ఏపీ ప్రధాన బియ్యం ఉత్పత్తిదారు మాత్రమే కాకుండా, దేశంమొత్తం మీద 70 శాతం రొయ్యలు ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నాయని తెలిపారు. విశాఖపట్నం, కాకినాడ పోర్టుల్లో సరుకు నిల్వలకు అధునాతన వేర్ హౌసింగ్ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయండి. పునరుత్పాదక ఇంధన రంగంలో దూసుకుపోతున్న ఏపీలో విద్యుత్ వాణిజ్యంలో భాగస్వామ్యం వహించండి.
కాకినాడ లేదా విశాఖపట్నంలో ఎల్ఎన్జీ రీగ్యాసిఫికేషన్ టెర్మినల్ను ఏర్పాటుచేసి గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందించండి. విశాఖపట్నం పోర్టు నుంచి ఈ ఏడాది 82.62 మిలియన్ టన్నుల సరుకు రవాణా నమోదైన నేపథ్యంలో విశాఖలో కమోడిటీ ట్రేడింగ్ డెస్క్ ఏర్పాటుచేసే అంశాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తిచేశారు.