మానవ వనరుల మీద పెట్టుబడి జగనన్న విదేశీ విద్యాదీవెన

– రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలకు చెందిన పేద విద్యార్ధులు ప్రపంచంలోని టాప్‌ యూనివర్సిటీలలో ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిందేందుకు అవసరమైన ఆర్ధికసాయం అందించడమే లక్ష్యం.
– ఈ ఏడాది టాప్‌ 200 విదేశీ విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్లు పొందిన 213 మంది విద్యార్ధులకు మొదటి విడత సాయంగా రూ.19.95 కోట్లను క్యాంప్‌ కార్యాలయంలో బటన్‌ నొక్కి విద్యార్ధుల ఖాతాల్లో జమ చేసిన సీఎం వైయస్‌.జగన్‌

ఉన్నత స్ధానంలోకి వెెళ్లాలని కోరుకుంటూ…
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మనం చేస్తున్న ఈ కార్యక్రమం రాష్ట్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా మీ వల్ల మిగిలిపోతుందని… ఈ పథకంలో భాగస్తులైన ప్రతి చెల్లెమ్మ, తమ్ముడికి చెబుతున్నాను. ఈ రోజు మీకు సపోర్ట్‌ చేస్తూ… ప్రభుత్వం మీ మీద పెడుతున్న పెట్టుబడితో.. రేపు మీరు ఇంకా ఉన్నతస్ధానంలోకి వెళ్లాలని, మెరుగైన పరిస్థితుల్లో ఉండాలని కోరుకుంటున్నాం. మీరు అక్కడ ఉండడమే కాకుండా మీరు ఆ స్ధానంలోకి వెళ్లినప్పుడు రాష్ట్రాన్ని గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే మన రాష్ట్రం ప్రతిష్ట మన దేశంలోనే కాదు ప్రపంచంలోనూ పెరుగుతుంది.

సామాన్యులకు అండగా…
రూ.1.16 కోట్ల ఫీజుతో కార్నిగీ మిలన్‌ యూనివర్సిటీ, రూ.1 కోటి ఫీజుతో యూనివర్సిటీ ఆఫ్‌ సదరన్‌ కాలిఫోర్నియా, మాస్టర్స్‌ ఇన్‌ హెల్త్‌ ఇన్‌ఫర్మేటిక్స్, బోస్టన్‌ యూనివర్సిటీ, రూ.97 లక్షల ఫీజు, రూ.88.70 లక్షల ఫీజుతో హార్వర్డ్‌ యూనివర్సిటీ వీటన్నింటిని చూస్తుంటే…పేదలు, సామాన్యులు ఎవరూ కూడా ఇంత ప్రతిభ ఉండి, ఇటువంటి చోట సీటు వచ్చినా, డబ్బులు కట్టలేక, ఈ యూనివర్సిటీలో చదువులు చదవగలుగుతామా అన్న పరిస్థితి. తల్లిదండ్రుల మీద భారం పెట్టలేక ఎందుకు ఇంత పెద్ద యూనివర్సిటీకి పోవడం, మనకు స్థోమత లేదుకదా అని వెనుకడుగు వేస్తారు. ఆలా పెట్టుబడి పెట్టలేక వెనుకడుగు వేసే పరిస్థితి నుంచి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం మీకు అండగా, తోడుగా ఉందనే భావన కలిగించే విధంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

మానవ వనరుల మీద పెట్టుబడి…
రాష్ట్రంలో ప్రభుత్వం ఇవాళ చేస్తున్న పెద్ద పెట్టుబడి ఏదన్న ఉందంటే… అది కేవలం విద్యారంగం మాత్రమే. విద్యారంగం మీద పెట్టుబడి పెట్టే ప్రతి రూపాయి మానవ వనరులమీద పెడుతున్నట్టే. దీనివల్ల వాల్ల కుటుంబాల తలరాతలు మారడమే కాకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలరాత మార్చే గొప్ప పరిస్థితి వస్తుంది.

పెద్ద యూనివర్సిటీ చదువులు- గొప్పవాళ్లు…
ఇవాళ పెద్ద పెద్ద వాళ్ల గురించి ప్రస్తావన చేయాల్సి వస్తేవాళ్లు, మహాత్మాగాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ లాంటి గొప్ప గొప్ప నాయకులును తీసుకుంటే గొప్ప, గొప్ప యూనివర్సిటీల నుంచి వచ్చినవాళ్లే. నేటి ప్రపంచంలో ఈరోజు మెరుగైన స్ధానాల్లో ఉన్న ఇండస్ట్రీ లీడర్స్‌ను తీసుకుంటే… మైక్రోసాప్ట్‌ సీఈఓ సత్య నాదేళ్ల, ఐబీఎం సీఈఓ అరవింద కృష్ణ, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్, గూగూల్‌ సిఈఓ సుందర్‌ పిచాయ్, ఛానెల్‌ సీఈఓ లీనా నాయర్‌ వీళ్ల దగ్గర నుంచి మొదలుపెట్టి బ్రిటీష్‌ ప్రధాని రిషి సునక్‌తో పాటు అమెరికా వైస్‌ ప్రెసిడెంట్‌ కమలా హారిస్‌ వరకు ఉన్నారు. ఆ స్థాయిలో కలలను మీరు నిజంచేయాలి. అలాంటి లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. అందుకోసం అద్భుతమైన వేదికను మీకందిస్తున్నాం. ఆ స్ధాయిలోకి మీరు వెళ్లి… దేశం ప్రతిష్టనే కాదు, రాష్ట్ర ప్రతిష్టనుకూడా పెంచాలి.

విదేశీ విద్యా దీవెన – అత్యంత పారదర్శకంగా..
అత్యంత పారదర్శకంగా ఒక పథకాన్ని తీసుకునిరావాలి, నిజంగా చదువులు చదువుకోవాలని తపన ఉన్న ప్రతి ఒక్కరికీ, మంచి యూనివర్శిటీలో సీటు వస్తే.. డబ్బులు కట్టలేక వెనకడుగు వేసే పరిస్థితి రాకూడదన్న ఆలోచన నుంచి ఈ పథకం వచ్చింది. అత్యుత్తమ యూనివర్శిటీలు, ఉత్తమ కాలేజీల్లో సీట్లు వచ్చినవారికి ప్రభుత్వం అండగా నిలిచింది. పారదర్శకమైన విధానంతో ఈ పథకం అమలు చేస్తున్నాం. టాప్‌ 200 యూనివర్శిటీల్లో సీట్లు వస్తే.. పారదర్శకంగా ప్రభుత్వం వారికి మద్దతుగా నిలుస్తుంది. అలాంటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.

గత ప్రభుత్వ స్కీం- వైట్ వాష్‌
ఇలా వెళ్లి చదివించేటప్పుడు… గతంలో ఉన్న స్కీం ఎలా అమలు జరిగేదో చూశాం. అదొక వైట్‌ వాష్‌ కార్యక్రమం. కేవలం రూ.10–15 లక్షలకు పరిమితైన కార్యక్రమం. దీనివల్ల ప్రయోజనం అరకొరే మాత్రమే. దీనివల్ల వారికి మంచి జరగదు. కేవలం నీరుగార్చే కార్యక్రమం తప్ప మరో ప్రయోజనం లేదు. అది ఒకవైపు జరుగుతుండగా.. 2016–17కి సంబంధించిన బకాయిలును కూడా పిల్లలకు చెల్లించలేదు. దాదాపు రూ.300 కోట్లు బకాయిలు కూడా ఇవ్వకపోవడంతో దాదాపు పథకాన్ని మూసివేసే పరిస్థితులు వచ్చాయి. ఈ పథకాన్ని అమలు చేయడంలో గతంలో చిత్తశుద్ధిలేదు. మంచి యూనివర్సిటీ కాకపోయినా సపోర్టు చేస్తూ.. మంచి చేయాలనే తపన వ్యవస్ధలో గతంలో ఎక్కడా కనిపించలేదు. అలాంటి పరిస్థితులు మార్చాలనే ఉద్దేశంతో కొత్త ఆలోచనతో దీన్ని ప్రారంభిస్తున్నాం. ఒకవైపు మన రాష్ట్రంలో స్కూళ్లు, కాలేజీలు.. ఇలా వాటి రూపురేఖలను మారుస్తూ విద్యా ప్రమాణాలను పెంచుతున్నాం. మరోవైపు పిల్లలు చదువుకునేలా అడుగులు వేయిస్తున్నాం. దీంతో పాటు పెద్ద యూనివర్శిటీల్లో మన పిల్లలకు సీట్లు వస్తే.. వారికి తోడుగా నిలవాలన్న ఆలోచనలో నుంచి విదేశీ విద్యాదీవెన పథకం వచ్చింది.

పారదర్శకంగా టాప్‌ లిస్ట్‌ను ఎంపిక చేశాం. టాప్‌ 100 కాలేజీలు అయితే గరిష్టంగా రూ.1.25 కోట్ల వరకు సపోర్ట్‌ చేస్తామని చెప్పాం. టాప్‌ 100 – 200 వరకు ఉన్న కాలేజీలకు అయితే గరిష్టంగా రూ.75 లక్షలు వరకు చెల్లిస్తామని చెప్పాం. టాప్‌ 100 కాలేజీల జాబితాలో రూ.1.25 కోట్లతో 100 శాతం ట్యూషన్‌ ఫీజు గతంలో చెప్పినట్లుగా రూ.1.60 కోట్లు ఫీజు కూడా కవర్‌ అయింది. 100 నుంచి 200 వరకు క్యూఎస్‌ ర్యాంకులు పొందినవాళ్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు 100 శాతంతో రూ.75 లక్షల వరకు ఇచ్చాం. ఇవన్నీ పారదర్శకంగా చేపడుతున్నాం. తల్లిదండ్రుల మీద భారం తగ్గేలా మీ కాళ్ల మీద మీరు నిలబడే పరిస్థితి వచ్చేలా అడుగులు వేస్తున్నాం. నాలుగు వాయిదాల్లో ఇస్తున్నాం. ఐ–94 వచ్చిన వెంటనే మొదటి వాయిదా ఇస్తాం. మొదటి సెమిస్టర్‌ ఫలితాలు తర్వాత రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌ ఇస్తాం. రెండో సెమిస్టర్‌ తర్వాత మూడో ఇన్‌స్టాల్‌మెంట్, విజయవంతంగా నాలుగో సెమిస్టర్‌ పూర్తి చేసి మార్క్స్‌షీట్‌ అప్‌లోడ్‌ చేసిన తర్వాత ఫైనల్‌ చెల్లింపు ఇస్తాం. రూ.8లక్షల వరకు ఆదాయం ఉన్న ఏ కుటుంబానికి అయినా ఈ పథకం వర్తింపజేసే దిశగా అడుగులు వేశాం. రెండు సీజన్లలోనూ వచ్చే అడ్మిషన్లు ప్రోత్సహిస్తు.. వాళ్లను కూడా ఈ జాబితాలో యాడ్‌ చేసున్నాం.

213 మందిని ఎంపిక చేశాం
ఇప్పటివరకు ఈ ఏడాది 213 మంది పిల్లలు దరఖాస్తు చేసుకుని పారదర్శకంగా ఎంపికయ్యారు. వీరిలో ఎస్సీలు 30 మంది, మైనార్టీలు 35, బీసీలు 35, ఈబీసీలు 67 మంది, కాపులు 46 మంది ఉన్నారు. ఎవరికైనా మంచి ప్రతిభ ఉంటే వారందరికీ మంచి జరగాలని ఈ పథకం పెట్టాం. ఆర్ధికంగా ఇంకా దిగువన ఉన్న పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉంటారు కాబట్టి, వాళ్ళకు ఇంకా మద్ధతిచ్చే విధంగా అడుగులు వేయాలని, వారికి గరిష్టంగా రూ.1.25 కోట్ల సీలింగ్‌ పెట్టాం. మిగిలిన వాళ్లకు కూడా టాప్‌ 100 కాలేజీల జాబితాలో రూ.1 కోటి వరకు సీలింగ్‌ పెట్టాం. అదే విధంగా 100–200 కాలేజీల జాబితాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.75 లక్షలు పెడితే మిగిలిన వాళ్లకు రూ.50 లక్షల వరకు తీసుకునిపోయాం. మనం వేసే ప్రతి అడుగు మంచి చేసే దిశగా, పేదరికంలో ఉన్న ఏ ఒక్కరికీ కూడా నష్టం జరగకూడదన్న గొప్ప ఆలోచనతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.

ఏ అవసరం ఉన్నా ఉండగా సీఎంఓ
మీ అందరికీ మంచి జరగాలని మనసారా కోరుకుంటూ… మీలో ప్రతి ఒక్కరినీ చేయిపట్టుకుని నడిపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం. మీకు ఎలాంటి సమస్య ఉన్నా.. వెంటనే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. ముఖ్యమంత్రి కార్యాలయంలో(సీఎంఓలో) ఒక అధికారి నంబర్‌ను మీకు ఇస్తాం. ఒక ఐఏఎస్‌ అధికారిని ఈ పనికోసం కేటాయిస్తున్నాం. మీకు ఏ సమస్య ఉన్నా ఒక్క ఫోన్‌ కాల్‌ చేసి.. . వెంటనే సహాయం తీసుకోవచ్చు. ప్రతి విషయంలోకూడా మీకు తోడుగా ఉంటాం. తద్వారా మీరు ఉన్నత స్ధాయికి చేరుకోవడానికి చేదోడుగా ఉంటాం. మీ కుటుంబతో పాటు రాష్ట్రానికి కూడా గర్వకారణంగా నిలబడాలి. ఆల్‌ ది వెరీ బెస్ట్‌ టు యు అని సీఎం ప్రసంగం ముగించారు.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యంత్రి (మైనార్టీ సంక్షేమం) షేక్‌ అంజాద్‌ బాషా, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎ ఎం డి ఇంతియాజ్, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కె హేమచంద్రారెడ్డి, కాపు వెల్ఫేర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ జి రేఖారాణి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply