– సినిమా వాళ్లు హత్యలు చేసినా విచారణ చేయొద్దంటూ చట్టం చేద్దామా?
– స్టార్, ఫిల్మ్ స్టార్స్, సూపర్ స్టార్స్, పొలిటికల్ స్టార్స్కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా?
– ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం?
– హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా?
– సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదు
– ప్రాణాలతో చేలాగాటమాడటానికి మేం ఒప్పుకోము
– ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లను పెంచుకోవడానికి ‘నో’
– సంధ్య థియేటర్ ఘటనపై శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్: ఇకపై ఏ సినిమాకు ముందుగా బెనిఫిట్ షోలు, టికెట్ల రేట్ల పెంపు ఉండదని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను సీఎంగా ఉన్నంతవరకూ ఇదే విధానంపై కట్టుబడి ఉంటానన్నారు. పుష్ప సినిమాకు సంబంధించి సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటపై అసెంబ్లీలో రేవంత్ ప్రకటన చేశారు. ‘అసలు అల్లు అర్జున్ మనిషేనా? ఇలాంటి మనుషులు కూడా ప్రపంచంలో ఉంటారా’ అని రేవంత్ ఈ సందర్భంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
రేవంత్రెడ్డి ఇంకా ఏమన్నారంటే.. సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారు. అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదు.
కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారు. దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో తోపులాట జరిగింది. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది. ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడు. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదు. బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిది. కొడుకు చేయి పట్టుకుని ఆ తల్లి చనిపోయింది.
హీరో థియేటర్ లోపల ఉండటం వల్ల లోపల కూడా తొక్కిసలాట జరిగింది. ఈ విషయాన్ని హీరోకు ఏసీపీ చెప్పినా, శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదు. బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని సిటీ కమిషనర్ చెప్పారు. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారు. అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారు. ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారు. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారు.
ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయి. తన కొడుకు ఆ హీరో అభిమాని అని, కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారు. థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాడిని హీరో పరామర్శించలేదు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. నన్ను నీచంగా తిట్టుకుంటూ పోస్టులు పెట్టారు.
మంత్రిగా పని చేసిన ఒక వ్యక్తి అడ్డగోలుగా పోస్టులు పెట్టారు. సదరు హీరో భగవత్ స్వరూపుడు అన్నట్లుగా హంగామా చేశారు. ముఖ్యమంత్రిని తిట్టడానికి నీచమైన భాషను వాడారు. ప్రజల ప్రాణాలు తీస్తుంటే కూడా వాళ్లను ఏం చేయొద్దా? చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే… తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారు.
సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని భావించి మా ప్రభుత్వం ప్రత్యేక షోలకు అనుమతి ఇచ్చింది. ప్రాణాలు బలి తీసుకుంటే వాళ్లను ఏమీ అనొద్దు అంటే ఇదేం న్యాయం? సినీ,సిరాజకీయ ప్రముఖులకు ప్రత్యేక చట్టం ఏమైనా చేస్తారా? స్టార్, ఫిల్మ్ స్టార్స్, సూపర్ స్టార్స్, పొలిటికల్ స్టార్స్కు ప్రత్యేక ప్రివిలేజ్ ఉందా? సినిమా వాళ్లు హత్యలు చేసినా విచారణ చేయొద్దంటూ చట్టం చేద్దామా? అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి లోబడే మా ప్రభుత్వం నడుచుకుంటుంది. జైలుకు వెళ్లి వచ్చిన హీరో ఇంటికి క్యూ కట్టిన సినీ ప్రముఖుల్లో.. బాధిత కుటుంబాన్ని ఒక్కరైనా కలిసారా? సినీ ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం కోరుకుంటున్నారో తెలియడం లేదు. వ్యాపారాలు చేసుకోండి. కానీ ప్రాణాలతో చేలాగాటమాడటానికి మేం ఒప్పుకోము. మేం అధికారంలో ఉన్నంత కాలం అలాంటి ఆటలు సాగవు. ఇకపై సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, టికెట్ రేట్లను పెంచుకోవడానికి అనుమతించేది లేదు. ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు ఉండదు.