Suryaa.co.in

Andhra Pradesh

ఇది రాష్ట్రమా, రావణ కాష్టమా?

– తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

ఇది రాష్ట్రమా, రావణ కాష్టమా? అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. ఆదివారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కారాయలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…

పొద్దున్నే కత్తిపోట్లు, మధ్యాహ్నం మర్డర్లు, సాయంత్రం సజీవ దహనాలు, రాత్రిళ్ళు రేపులు- గ్యాంగ్ రేపులు ఇదీ రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. పగలు బయటికి వెళ్లిన వ్యక్తి రాత్రి కి ఇంటికి క్షేమంగా తిరిగి వస్తాడన్న గ్యారెంటీ లేదు. ఈ నెల 13వ తేదీన విశాఖ జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఎంపీ భార్య, కొడుకు, ఆడిటర్ లను కిడ్నాప్ చేస్తే 15వ తేదీ వరకు పోలీసులకు తెలియలేదంటే, ఆ ఎంపీకి పోలీసు వ్యవస్థ పై నమ్మకం లేనట్లు లెక్క. మీ పార్టీ ఎంపీ కుటుంబం కిడ్నాప్ కు గురైతే మీ స్పందన ఇదేనా?

ఈ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ కేసు గురించి రాష్ట్ర డిజిపి పెట్టిన ప్రెస్ మీట్ అంతా అసత్యాల పుట్ట. ఈ ప్రెస్ మీట్ వాస్తవాలకు దూరంగా ఉంది. డీజీపీ వైజాగ్ లో రౌడీలు లేరనటం, భూ కబ్జాలు జరగలేదనటం హాస్యాస్పదం-బూటకం. డీజీపీ నోట పలికించిన స్క్రిప్టు సీఎం ఆఫీసులో సీఎం, సజ్జల లతో తయారైంది. డీజీపీ ఆత్మవంచన చేసుకొని మాట్లాడారు. డీజీపీ సీఎం చెంతన చేరి అసమర్థులుగా మారారు. ప్రజల పక్షాన నిలవాల్సిన డీజీపీ ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నాడు.

గుడివాడలో టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ సభలో నల్ల బెలూన్లు ఎగురవేయడం నేరమా? చంద్రబాబును చెప్పుతో కొట్టాలి అని జగన్ చెబితే అది నేరం కాదా? సీఎం పై ఏదైనా పోస్టు పెట్టినా వదలరు. వెంటనే అరెస్టు చేస్తారు? నేరం చేసిన పోలీసులను కూడా వదలం, కోర్టు దృష్టికి తీసుకెళ్తాం. ఒక్క జూన్ నెలలోనే.. 1వ తేదీన విజయనగరం జిల్లా హైవేపై ఒక వ్యాపారి కంట్లో కారం కొట్టి తుపాకితో బెదిరించి రూ 50 లక్షలు దోచుకెళ్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నట్లా?

ఈనెల 5వ తేదీన ప్రకాశం జిల్లాలో దళిత మహిళ హనుమాయమ్మను ట్రాక్టర్ తో గుద్ది తొక్కించి తొక్కించి చంపితే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నట్లా? ఈ నెల 11వ తేదీన నెల్లూరులో టాబ్లెట్ల కోసం మెడికల్ షాప్ కు వెళ్తున్న మహిళను అందరూ చూస్తుండగా లాక్కెళ్లి గ్యాంగ్ రేప్ చేస్తే శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్లా? ఈ నెల 12న చిత్తూరు పోలీసు స్టేషన్లో సాక్షాత్తు పోలీసు జీపును దొంగలిస్తే, ఆ విషయం ఆరు గంటల వరకు పోలీసులకు తెలియదంటే, డిజిపి గారు ఈ విషయంపై ఏం సమాధానం చెబుతారు?

ఈ నెల 13వ తేదీన ఏలూరులో తన చెల్లిని అల్లరి చేయొద్దు అన్నందుకు ఎడ్ల ఫ్రాన్సిక అనే దళిత మహిళపై దుండగులు దాడి చేస్తే శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్లా? ఈ నెల 14న సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఒక దళిత వృద్ధుడిని అధికార పార్టీ దుండగులు కర్రలతో అందరూ చూస్తుండగా కొట్టి చంపారు. ఈ విషయంపై డిజిపి ఏం సమాధానం చెబుతారు? ఈనెల 15న కాకినాడ రౌతులపూడి లో ఎంపీపీ గిరిజన మహిళ రాజ్యలక్ష్మి పై అధికార పార్టీ ముష్కరులు దాడి చేస్తే డీజీపీ దీనిపై ఏం సమాధానం చెబుతారు?

అదే రోజున ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి నుండి ఓ వ్యక్తిని బయటికి లాక్కెళ్లి కొట్టి తెల్ల కాగితాలపై దుండగులు సంతకాలు తీసుకుంటే శాంతి భద్రతలు సజావుగా ఉన్నట్లా? అనంతపురంలో తుమ్మల వంశీ అనే వ్యాపారి తన భూమిని అధికార పార్టీ పెద్దలు కబ్జా చేశారని మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడితే శాంతిభద్రతలు సజావుగా ఉన్నట్లా? ఈ నెల 17న నందికొట్కూరులో ఒక ముసలమ్మ పీక కోసి హంతకులు నిర్భయంగా బయటికి వెళ్లి ఏదేచ్ఛగా తిరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు సజావుగా ఉన్నట్లా?

నిన్న తాడిపత్రిలో నిద్రపోతున్న వ్యక్తులపై పెట్రోలు పోసి తగలబెడితే శాంతి భద్రతలు ఉన్నట్లా? తన అక్కను అల్లరి చేయొద్దని ప్రశ్నించిన పదవ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ ను పట్టపగలే పెట్రోల్ పోసి తగులబెడితే శాంతిభద్రతలు ఉన్నట్లా? టీడీపీ నాయకులు ప్రయాణిస్తున్న కారును పాడు చేసిన వ్యక్తికి ఛైర్మన్ గా పదోన్నతి కల్పించారు. టీడీపీ పేదలపక్షమైతే.. వైసీపీ పెత్తందర్ల పక్షం.

గతంలో నేరస్తుల కదలికలను గుర్తించటం కోసం క్రైమ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్ వర్క్ అండ్ సిస్టం (సి.సి.టి.ఎన్.ఎస్) కోసం టి సి ఎస్ తో రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లు అన్ని అనుసంధానం చేస్తే, ప్రస్తుత ప్రభుత్వం తెగతెంపులు చేసుకుంది? ఈ దుర్మార్గపు ప్రభుత్వం సీసీటీఎస్ కు కట్టాల్సిన డబ్బులు కట్టకపోవడంతో ఈ తెగదెంపులు జరిగాయి.

దీంతో నేరాల ఉనికి గురించిన సమాచారం రాష్ట్రానికి లభించడంలేదు. గతంలో లాక్డ్ హౌసెస్ మోనటరింగ్ సిస్టం (ఎల్ హెచ్ ఎం ఎస్) ఉండేది అంటే ఇంటికి తాళం వేసి పనులపై బయటికి(ఇతర ఊర్లకు) వెళితే పోలీసులు ఆ ఇంటిని వాచ్ చేసేవారు. ఆ సిస్టమ్ ఇప్పుడు రాష్ట్రంలో ఎందుకు లేదు. అందుకే ప్రభుత్వం నేరస్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోందన్న అనుమానం రాష్ట్ర ప్రజలకు కలుగుతోంది.

పాత్రికేయులు సైతం జగన్ పాలనలో హింసకు గురవుతున్నారు. 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి సీఎంగా మిమ్మల్ని కూర్చోబెడితే రాష్ట్రానికి ఏం చేశారు? రాష్ట్రం సురక్షితం, సుబిక్షితం అని సీఎం తన నోటి నుండి చెప్పగలరా? ప్రభుత్వ ఆగడాలను ప్రశ్నించేందుకే ప్రతిపక్షం ఉందని ముఖ్యమంత్రి తెలుసుకోవాలి. పెద్దల సపోర్టు, అధికార మదంతో వైసీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం తలదించుకోవాల్సిన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి.

రాష్ట్రాన్ని ఎలా పాలించాలనేది ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును చూసి నేర్చుకోవాలి. రూ. లక్ష విలువ చేసే చెప్పులు వేసే జగన్ పేదవాడా? అదానీ, అంబానీల పక్కన నిలబడే స్థాయిలో జగన్ ఉన్నాడు. పోలీసులు అధికార దాసోహం మానాలి.

ఇలాంటి నేరాలు జరగకుండా చూడాల్సిందిగా టీడీపీ డిమాండ్ చేస్తోంది. పోలీసులు అధికార దాసోహం మాని, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చంద్రబాబు చెప్పినట్లు బీసీ చట్టాన్ని తెచ్చి బీసీలకు న్యాయం జరిగిలా చూస్తామని, శాంతిభద్రతలు స్వయంగా పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రికి ఏమైనా నైతిక విలువలుంటే వెంటనే రాజీనామా చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.

LEAVE A RESPONSE