రాష్ట్రాన్ని వైసీపీ ఎటు తీసుకు పోతోంది

-రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ?
– టీడీపీ రాష్ట్ర కార్యాలయం, ఇతర కార్యాలయాల పై దాడి అమానుషం
– ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు లేదా ?
– ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్
అమరావతి : ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ఏం చేయాలని అనుకుంటోంది అని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్న అనుమానం వస్తుందని ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజనాథ్ అన్నారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో విధ్వంసాలు, అరాచకాలు, కూల్చివేతలు తప్ప అభివృద్ధి ఏదని ప్రశ్నించారు. దళితుల పై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ ఏం చేసినా ప్రతిపక్షాలు ప్రశ్నించే హక్కు ను కూడా కాలరాస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడికి దిగడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల పై విధ్వంసానికి దిగడం శోచనీయమని అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఆంధ్ర రత్న భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారంలో ఉన్న వారు ఏం చేసినా సాగుతుందన్న మొండి వైఖరి విడనాడాలని సూచించారు. రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను వ్యక్త పరిచే స్వేచ్ఛ కూడా లేకపోవడం దారుణమని ఆయన అన్నారు. అధికార పార్టీ నాయకులు (ఎమ్యెల్యే, మంత్రులు) తమ భాష, వ్యవహార శైలి అదుపులోపెట్టించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రికి వున్నదని ఆయన సూచించారు. జరిగిన దాడిపై పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేసి దోషులను శిక్షించాలని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటనను సమీక్షించాలని శైలజనాధ్ డిమాండ్ చేశారు.

Leave a Reply