అసలు మీ ధర్నా పంజాబ్ వాళ్ల కోసమా? తెలంగాణ వాళ్ల కోసమా?

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
• వ్యవసాయ చట్టాలను సమర్ధిస్తూ కేసీఆర్ జై అన్నడు. ఇదిగో వార్తా క్లిప్పింగ్. ఈరోజు చట్టాలను రద్దు చేయాలంటుండు. పైగా కేసీఆర్ దీక్ష చేస్తే ఢిల్లీ దిగొచ్చిందని పాలాభిషేకాలు చేస్తుండ్రు. అసలు మీ ధర్నా పంజాబ్ వాళ్ల కోసమా? తెలంగాణ వాళ్ల కోసమా? ఆనాడు ధర్నాలతో శబ్ద కాలుష్యం వస్తుందని చెప్పి ధర్నా చౌక్ ఎత్తేసినవ్. ఈరోజు నువ్వే ధర్నా చేస్తున్నవ్. నువ్వు ఎత్తేసిన ధర్నా చౌక్ దగ్గరకే నిన్ను పట్టుకొచ్చినం. ఇది గుర్తుంచుకో… రాష్ట్రమంతా వాన పడుతోంది. వడ్లు నెలరోజులుగా రోడ్లపై, కొనుగోలు కేంద్రాలవద్ద ఆరబోసి ఉన్నయ్. చాలా జిల్లాల్లో వేల మంది రైతుల ధాన్యం తడిసి మొలకలు వచ్చినయ్. రోడ్డు మీద ఉన్న వానా కాలం వడ్లన్నీ కొనమంటే నీ మనసు కరగడం లేదు. యాసంగి మాట ఎత్తుతున్నవ్.
• కేంద్రం 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనేందుకు లెటర్ ఇచ్చినా అందులో 10 శాతం కూడా కొనలే. 6 గురు రైతులు వడ్ల కుప్పపై గుండె ఆగి చచ్చిపోయిండ్రు. నెలన్నర నుండి మేం హెచ్చరిస్తూనే ఉన్నం. మేం కల్లాలను సందర్శిస్తే రాళ్లు, కర్రలతో దాడి చేయించి రైతుల, బీజేపీ కార్యకర్తల తలలు పగలగొట్టిండ్రు. వడ్లన్నీ రైతులు, బీజేపీ కార్యకర్తల రక్తంతో తడిసినయ్. 4 రోజులు వెనుకా ముందైనా కొంటనని కేసీఆర్ అంటుండు. వాన నీ కోసం ఆగుతుందా? కోతలు ఆపాలట. నువ్వు అసలు ఏనాడైనా పంట పండించినవా? కోతలు ఆపితే గింజలు రాలిపోవా? కొనుగోలు కేంద్రాల వద్దకు వడ్లు తేవొద్దంట. వడ్లను యాడ పోసుకోవాలి? ప్రగతి భవన్ దగ్గర పోయాల్నా? ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్న తడిసిన వడ్ల ప్రతి గింజా కొనాల్సిందే.
• ఢిల్లీలోనంట రైతులు చనిపోయిండ్రంట. వాళ్లకు 3 లక్షల రూపాయలు ఇస్తాడట…. ముందుగా తెలంగాణలో వేలమంది రైతులు చనిపోయిండ్రు. NCRB రిపోర్ట్ ప్రకారం రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రానిది 4వ స్థానం. 2019 లో 419 మంది 2020 లో 471 మంది రైతులు బలయ్యారు. ఇంకా లెక్క తీస్తే చాలా ఉంది
• నీ ‘వరి-ఉరి’ కామెంట్ తో 5 గురు రైతులు చనిపోయిండ్రు. ఇప్పుడు వడ్ల కుప్పపై 6 గురు రైతులు చనిపోయిండ్రు. నీకు నిజంగా రైతులపట్ల ప్రేమ ఉంటే వాళ్లకు ముందుగా 25 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వు. ఎందుకంటే వీళ్లంతా నీ అసమర్ధత వల్లే రైతులు చనిపోయిండ్రు. నీ మూలంగా ఈ ఏడేళ్లలో వందలాది మంది నిరుద్యోగులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. ఆ కుటుంబాలకు రూ.25 లక్షలు ఇవ్వు. నీ కొడుకు నిర్వాకంతో 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు చనిపోయిండ్రు. వారి కుటుంబాలకు 25 లక్షలు ఇవ్వు. ఢిల్లీ సంగతి తర్వాత … ముందుగా నిన్ను నమ్మి ఓటేసిన రైతు సంగతి ముందు చూడు.
• ఈ వానా కాలం 40 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం కొనేందుకు ఒప్పందం కుదిరింది. అవసమైతే అంతకంటే ఎక్కువ కూడా కొంటామని అక్టోబర్ 29న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు లెటర్ రాసిండు. ఇంకా నీ నొప్పి ఏంది? (Piyush Goel Letter చూపిస్తూ..) నోరు తెరిస్తే కేంద్రంపై పడి ఏడుస్తుండు….. ఈ 7 ఏళ్లలో ధాన్యం కొనుగోలు కోసం కేంద్రం 85 వేల కోట్ల రూపాయలు తెలంగాణకు వెచ్చించింది. 2014-15లో 24 లక్షల మెట్రిక్ టన్నులు కొంటే 2020-21లో 1 కోటి 41 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొన్నాం. 2014 లో రూ.1310 ఉన్నవడ్ల ఎంఎస్ పీ ఇప్పుడు రూ.1960 ఉంది. ఈ ఘనత కేంద్రంది కాదా
• మేం వానా కాలం గురించి మాట్లాడతితే యాసంగి గురించి ఒకటే లొల్లి చేస్తుండు. పంపుసెట్లకు కరెంట్ మీటర్లను బిగించాలంటూ చేసిన విద్యుత్ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెబుతుండు. పోయిన జీహెచ్ఎంసీ, దుబ్బాక, సాగర్, హుజూరాబాద్ ఎన్నికల్లోనూ ఇదే మాట చెప్పిండు. కరెంటు మీటర్లు బిగించి రైతులపై కేంద్రం భారం మోపుతుందని, ఛార్జీలు బాదుతుందని….. ఆ ఎన్నికలన్నీ అయిపోయినయ్. ఎక్కడైనా కేంద్రం భారం మోపిందా? ఎందుకు పనికిరాని మాటలు. ఎవరిని మభ్యపెట్టడానికి? ప్రజలు అన్నీ చూస్తున్నరు.
• ట్రిబ్యునల్ ఏర్పాటుపై అడిగిన ప్రశ్నకు….ట్రిబ్యునల్ ఏర్పాటులో జాప్యానికి కారకుడే కేసీఆర్. సుప్రీంకోర్టులో కేసు వేసి ఏడేళ్లుగా నాన్చి కేంద్రానిదే బాధ్యత అనడం సిగ్గచేటు….ఇది నా మాట కాదు…మూడు రోజుల క్రింత కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ మాట (ఇదిగో పేపర్ క్లిప్పింగ్..). నీటి కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆరే. క్రిష్ణా పరివాహక ప్రాంతానికి అనుగుణంగా తెలంగాణకు 575 టీఎంసీల నీటి వాటా రావాల్సి ఉండగా……299 టీఎంసీలను కేటాయించే ఒప్పంద పత్రాలపై అపెక్స్ కమిటీ సమావేశంలో సంతకం చేసిన ఘనుడు కేసీఆర్. ఈ పెద్దమనిషి ఈరోజు నీటి వాటా తేల్చాలి.
తెలంగాణకు అన్యాయం జరుగుతోందని చెప్పడం సిగ్గుచేటు. సుప్రీంకోర్టులో కేసులుండగా ట్రిబ్యునల్ ఏర్పాటు సాధ్యం కాదని గత ఏడేళ్లుగా కేంద్రం పదేపదే చెబుతున్నా పట్టించుకోని ఈ మూర్ఖపు సీఎం కేంద్ర మంత్రి చెబితేగానీ సుప్రీంకోర్టులో వేసిన కేసును ఉపసంహరించుకోలేదు. కేసును ఉపసంహరించుకోవడానికే ఏడేళ్ల టైం తీసుకున్న కేసీఆర్….నిద్రలేచిందే తడువుగా ఇప్పటికిప్పుడు ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలనడం సిగ్గుచేటు. ట్రిబ్యునల్ ఏర్పాటంటే ఆషామాషీ వ్యవహారం కాదు. సుప్రీంకోర్టుకు ప్రతిపాదించాలి. ఆమోదం పొందాలంటే చాలా తతంగం ఉంటుందనే సంగతి కేసీఆర్ కు తెలుసు. అయినా ప్రజలను మభ్యపెట్టి రాజకీయ లబ్ది పొందాలనే కుట్రతోనే ట్రిబ్యునల్ అంశాన్ని తెరమీదకు తీసుకొస్తుండు.
• బీసీ కుల గణన చేపట్టాలనే డిమాండ్ పై…రాబోయే జనగణన సంగతి పక్కనపెట్టు. ముందు తెలంగాణ వచ్చిన కొత్తలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే సంగతేమైంది? ఏ ఇంట్లో ఎన్ని గొర్లున్నయ్…ఎన్ని బర్లున్నయ్….ఎంత మంది ఉన్నరు? ఏ కులాల వాళ్లు ఎంతమంది ఉన్నరు? సర్వే చేసినవ్ కదా? దాని సంగతేమైంది? ముందు ఆ లెక్కలు బయటపెట్టు. దాని ప్రకారం నీకు చిత్తశుద్ది ఉంటే….బీసీలకు రిజర్వేషన్లు, సంక్షేమ పథకాల్లో లబ్ది కలిగించు.
• రైతుల బీజేపీ క్షమాపణ చెప్పాలనే ప్రశ్నకు స్పందిస్తూ… నిజంగా ఎవరు క్షమాపణ చెప్పాలి? రైతులు వరి కోతలు పూర్తయినయ్. కల్లాల మీద ధాన్యం ఆరబోసిండ్రు. కొనుగోలు కేంద్రాల్లో రోజుల తరబడి ధాన్యం కుప్పలు పోసి ఎదురుచూస్తుండు. వర్షాలొస్తున్నయ్. తొందరగా కొనాలని అడిగినందుకు క్షమాపణ చెప్పాల్నా? నిరుద్యోగులకు భ్రుతి ఇవ్వాలని అడుగుతున్నందుకు, ఉద్యోగాలివ్వాలన్నందుకు, రుణ మాఫీ ఇవ్వాలన్నందుకు, ప్రజల తరపున కొట్లాడుతున్నందుకు క్షమాపణ చెప్పాల్నా? దేనికి క్షమాపణ చెప్పాలి?
• ధాన్యం కొనుగోలు విషయంలో సీఎం వ్యాఖ్యలపై….. సీఎం రోజుకోకసారి గజనీలాగ మారుతుండు. ఇంకోసారి అపరిచితుడైతుండు. ధాన్యం కేంద్రమే కొనాలని ఒకసారి అంటడు. కేంద్రం పైసా కూడా ఇవ్వడం లేదంటు….ఇంకోసారేమో కేంద్రమే ధాన్యం కొనాలంటడు. ఇప్పుడేమే ప్రతి గింజా మేమే కొంటాం…పైసలన్నీ మేమే ఇస్తామని మాట్లాడుతుండు. నిజంగా ఈ మాటనడానికి కేసీఆర్ కు సిగ్గుండాలి. వడ్లు కొనేది, బస్తాల్లో నింపేది…మిల్లులకు తరలించేది… మర ఆడించేది, బియ్యాన్ని గోడౌన్లలో నిల్వ ఉంచేది… ఎఫ్ సీఐకి తరలించేది…ఇలా అన్నింటికీ ప్రతి పైసా కేంద్రమే చెల్లిస్తోందనే సోయే మర్చిపోయిండు. ఈ విషయంలో కేసీఆర్ ది బ్రోకర్ పాత్రే. బ్రోకరిజం చేసినందుకు 2 శాతం కమీషన్ కూడా ఇస్తోంది కేంద్రమే. కానీ మాట మాత్రంగానైనా ఆ మాట చెప్పకుండా వడ్లన్నీ నేనే కొంటున్నట్లు ఫోజు కొడుతూ రాజకీయ లబ్ది పొందాలనుకోవడం సిగ్గుచేటు.
• గిరిజన రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై …. బీజేపీ మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం. రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను రద్దు చేసి వాటిని గిరిజనులకు కల్పించాలి. ఎస్సీ వర్గీకరణకు మేం మొదటి నుండి మద్దతిస్తూనే ఉన్నాం.

Leave a Reply