– సౌత్ ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం చేసింది జగన్ బినామీలే
– జయచంద్రా రెడ్డి వైసీపీ కోవర్టు
– కల్తీ మద్యం మరణాలు, వ్యాపారంపై జగన్ బహిరంగ చర్చకు సిద్ధమా?
– పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సవాల్
మంగళగిరి : ఆరేళ్ళుగా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారడానికి కారణం జగనే అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్తీ మద్యానికి మూలకారణం జగనే అని, దాన్ని ప్రోత్సహించినది కూడా జగనే అని అన్నారు. దీన్ని ఖండించే ధైర్యం జగన్కు ఉందా అని ప్రశ్నించారు. మీ నాయకుడు మల్లాది విష్ణు బార్లో కల్తీ మద్యం తాగి ఆరుగురు చనిపోతే, అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని విమర్శించారు.
గతంలో సర్వేపల్లి, కావలి నియోజకవర్గాల్లో మీ నాయకులు కాకాణి గోవర్ధన్, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కల్తీ మద్యంలో భాగస్వాములైనది నిజం కాదా? వారిపై కేసులు ఉన్నది నిజం కాదా? వారిపై మీ పార్టీ క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జంగారెడ్డి గూడెంలో కల్తీ మద్యం తాగి 27 మంది చనిపోతే, ఆ కేసును తప్పుదారి పట్టించినది మీరు కాదా? అప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? కానీ, చంద్రబాబు గారు కల్తీ మద్యం గురించి వార్త తెలియగానే సంబంధిత వ్యక్తులను అరెస్ట్ చేయించారు.
మీ పార్టీ కోవర్ట్ అయిన జయచంద్రారెడ్డిపై ప్రభుత్వం లుక్అవుట్ నోటీసులు జారీ చేసి, పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మీరు ఎప్పుడైనా అలా చేశారా? జయచంద్రారెడ్డి ఎక్కడ తలదాచుకున్నాడో జగన్కు తెలియదా? వైసీపీ కోవర్ట్ జయచంద్రారెడ్డి, మీ సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి క్యాంప్లో తలదాచుకున్నది నిజం కాదా? వైఎస్ సునీల్ రెడ్డి, వైఎస్ అనిల్ రెడ్డి జగన్ బినామీలు కాదా? కల్తీ మద్యంపై కేసులు వేయగానే వీరంతా సౌత్ ఆఫ్రికాకు పరారయ్యారని ఆయన ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా కల్తీ మద్యం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవడానికి చంద్రబాబు చర్యలు చేపట్టారు, కానీ మీరు అలా చేశారా? అని ఆయన ప్రశ్నించారు.
మీ చెత్త పత్రికల్లో కూటమి ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు రాస్తున్నారని, సీఎం చంద్రబాబును ముద్దాయిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మీరు ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు నమ్మరని హెచ్చరించారు. పెద్దిరెడ్డి తన తమ్ముడిని గెలిపించుకోవడానికి జయచంద్రారెడ్డిని ఎన్నికల ముందు టీడీపీలో వైసీపీ కోవర్ట్గా పనిచేయించారని ఆరోపించారు. జగన్ పాలనలో కల్తీ మద్యంపై ఏనాడు స్పందించలేదని విమర్శించారు. దాని వల్ల 30 వేల మంది పేదలు మరణించారని ఆరోపించారు. మీరు సరఫరా చేసిన మద్యంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లు చెన్నై, బెంగళూరు ల్యాబ్లు నిర్ధారించింది అది నిజం కాదా? బాధ్యులపై వెంటనే చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు.
ఏలూరులో మద్యం తాగి ఒక వ్యక్తి చనిపోతే, అది కల్తీ మద్యంగా ప్రచారం చేశారు, కానీ ఆర్ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్ అది కల్తీ మద్యం కాదని నిర్ధారించింది. దీనిపై మీ సమాధానం ఏమిటని జగన్ను ప్రశ్నించారు. కల్తీ మద్యం సరఫరాకు మూలవిరాట్ మీరేనని మేం చెబుతున్నామని, దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని జగన్కు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, కల్తీ మద్యం వ్యవహారంలో ఎంతటి వారైనా సరే, వారిని వదిలేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వర్ల రామయ్య స్పష్టం చేశారు