Suryaa.co.in

Andhra Pradesh

వైఎస్‌ సీఎం అయ్యాక లక్షల కోట్లు కొట్టేసిన జగన్‌

-స్థిరాస్తులే లేని జగన్‌ కుటుంబానికి లక్షల కోట్ల ఆస్తులా?
-తన తండ్రి ఒక్క స్థిరాస్తి కూడా ఇవ్వలేదంట.. అఫిడవిట్‌లో చెప్పాడు
-ఆయనపై 32 క్రిమినల్‌ కేసులు… అన్నీ మనీలాండరింగ్‌ కేసులే
– కంపెనీలు అన్నీ ప్రైవేటువే… ఒక్కటి కూడా లిమిటెడ్‌ కంపెనీ లేదు
– లిమిటెడ్‌ కంపెనీలైతే గుట్టు బయటపడుతుందన్న భయం
– ఆయన ఆస్తుల విలువ రూ.8,23,600 కోట్లు
– ఎప్పటి విలువనో చూపి అసలు విలువను దాచి మోసం
– ఎన్నికల కమిషన్‌ మరో అఫిడవిట్‌ తీసుకోవాలి
– టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి

మంగళగిరి టీడీపీ ప్రధాన కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. స్థిరాస్తులే లేని జగన్‌ కుటుంబానికి లక్షలాది కోట్ల ఆస్తులా వచ్చాయి? జగన్‌రెడ్డి తన తండ్రి నుంచి ఒక్క స్థిరాస్తి రాలేదని తన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. మరి స్థిరాస్తులు లేకుండా జగన్‌ రెడ్డి ఇంత తక్కువ కాలంలో అన్ని లక్షల కోట్లను ఎలా సంపాదించారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని లక్షల కోట్లు కూడబెట్టుకోవడానికి ఉపయోగించిన జగన్‌ రెడ్డి ఆస్తులు లెక్కపెట్టాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఆడిటర్లు సరిపోరు.

జగన్‌ అక్రమ ఆస్తుల సామ్రాజ్యానికి పెట్టని కోటగా ఉన్న సాక్షి దినపత్రిక, టీవీ, ఉన్న ఇళ్లు, తిరుగుతున్న కారు గురించి కూడా అఫిడవిట్‌లో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారు. జగతి పబ్లికేషన్స్‌లో నేరుగా జగన్‌కు 0.7 శాతం వాటా, భారతి రెడ్డికి 80 శాతంకు పైగా వివిధ కంపెనీల ద్వారా వాటాలున్నా ఎన్నికల అఫిడవిట్‌లో మాత్రం పొందుపరచలేదు. కేల్వీన్‌ టెక్నాలజీస్‌లో వైఎస్‌ భారతీరెడ్డి, జగన్‌ బావమరిది ఇ.సి.దినేష్‌ రెడ్డి, జగన్‌ కుమార్తెలు వంద శాతం వాటాలు కలిగి ఉన్నారు. ఆ కంపెనీల నుంచి సండూర్‌ పవర్‌, కార్మలేషియా, జగతి పబ్లికేషన్స్‌ అన్నింటిలోకి నిధులు దారి మళ్లించారు. 2004లో నికర ఆస్తులు 1.74 కోట్లుగా చూపించిన జగన్‌ రెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తి మొత్తం రూ.757 కోట్లు మాత్రమే చెప్పారు. ఆస్తుల మార్కెట్‌ విలువ, బినామీ పేర్లతో విలువ కలిపితే అది రూ.8 లక్షల కోట్లు దాటుతుంది.

లిక్కర్‌ కమిషన్‌ రూ.1,05,000 కోట్లు, 22(ఎ), అసైన్డ్‌ భూముల కుంభకోణం రూ.లక్ష కోట్లు, ఇండోసోల్‌(జగన్‌ బినామీ) కుంభకోణం రూ.75 వేల కోట్లు, జిఐఎస్‌ విద్యుత్‌ ఒప్పందాల కుంభకోణం రూ.50 వేల కోట్లు, డీఆర్‌ బాండ్ల కుంభకోణం రూ..50 వేల కోట్లు, విశాఖ భూముల కుంభకోణం రూ.40 వేల కోట్లు, ఇసుక దోపిడీ రూ.60 వేల కోట్లు, ఎర్రచందనం కుంభకోణం రూ.25 వేల కోట్లు, గ్రావెల్‌ దోపిడీ రూ.22 వేల కోట్లు, సిలికా, బీచ్‌ శాండ్‌, క్వార్జ్‌ దోపిడీ రూ.17 వేల కోట్లు, గంజాయి, డ్రగ్స్‌ వాటా రూ.37 వేల కోట్లు, ప్రభుత్వ కొనుగోళ్లలో కమీషన్లు రూ.16 వేల కోట్లు, కూకట్‌పల్లిలో 11 ఎకరాలు, లేపాక్షి భూములు రూ.15 వేల కోట్లు, స్మార్ట్‌ మీటర్లు, ట్రాన్స్‌ ఫార్మర్ల కొనుగోలు, తదితరాల్లో రూ.15 వేల కోట్లు, బాక్సైట్‌ మైనింగ్‌ కుంభకోణం రూ.15 వేల కోట్లు, కోవిడ్‌ మందులు, కిట్ల కొనుగోళ్లలో రూ.14 వేల కోట్లు, భారతి సిమెంట్‌ దోపిడీ రూ.12 వేల కోట్లు, రేషన్‌ బియ్యం కుంభకోణం రూ.7 వేల కోట్లు, ఇళ్ల స్థలాల కొనుగోలు కుంభకోణం రూ.7 వేల కోట్లు, బైజూస్‌, విద్యా కానుక, నాడు-నేడు రూ.4,500 కోట్లు, పోర్టుల్లో అవినీతి రూ.4,000 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల్లో కమిషన్లు రూ.2,500 కోట్లు, సాక్షికి ప్రకటనల రూపంలో దోపిడీ రూ.1,600 కోట్లు, అమూల్‌ కమిషన్‌ రూ.1,000 కోట్లు, జే ట్యాక్స్‌ రూ.40 వేల కోట్లు, సీబీఐ చార్జిషీట్లో నిర్ధారించినవి రూ.43 వేల కోట్లు, సీబీఐ నిర్ధారించాల్సిన ఆస్తుల విలువ రూ.60 వేల కోట్లు మొత్తం రూ.8,23,600 కోట్లు పైగా ఉంది. తన తండ్రి చేతుల మీదుగా ప్రారంభించిన సాక్షి పత్రిక టీవీ కూడా నాదే అని చెప్పుకోలేని దుస్థితిలో జగన్‌ రెడ్డి ఉన్నాడని ఎద్దేవా చేశారు.

జగన్‌, భారతీరెడ్డిలకు గిఫ్ట్‌లపై అనుమానాలు…షర్మిలకు న్యాయం చేయాలి
రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే వరకు జగన్‌ వద్ద స్థిరాస్తులు ఏమి లేవు. అధికారంలోకి రాగానే అడ్డగోలుగా దోపిడీకి పాల్పడినందుకు జగన్‌ రెడ్డిపై 32 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసులన్నీ హవాలా, మనీ లాండరింగ్‌కు సంబంధించినవే. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రిపై కూడా ఇన్ని మనీ లాండరింగ్‌ కేసులు లేవు. రాజశేఖర్‌ రెడ్డి నుండి ఒక్క రూపాయి కూడా స్థిరాస్తిగా జగన్‌ రెడ్డికి రాలేదని అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. తండ్రి ఆస్తులు వారసత్వంగా కొడుక్కు వస్తాయనేది వాస్తవం. పులివెందులలో బాక్రాపురంలో ఉన్న ఆస్తులను, హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 2లో ఉన్న ఇంటిని జగన్‌ రెడ్డికి రాజశేఖర్‌ రెడ్డికి గిఫ్ట్‌గా ఇచ్చారు. బాక్రాపురంలో భారతి రెడ్డికి గిఫ్ట్‌గా ఆస్తులను వైఎస్‌ ఇచ్చారు. అసలు జగన్‌ రెడ్డికి గిఫ్ట్‌గా ఆస్తులను ఇవ్వాల్సిన అవసరం రాజశేఖర్‌ రెడ్డికి ఏముంది. తన తదనంతరం ఆ ఆస్తులు వచ్చేది బిడ్డలకే కదా? మరి ఆ గిఫ్ట్‌లు షర్మిలకు ఎందుకు ఇవ్వలేదు.

జగన్‌రెడ్డి, భారతిరెడ్డికి మాత్రమే ఎందుకు ఇచ్చారు? అని ప్రశ్నించారు. రాజశేఖర్‌ రెడ్డి జగన్‌కు షర్మిలకు సరి సమాన వాటా ఇచ్చే వ్యక్తి. కుటుంబ వ్యవహారంలో వన్‌సైడ్‌గా వెళ్లే వ్యక్తి కాదు. ఏ తండ్రైనా ఇల్లు ఒక్కరికే ఇవ్వరు. జగన్‌ రెడ్డికి ఇచ్చిన గిఫ్ట్‌ల మీద అనుమా నాలు ఉన్నాయి. ఇటీవల వైఎస్‌ సునీత మాట్లాడుతూ ఆస్తులకు సంబంధించి తనను సంతకాలు పెట్టమ న్నారని.. అందులో భారతి పేరు ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ఈ గిఫ్ట్‌లు పెద్ద బోగస్‌. ఈ గిఫ్ట్‌ డీడ్‌లపై వెంటనే విచారణ చేపట్టాలి. వైఎస్‌ షర్మిలకు న్యాయం చేయాలి. వైఎస్‌ కుటుంబానికి ఆయన పుట్టకముందే వందల కోట్లు ఆస్తులున్నాయని అనడం ముమ్మాటికి అబద్దం. ఒక్క స్థిరాస్తి కూడా ఉన్నట్లు జగన్‌ రెడ్డి అఫిడవిట్‌లో చెప్పలేదు. ఒక్క ప్రాపర్టీ కూడా స్థిరాస్తిగా వచ్చిందని జగన్‌ రెడ్డి తెలపలేదు. డిక్లేర్‌ చేసింది షర్మిల మాత్రమే. వైఎస్‌ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆయన కుటుంబానికి ఆస్తులు ఏమి లేవని జగన్‌ రెడ్డే అఫిడవిట్‌లో స్పష్టం చేశాడని పేర్కొన్నారు.

ఒక్క స్థిరాస్తి లేకుంటే ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు జగన్‌ రెడ్డికి ఎక్కడ నుండి వచ్చాయి. రాజశేఖర్‌ రెడ్డి సీఎం అయ్యాక జగన్‌ జనాలను దోచుకుని సంపాదించారనేది వాస్తవం. జగన్‌ తాతల నుండే వందల కోట్ల ఆస్తులు ఉన్నాయని వైసీపీ నేతల కొడుతున్న డబ్బాలు, చెబుతున్న అబద్దాలను ఇకనైనా ఆపాలి. నువ్వు ఎప్పుడో 19 ఏళ్ల కింద పెట్టిన పెట్టుబడులను నేడు చూపిస్తే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు అమాయకులు అనుకుంటున్నావా జగన్‌ రెడ్డి. మిగిలిన అభ్యర్థులు కూడా ఇలాగే చేశారా? ఎవరైనా ఈరోజు విలువ చూపిస్తారా ఆరోజు విలువ చూపిస్తారా? అసలు జగన్‌ రెడ్డి డిక్లర్‌ చేసిన కంపెనీల్లో ఒక్కటి కూడా లిమెటెడ్‌ కంపెనీ లేదు. అన్నిప్రైవేట్‌ కంపెనీలే. లిమిటెడ్‌ కంపెనీలు అయితే దాన్ని స్టాక్‌ ఎక్సైజ్‌ లో చూపించాలి. అది చూపించడం జగన్‌ రెడ్డికి ఇష్టం లేదు. స్టాక్స్‌ లోకి వెళితే జగన్‌ బండారం బయటపడుతుందని.. జగన్‌ రెడ్డి ఎలా సంపాధించాడో తెలుస్తుంది కాబట్టి ఏ ఒక్క కంపెనీ కూడా లిమిటెడ్‌ కంపెనీ పెట్టలేదు. ఈ కంపెనీల వాస్తవ విలువ 3 లక్షల కోట్లకు పైనే ఉంటుంది.

రూ.32 కోట్లు ఇస్తా…భారతి సిమెంట్స్‌ ఇచ్చేస్తావా భారతి అక్క
జగన్‌ అఫిడవిట్‌ ప్రకారం భారతి సిమెంట్స్‌ లో జగన్‌ రెడ్డి డిక్లేర్‌ చేసింది రూ.36 కోట్లు. అసలు ధర మాత్రం నేడు రూ.960 కోట్లుగా ఉంటుంది. మీ సాక్షి పేపర్‌ను ఎందుకు అఫిడవిట్‌లో నమోదు చేయలేదు. ఉన్నది చూపించడానికి సిగ్గు ఎందుకు. నీకు ఓట్లు వేసినందుకు జనం సిగ్గుపడాలి. ఏ కంపెనీని చూసినా పెట్టిన పెట్టుబడి ధరే రాసి వాస్తవ విలువ దాచాడు. జగన్‌ రెడ్డి పెట్టుబడుల విలువల అసలు ధర నేడు రూ. 1458 కోట్లు ఉంది. భారతి ఏమో రూ.32 కోట్లు ఉన్నట్లు చూపారు. వారి కంపెనీల్లో వాటాల అసలు ధర నేడు రూ.1,522 కోట్లు ఉంది. రూ.32 కోట్లు ఇస్తే భారతి సిమెంట్స్‌ నాకు ఇస్తారా భారతి అక్క అప్పో సొప్పో తెచ్చి కట్టేస్తా. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఉన్న ఇళ్లు ఎక్కడికి పోయింది. అఫిడవిట్‌ లేకుండా ఎక్కడ దాచావు జగన్‌ రెడ్డి. లోటస్‌ పాండ్‌ ఇల్లు ధర దాదాపు 300 కోట్లు ఉంటుంది. బెంగుళూరులో 30 ఎకరాల్లో ఉన్న ప్యాలెస్‌ను అఫిడవిట్‌లో చూపించలేదు. వీటిని ఏ కంపెనీల్లో దాచావు? మంత్రి బిల్డర్స్‌ దగ్గర కొన్న మాల్‌ను ఆఫిడవిట్‌లో పెట్టకుండా ఎక్కడ దాచావు? అని ప్రశ్నించారు.

జగన్‌ నుంచి మరో అఫిడవిట్‌ తీసుకోవాలి
జగన్‌ రెడ్డి, షర్మిలలను ఇద్దరు కళ్లు అని వైఎస్‌ విజయమ్మ అన్నారు. అలాగే రాజశేఖర్‌ రెడ్డి కూడా రెండు కళ్లుగా చూశారు. నేడు జగన్‌ రెడ్డి అఫిడవిట్‌ ప్రకారం షర్మిలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఆస్తులు, వాస్తవ విలువల్లో తప్పులు ఉన్నాయని ఎలక్షన్‌ కమిషన్‌ జగన్‌ రెడ్డి నుంచి మరో అఫిడవిట్‌ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అఫిషియల్‌గా ఉన్న ఆస్తుల విలువే వేల కోట్లలో ఉంది. అనఫిషియల్‌గా లక్షల కోట్లలో ఉన్నాయి. షిరిడి సాయి ఎలక్ట్రికల్‌, అరబిందో, అరబిందో సీ పోర్ట్‌లలో లక్షల కోట్లలో బ్లాక్‌ మనీ ఉంది. సౌత్‌ ఈస్ట్‌ లో రిచ్‌ ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డే. అన్ని కేసులు ఉన్నా ముఖ్యమంత్రిగా అయిన ఏకైక వ్యక్తి ఈ జగన్‌ ఒక్కడే. నేడు ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పేరుతో పులివెందుల వ్యక్తికి చెందిన క్రిటికల్‌ రివర్‌ కంపెనీ చేతిలో ప్రజల ఆస్తులను పెట్టి కొట్టేయడానికి నేడు జగన్‌ యత్నిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే వీటిని బయటకు తీస్తామని వెల్లడిరచారు.

LEAVE A RESPONSE