జగన్ రెడ్డి డూప్లికేట్ అండ్ బోగస్ ట్రాన్స్ ఫర్

– ‘తోడు’తో చిరు వ్యాపారులకిచ్చిన సొమ్ము కంటే ప్రకటనల ఖర్చే ఎక్కువ
– బటన్ నొక్కి ప్రజలకు ఇచ్చిందెంతో శ్వేతపత్రం విడుదల చేయాలి
– ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు

జగన్ మోహన్ రెడ్డి నేడు మరొకసారి ఇంట్లో నుండి జగనన్న తోడు సంక్షేమ పథకాలకి బటన్ నొక్కారు. జగన్ రెడ్డి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ (DBT)లో లక్షా 67వేల కోట్లు పంపించానని వ్యాఖ్యానించారు. కాని బటన్ నొక్కుడు కార్యక్రమం ఎన్నో సారో చెప్పలేదు. జగన్ రెడ్డి DBT అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ అని చెబుతున్నారు. వాస్తవానికి DBT అంటే డూప్లికేట్ అండ్ బోగస్ ట్రాన్సఫర్ లో జగన్ రెడ్డి అడ్డంగా ప్రజలకు దొరికిపోయారు.

జగనన్న తోడు పథకం కింద ఈ సంవత్సరం 3వందల 95కోట్ల రుణంతో కలిపి చిరు వ్యాపారం చేసుకొనే 15లక్షల మంది లబ్ధిదారులకు నేటి వరకు అందించిన వడ్డీ లేని రుణాలు 2,011 కోట్లు. దీనిని మించిన అబద్ధం లేదు. అందుకే దీనిని డ్యూప్లికేట్ అండ్ బోగస్ ట్రాన్సఫర్ గా వ్యాఖ్యానించాం.
కేంద్రం ఆత్మ నిర్భర భారత్ పథకం కింద వడ్డీ లేని రుణాలని దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకి 10వేల రూపాయలు అందజేయాలని జూన్, 2020న దేశ వ్యాప్తంగా ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా 32 రాష్ట్రాలలో 48 లక్షల 30వేల మందికి వడ్డీ లేని రుణాలని అందజేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.

కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్లో ఎంత మందికి ఎంత ఇచ్చారు అనే గణాంకాలు స్పష్టంగా ఉన్నాయి. మన రాష్ట్రంలో 2లక్షల 30వేల మందికి, తెలంగాణలో 3లక్షల 40వేల మంది చిరు వ్యాపారులకి వడ్డీ లేని రుణాలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కరోనా సమయంలో చిరు వ్యాపారులు చితికిపోయినందున కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచేందుకు 10వేల చొప్పున వడ్డీ లేని రుణం ఇవ్వడానికి బ్యాంకు వారికి గ్యారెంటి ఇస్తోంది.

ఈ రుణాలకి అయ్యే వడ్డీ 16కోట్ల రూపాయల్లో కేంద్ర ప్రభుత్వం 10కోట్ల వరకు రూపాయలు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 6కోట్ల రూపాయల వరకు వడ్డీ చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం 6 కోట్లను ఇస్తూ.. 15 కోట్ల ఖర్చుతో పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం ఆశ్చర్యం.

జగన్ రెడ్డి కళ్ళబొళ్లి మాటలు:
నేడు మన ఆంధ్ర రాష్టంలోనే కొత్తగా చిరు వ్యాపారులకి వడ్డీ లేని రుణాలని జగన్ రెడ్డి మాత్రమే స్వయంగా ప్రారంభిస్తున్నట్టు సాక్షిలో ఆర్భాటపు ప్రకటన ఇచ్చారు. చిరు వ్యాపారులకి అందజేసిన వడ్డీ లేని రుణాల లబ్ధిదారులు 3లక్షల 95వేల మందిలో 2లక్షల 30వేల మందికి కేంద్ర ప్రభుత్వమే రుణాలని అందజేస్తుంది. జగన్ రెడ్డి చేసింది ఏముంది. కేంద్ర ప్రభుత్వం భరోసాతో బ్యాంకు వారు చిరు వ్యాపారులకి వడ్డీ లేని రుణాలని అందజేస్తుంటే వాటిని జగన్ రెడ్డి ఇస్తున్నట్టు చెప్పుకోవడం దిగజారుడుతనం. ఈ రుణాలలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు శూన్యం. రాష్ట్ర ప్రభుత్వం పని కేవలం లబ్ధిదారులని ఎంపిక చేయడం. రాష్ట్ర ప్రభుత్వం 1.65 మందికి ఇచ్చే రుణాలకు గ్యారంటీగా ఉంటోంది. అంత మాత్రానికి.. ఈ స్థాయిలో చేసుకుంటున్న ప్రచారాన్ని ఏ విధంగా చూడాలో అర్ధం కావడం లేదు.

కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రధాన మంత్రి స్వనిధి పథకానికి సంబంధించిన వెబ్ సైట్ లోకి వెళితే రాష్ట్రాల వారిగా లబ్ధిదారుల వివరాలు, చెల్లింపుల వివరాలు అన్ని ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చిరు వ్యాపారులకి వడ్డీ లేని రుణాల పథకానికి 6కోట్లు ఖర్చు పెట్టి, 10కోట్లతో పబ్లిసిటీ ఇచ్చుకుంటుంది.

అందుకే జగన్ రెడ్డిని బోగస్, డూప్లికేట్ ముఖ్యమంత్రి అని జనం అంటున్నారు. ఈ పథకం కింద ఎంత నగదు బదిలీ చేశారో ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ఆర్టిఐ ద్వారా కూడా సమాచారం సేకరిస్తాం. నిజంగా 80శాతం మంది మహిళలకు ఇచ్చారా? ఏయే జిల్లాలలో ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు అనేది తెలుసుకుంటాం. జగన్ రెడ్డి 6కోట్ల నగదు బదిలీ చేసి 2,011కోట్లు తానే ఇచ్చినట్టు ప్రజలని మభ్యపెడుతున్నారు. అన్నీ గణాంకాలతో బయట పెడతాం.

డ్వాక్రా గ్రూపులకి సంబంధించిన 8,700 కోట్లు, అభయ హస్తం కింద 2100 కోట్లు దారి మళ్లించి నేడు మహిళ సాథికారత అని జగన్ రెడ్డి మాట్లాడటం దుర్మార్గం. పంచాయితీలకు 14, 15 ఆర్ధిక సంఘాల నుండి మంజూరైన సుమారు 7600 కోట్లను స్వాహా చేశారు. ఆ డబ్బు ఏమైందో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. మహిళల విషయంలో అడ్డగోలు దారుణాలకు పాల్పడుతూ.. ఉద్దరించినట్లు ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు.

దశల వారీ మద్య నిషేధం చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి.. ఇప్పుడు మద్యం రేట్లు విపరీతంగా పెంచి, ప్రజల చేత చీప్ లిక్కర్ తాగిస్తూ ప్రాణాలు తీస్తున్నాడు. వేలాది కుటుంబాలను మద్యం మహమ్మారికి బానిసల్ని చేసి రోడ్డున పడేస్తున్నాడు. ఈ విషయంలో మహిళలకు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.

పక్క రాష్ట్రాలతో పోల్చి చూస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో రుణ లబ్ధిదారుల సంఖ్య తక్కువ. గోదావరి వరద వల్ల అనేక ప్రాంతాలు ముంపునకు గురి అయి ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. వాళ్ళలో చిరు వ్యాపారులు, కూరగాయ ఉత్పత్తులు అమ్ముకునే వారు అనేక మంది ఉన్నారు. నేడు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాల లబ్ధిదారుల జాబితాలో ముంపుకు గురైన ప్రాంతాల వ్యాపారులకు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. చిన్న చిన్న బళ్లపై, మోటార్ సైకిళ్లపై తిరుగుతూ చిరు వ్యాపారాలు చేసుకునే వారికి పెట్రోల్, డిజిల్ అధిక ధరలు భారమయ్యాయి. పెట్రోల్, డిజిల్ ధరలని కేంద్ర ప్రభుత్వం తగ్గించినా, తాను మాత్రం తగ్గించకుండా ప్రజల్ని నిండా ముంచారు.

కర్నూల్ లో చిరు వ్యాపారుల సంఘం మా దగ్గరికి వచ్చి ఫుట్ పాత్ మీద తోపుడు బండ్ల మీద అమ్ముకుంటే వ్యాపారం చేసుకునే వారందరిని వ్యాపారం చేసుకోనివ్వకుండా తీసేసారని వాపోయారు. దాదాపు వంద మంది జీవనోపాధి ఏంటి అని వైసీపీ వారిని ప్రశ్నిస్తే… మీరు టీడీపీ వారు వైసీపీలో చేరితేనే లైసెన్స్ ఇస్తామంటూ రోడ్ల మీద వ్యాపారం చేసుకోనీయడం లేదు. ఇదేనా చిరు వ్యాపారుల్ని ఉద్దరించడం అని ప్రశ్నించారు.

Leave a Reply