Suryaa.co.in

Andhra Pradesh

విద్యార్ధుల జీవితాలతో జగన్ రెడ్డి చలగాటం

-విద్యా దీవెన పథకం కింద రూ.10,722 కోట్లు ఎగ్గొట్టిన ప్రభుత్వం
-టీడీపీ 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ అందిస్తే జగన్ రెడ్డి 8 లక్షలకు కుదించారు
-బటన్ నొక్కుడు పేరుతో బడుగు బలహీన విద్యార్ధుల పీకనొక్కుతున్న జగన్ రెడ్డి
– మాజీ మంత్రి కె.ఎస్. జవహర్

గత ప్రభుత్వాల అమలు చేసిన ఫీజు రీయంబర్స్ మెంట్ పథకాన్ని విద్యా దీవెనగా మార్చారు. చంద్రన్న ప్రభుత్వం 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చేస్తే జగన్ రెడ్డి ప్రభుత్వం కేవలం 8.09 లక్షల మందికి అది కూడా విడతల వారీగా అందిస్తోంది. అంటే దాదాపు 8 లక్షల మంది విద్యార్ధులను మోసం చేశారు. జగన్ ప్రభుత్వం మొదట 11 లక్షల మంది విద్యార్ధులకు ఈ పథకాన్ని అమలు చేసి ఇప్పుడు 8 లక్షల మందికి తగ్గించింది.

అంటే దాదాపు 3 లక్షల మంది విద్యార్ధులకు కోతపెట్టారు. ‘సాక్షి’లో ప్రభుత్వ ప్రకటన మేరకు జగన్ రెడ్డి ప్రభుత్వం ‘విద్యాదీవెన’ క్రింది 8,09,039 విద్యార్థులకు త్రైమాసికానికి రూ.584 కోట్లు విడుదల చేయనున్నారు. అంటే ఒక్కో విద్యార్ధికి ఒక్కో విడతకు రూ.7,218 చొప్పున సగటున సంవత్సరానికి రూ.28,872 ఫీజు చెల్లిస్తున్నట్లు ప్రభుత్వం అబద్దాలు ప్రచారం చేస్తోంది.

2023 అక్టోబర్-డిసెంబరు త్రైమాసికం ముగుస్తున్నా నేటి ప్రకటనలో జులై-సెప్టెంబరు, 2023 త్రైమాసికానికి ఈరోజు విడుదల చేస్తూ… క్రమం తప్పకుండా విడుదల చేస్తున్నామనటం అబద్ధాలు చెప్పడం కాదా? అంతేకాకుండా ఇప్పటికి వరకు 4 విడతలు ఎగ్గొట్టారు.. నేటి ప్రకటన ప్రకారమే ప్రభుత్వం ప్రతి విద్యార్థికి రూ.28,872 నష్టం కలిగించింది. దీనికి బాధ్యులెవరు జగన్ రెడ్డీ? ఈ మేరకు మొత్తం 11 లక్షల విద్యార్థులకు జగన్ రెడ్డి రూ.3,176 కోట్ల మేరకు వంచించారు. ఇప్పటికి ఇదేనా క్రమం తప్పకుండా ఫీజులు విడుదల చేయడం అంటే?

టీడీపీ 16 లక్షల మంది విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ అమలు చేస్తే జగన్ రెడ్డి 11 లక్షల మందికి కుదించి విద్యాదీవెనను ప్రారంభించారు. అంటే 5 లక్షల మందిని తొలగించింది. దీని వలన ఈ 5 లక్షల మంది ఇప్పటివరకు రూ.6,496 కోట్ల సాయాన్ని కోల్పోయారు. మొత్తం మీద జగన్ రెడ్డి నయవంచనతో విద్యార్థులు రూ. 9,672 కోట్లు (3,176+6,496) విద్యాదీవెన కింద కోల్పోయారు. వీటితో పాటు యూజీ, పీజీ విద్యార్ధులకు 2020-21కి రూ.600 కోట్లను కరోనా సమయంలో క్లాసులు జరపలేదనే సాకుతో ఎగవేత. ప్రైవేటు కళాశాలల్లో పీజీ విద్యార్ధులకు ఫీజ్ రీయింబర్స్ మెంట్ 2020-21 నుంచి సర్కారు నిలిపివేసింది. అప్పటికే దీనికి సంబంధించి రూ.450 కోట్లు బకాయిలు ఉన్నాయి. అంటే మొత్తంగా దాదాపు రూ.10,722 కోట్లు విద్యార్ధులకు ఎగనామం పెట్టింది.

గత ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ నగదును నేరుగా కళాశాలలకు ఇచ్చేది. అది పోగా మిగిలిన ఫీజు ఏదైనా ఉంటే అది మాత్రమే విద్యార్థులు చెల్లించాలి. దీనివల్ల ఒకవేళ ప్రభుత్వం ఏవైనా కారణాలతో ఆలస్యం చేసినా అది ప్రభుత్వం, కాలేజీల మధ్య వ్యవహారంగా ఉండేది. కానీ, వైసీపీ ప్రభుత్వం దాన్ని కాలేజీలు, తల్లిదండ్రుల మధ్యకు తీసుకొచ్చింది. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రాకపోవడంతో విద్యార్ధులు అవస్థలు పడుతున్నారు. ఫీజులు చెల్లించలేదని కాలేజీ యాజమాన్యాలు విద్యార్ధుల చదువులు పూర్తైనా కూడా సర్టిఫికేట్లు ఇవ్వడం లేదు.

శ్రీ కృష్ణదేవరాయ వర్సిటీలో 24 మంది విద్యార్ధులను ఫీజు చెల్లించలేదని 2022 ఆగస్టులో నాలుగో సెమిస్టర్ పరీక్షలకు అనుమతించలేదు. డిసెంబర్ 17, 2023న నెల్లూరు జిల్లా కావలిలో ఫీజ్ రీయింబర్స్ మెంట్ డబ్బులు అందలేదని దాదాపు 30 మంది ఫైనల్ ఇయర్ నర్సింగ్ విద్యార్ధులను నర్సింగ్ కళాశాల బయటకు పంపేశారు.
ప్రైవేట్‌, ఎయిడెడ్‌, అన్‌ఎయిడెడ్‌ కళాశాలల్లో చదివే పీజీ విద్యార్థులకు 2020-21 విద్యా సంవత్సరం నుంచి జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలు నిలిపివేస్తూ జీవో నెం. 77ను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేద విద్యార్థులకు ఈ పథకం నిలిపివేతతో వారి ఉన్నత చదువుల కలను చెరిపివేశారు.

ఏపీలో విద్యలో క్వావిటీ లేకపోవడంతో యూజీ, పీజీ విద్యార్ధులు పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారు. విడతల వారీ పథకాలకు సైతం వందల కోట్లతో ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటు. విద్యా దీవెన పథకానికి ఒక్కో విడతకి దాదాపు రూ.10కోట్లు ప్రకటనలకు ఖర్చు అయితే 4 విడతలకు అయ్య ఖర్చు రూ.40 కోట్లు. అంటే నాలుగేళ్లుగా రూ.160 కోట్లు ఒక్క ప్రకటనలకే ఖర్చు చేశారు. ప్రకటనలకు పెట్టిన ఖర్చుతో దాదాపు 50 వేల మంది విద్యార్ధులకు మేలు జరిగి ఉండేది. విద్యార్ధుల మేలు కన్నా జగన్ రెడ్డికి సాక్షికి మేలు చేయడమే మిన్నా.

LEAVE A RESPONSE