జనవరి 19 నుంచి జిల్లాలలో కంటి వెలుగు శిబిరాలు ప్రారంభం

▪️జనవరి 18న ఖమ్మంలో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారు
▪️కంటి వెలుగు క్యాంపులో ప్రజలు షెడ్యూల్ ప్రకారం వచ్చేలా ప్రణాళిక
▪️ప్రతి ఇంటికి కంటి వెలుగు ఆహ్వాన పత్రిక అందేలా చర్యలు
▪️వాట్సాప్ గ్రూపుల ద్వారా సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షణ
▪️కంటి వెలుగు క్యాంపులకు తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకుని రావాలి
▪️కంటి వెలుగు విజయవంతంగా అమలు చేసేందుకు అన్ని శాఖలు సంపూర్ణ సహకారం అందించాలి
▪️కంటి వెలుగు శిబిరాల నిర్వహణ పట్ల కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు

ఖమ్మం, జనవరి 16: జనవరి 19న ఉదయం 9 గంటల నుంచి జిల్లాలలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించాలని రాష్ట్ర ఆర్థిక వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కలెక్టర్ లను ఆదేశించారు. సోమవారం మంత్రి హరీష్ రావు ఖమ్మం కలెక్టర్ కార్యాలయం నుంచి, రాష్ట్ర సీఎస్ శాంతికుమారి , డీజిపి అంజనీ కుమార్, వైద్య, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వి, కమిషనర్ శ్వేతలు హైదరాబాద్ బీఆర్కె భవన్ నుంచి కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ పట్ల తీసుకోవాల్సిన చర్యల పై అన్ని జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని, ఇది చాలా సున్నితమైన కార్యక్రమమని, దీనిని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. కంటి వెలుగు క్యాంపుల నిర్వహణ సమయంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు వారు తగిన భద్రత కల్పించాలని మంత్రి తెలిపారు. జనవరి 18న ఖమ్మం లో సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని లాంచనంగా ప్రారంభిస్తారని, జిల్లాలలో జనవరి 19న ఉదయం 9 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు,జడ్పీ చైర్మన్లు జెడ్పిటిసి, ఎంపిటిసి, సర్పంచులు వారి పరిధిలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించాలని మంత్రి సూచించారు.

జిల్లాలలో కలెక్టర్, డిఎంహెచ్ఓ లు వాట్సాప్ ద్వారా ప్రతి బృందం సకాలంలో క్యాంపులు ప్రారంభించేలా పర్యవేక్షణ చేయాలని, జిల్లాలో ఉన్న వైద్య బృందాలు సమీప పట్టణాలు, మండల హెడ్ క్వార్టర్ లో నైట్ హాల్ట్ చేసేలా కలెక్టర్ లు చర్యలు తీసుకోవాలని, ఉదయం 8-45 వరకు తప్పనిసరిగా బృందాల సభ్యులు క్యాంపు లోకేషన్ చేరుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. కంటి వెలుగు క్యాంపులు విజయవంతం అయ్యేందుకు పంచాయితీ కార్యదర్శులు, అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు, ఆర్.పి. లు, విఆర్ఏలను భాగస్వామ్యం చేయాలని, క్యాంపు నిర్వహణ ముందస్తు సమాచారం ప్రజలకు తెలియజేసి ప్రతి ఇంటికి ఆహ్వాన పత్రిక అందించాలని, ప్రజలు ఉదయం, మధ్యాహ్న సమయాల్లో వచ్చే విధంగా షెడ్యూల్ చేయాలని మంత్రి సూచించారు.

ప్రతి వైద్య బృందానికి క్యాంపు నిర్వహణ కోసం అవసరమైన సామాగ్రి, మందులు, కళ్ళద్దాలు అందించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కంటి వెలుగు శిబిరాలకు వచ్చే ప్రజలు తప్పనిసరిగా వారి ఆధార్ కార్డు తీసుకుని వచ్చే విధంగా అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో క్యాంపుల నిర్వహణ కంటే ముందుగా సంబంధిత ఆశా, ఎఎన్ఎం లు పర్యటించి షెడ్యూల్ వివరాలు తెలియజేస్తూ కంటి వెలుగు పై అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. జిల్లాలో ఉన్న ఎంపిఒ, ఎంపిడిఓ లు, తహసిల్దార్ లు, మండల ప్రత్యేక అధికారి ప్రతి రోజు వారి పరిధిలో గల క్యాంపులను తనిఖీ చేయాలని, జిల్లా స్థాయిలో డిఎంహెచ్ఓ, ఇతర ప్రోగ్రాం అధికారులు విస్తృతంగా పర్యటిస్తూ క్యాంపుల నిర్వహణను తనిఖీ చేయాలని మంత్రి ఆదేశించారు.

వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు నిర్వహిస్తున్నందున కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని, ప్రణాళిక బద్ధంగా ప్రజలు క్యాంపులో పాల్గొని కంటి పరీక్షలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గతంలో కంటే బృందాల సంఖ్యను రెట్టింపు చేసినందున అధికంగా ప్రజలకు కంటి వెలుగు క్యాంపులు అందుబాటులో వచ్చే విధంగా అధికారులు పనిచేయాలని, ప్రజలకు సౌకర్యార్థంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని, చిన్న పొరపాటు కూడా జరగకుండా జాగ్రత్త వహించాలని ఆమె సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. బి. మాలతి, జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, జెడ్పి సిఇఓ వి.వి. అప్పారావు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply