Suryaa.co.in

Telangana

కెసిఆర్ సంప్రదాయ రాజకీయాలు చేయలేదు.. అందుకే నష్టపోయాం

-కార్యకర్తల మనోభావాలు వెల్లడించిన మాజీ మంత్రి టి .హరీష్ రావు
– అప్పుడు దావోస్కు ఖర్చులు దండగ అన్నారు కదా? మరి ఇప్పుడు ఎలా వెళ్లారు?
– ఇక కార్యకర్తల అభిప్రాయాల మేరకే పార్టీ పనిచేస్తుంది

నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమీక్ష కు పెద్ద ఎత్తున హాజరైన మీ అందరికీ పేరు పేరున అభినందనలు .

ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి 45 రోజులవుతోంది. ఓటమి నుంచి తేరుకుని నెల రోజులకే సమీక్ష ,సన్నాహక సమావేశాలు ప్రారంభించాం .
ఇది పదకొండో మీటింగ్ ..ఇప్పటి దాకా జరిగిన అన్ని సమావేశాల్లో ఊహించిన దాని కన్నా ఎక్కువగా విలువైన సూచనలు వచ్చాయి. కార్యకర్తలు ఏది కోరుకుంటున్నారో రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది .పార్టీ మీ అభిప్రాయం మేరకే పని చేస్తుంది.

తెలంగాణ అభివృద్ధి కోసం రేయింబవళ్లు తండ్లాడాం. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో తడబడ్డాం. మన పార్టీ స్థానం మారింది ..పాలన నుంచి ప్రతిపక్షానికి వచ్చాం. అయినా అధైర్య పడాల్సిన అవసరం లేదు. మనం ఉద్యమ వీరులం కార్య శూరులం.

ఉద్యమానికి ఊపిరి లూదిన వాళ్ళం ..పేగులు తేగే దాకా మన మాతృ భూమి కోసం కొట్లాడిన వాళ్ళం.మనకు సత్తువ ఉంది ..సత్తా ఉంది ప్రతిపక్షం లో కూడా మన మట్టి మనుషుల ఆకాంక్షల కోసం ఊపిరి ఉన్నంత వరకు పోరాడుదాం. ప్రజాస్వామ్యం లో ప్రభుత్వాలు మారడానికి బలమైన కారణాలు ఉండనక్కర్లేదు.

ఈ సోషల్ మీడియా దుష్ప్రచారాల కాలం లో, ప్రభుత్వం మారడానికి ప్రజలకు పనికొచ్చే అంశాలు కూడా ఉండనక్కర్లేదు. రాజస్థాన్ లో ఐదేళ్లకే ప్రభుత్వం మారింది ..ఛత్తీస్ ఘడ్ లో కూడా ఐదేళ్లకే మారింది ..ఇట్లా ప్రభుత్వాలు మారడం దేశం లో కొత్తేమి కాదు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో వరసగా పదేళ్లు పాలించిన సందర్భాలు చాలా అరుదు. ఐదేళ్ల లోపే ప్రజావ్యతిరేకత ను మూట గట్టుకుని ఇంటికి పోయిన కాంగ్రెస్ ప్రభుత్వాలే ఈ దేశం లో ఎక్కువ.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఏడాదికి మూడున్నర లక్షల కోట్ల రూపాయలు కావాలి …మన బడ్జెట్ ఎంత ?2 లక్షల 90 వేల కోట్లు . బడ్జెట్ కన్నా మించి హామీలిచ్చారు. ఎలాగూ అధికారం రాదు కదా అని అరచేతిలో వైకుంఠం చూపేలా మేనిఫెస్టోను రాసేశారు.

కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారం లోకి వచ్చింది ..ఎన్నికలపుడు ఇష్టమొచ్చిన విధంగా ప్రజలను మభ్యపెట్టి ఇపుడు వాటి గురించి మనం అడిగితే కాకమ్మ కథలు చెబుతున్నారు. హామీల సంగతి చూడమంటే అవసరం లేని విషయాలు తెరపైకి తెస్తున్నారు.

కర్ణాటక లో 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా మారింది. 5 గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని కర్ణాటక ఆర్థిక సలహాదారు బసవరాజ్ రాయరెడ్డి మొన్న మీడియా తో చెప్పారు.గ్యారంటీలు అమలు చేస్తే, కర్ణాటక ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలుతుందని ఆయన హెచ్చరించారు.

మన దగ్గర కూడా కాంగ్రెస్ నేతలు గ్యారంటీల చావు వార్త చెప్పే రోజులు ఎంతో దూరం లో లేవు. రాజకీయాలకతీతంగా కేసీఆర్ తెలంగాణ ను అభివృద్ధి చేశారు .ఇది ఎవరూ కాదనలేని సత్యం. సాంప్రదాయ రాజకీయపద్ధతులకు కేసీఆర్ దూరంగా ఉన్నారు. కొంత అది నష్టం చేసిందన్న భావన కార్యకర్తల్లో ఉంది.

పార్లమెంటు ఎన్నికల్లో బీ ఆర్ ఎస్ గెలిస్తేనే తెలంగాణ సమస్యలకి పరిష్కారం. విభజన సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. ఈ కీలక సమయం లో బీ ఆర్ ఎస్ ఎంపీ లు ఢిల్లీ లో లేకపోతే, తెలంగాణ కు నష్టం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఓ గుణపాఠం గా నేర్చుకుని ముందుకు సాగుదాం ..పార్లమెంటు లో సత్తా చాటుదాం .

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్రం చేతులెత్తేసింది.కాంగ్రెస్ మేనిఫెస్టో లో 111 వ హామీ కింద పాలమూరు కు జాతీయ హోదా తెస్తామని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచేది పోయి, కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ లో ప్రతి రోజూ బీజేపీ నాయకుల మెడలకు దండలు వేస్తున్నారు.

బండి సంజయ్ కాంగ్రెస్ బీజేపీ ల మైత్రిని బహిరంగంగా ఒప్పుకున్నారు. కేసీఆర్ అట కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొంటారని ఈ బ్రహ్మ జ్ఞాని బండి సంజయ్ సెలవిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చిన చరిత్ర పలు ప్రాంతీయ పార్టీలను చీల్చిన చరిత్ర బీజేపీ దేనని బండి సంజయ్ చెబుతున్నారు. మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ బ్రోకర్లు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబట్టారు.

పిల్లికి ఎలుక సాక్ష్యం అన్నట్టుగా ఉంది బండి సంజయ్ తీరు. బండి సంజయ్ లొట్ట పిట్ట లా వార్తల్లో ఉండేందుకు తాపత్రయ పడతారు. కరీం నగర్ కు ఒక్క రూపాయి తెనోడు అడ్డమైన విషయాలు అడ్డం పొడువు మాట్లాడుతున్నాడు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై శ్వేత పత్రం ప్రకటించి మనల్ని బద్నామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు తీసుకున్న గోతిలో వాళ్ళే పడ్డారు. నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన నివేదిక లో తెలంగాణ ఆర్థిక ప్రగతిని గొప్పగా పొగిడింది. దేశం లో పేదరికం తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడొ స్థానానికి చేరిందంటే ఇది కేసీఆర్ ఘనతే. తెలంగాణ కన్నా ముందున్న రాష్ట్రాలు తమిళ నాడు కేరళ మాత్రమే.

సంక్షేమం తో పాటు అభివృద్దిని కేసీఆర్ జోడు ఎడ్లలా కొనసాగించబట్టే గత పదేళ్ల లో తెలంగాణ పేదరికం 83 శాతం తగ్గింది. తెలంగాణ పేదరికం3 శాతం ఉంటె పీఎం మోడి సొంత రాష్ట్రము గుజరాత్ లో పేదరికం 9 శాతం ఉంది.నీతి ఆయోగ్ నివేదిక తోనైనా కాంగ్రెస్ నేతలు నిజాలు మాట్లాడటం అలవాటు చేసుకోవాలి.

దావోస్ కు వెళ్లిన సీఎం బృందం రాష్ట్రం అప్పుల్లో ఉంది పెట్టుబడులకు రావొద్దు అని చెప్పదలుచుకుందా? దావోస్ వెళ్లడం అంటే ఖర్చు దండగ అని ప్రతిపక్షం లో ఉండగా ఉత్తమ్ అన్నారు ఇప్పుడేమంటారు? ప్రశాంతంగా ఉన్న రాష్ట్రం లో కాంగ్రెస్ హత్యరాజకేయాలు మొదలుపెడుతోంది. ఇది మంచిది కాదు పద్ధతి మార్చుకోవాలి.

ఇంకా వంద రోజులు కాలేదు కదా అని ఆగుతున్నాం. లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడే వాళ్ళము. కొన్ని రోజులైతే బీ ఆర్ ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా ..రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారు .

LEAVE A RESPONSE