దళితులను దారుణంగా మోసం చేస్తున్న కేసీఆర్

-దళితులకిచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదు
-మీ రాకతో నా జన్మధన్యమైందన్న సత్యనారాయణ
-ప్రతి కార్యకర్త ఇంట్ల నేనుంటా… ధైర్యంగా కొట్లాడండి
-సత్యనారాయణకు భరోసా ఇచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

‘‘సార్… ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను దారుణంగా మోసం చేస్తుండు. దళితులకు ఇచ్చిన హామీలేవీ నెరవేర్చడం లేదు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే తెలంగాణలో దళితులకు మేలు జరుగుతుంది‘’’ అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎదుట బీజేపీ సామాన్య కార్యకర్త ఎన్.సత్యనారాయణ వెలిబుచ్చిన అభిప్రాయాలివి.

కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ లోని సాంబమూర్తి నగర్ లోని ఎన్.సత్యనారాయణ నివాసానికి చేరుకున్నారు. చిన్న ఇంట్లో అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్న సత్యనారాయణ కుటుంబ సభ్యులను కలిసిన అమిత్ షా వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అమిత్ షాను చూడగానే ఉబ్బితబ్బిబ్బై సత్యనారాయణ కళ్లలో ఆనందభాష్పాలు రాలాయి. ‘’ సార్.. 30 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడుతున్నా… మీ అంత గొప్ప నాయకుడు నాలాంటి సామాన్య కార్యకర్త ఇంటికి రావడం నా అద్రుష్టం. నా జన్మధన్యమైంది. మరింత కష్టపడి పనిచేస్తా’’అని పేర్కొన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ 8 ఏండ్లుగా దళితులను దారుణంగా మోసం చేశారని సత్యనారాయణ వాపోయారు. ‘‘దళితుడికి సీఎం పదవి ఇస్తానన్న హామీని గాలికొదిలేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీ అమలు కాలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో లబ్ది పొందాలని తెచ్చిన దళిత బంధు పథకాన్ని పూర్తిగా నీరుగార్చారు. కేసీఆర్ దురాగతాలపై పోరాటం చేసిన తనపై అక్రమంగా కేసులు నమోదు చేసి వేధించారు. సీఎం కేసీఆర్ ‌పాలనను అంతమొందిస్తేనే దళితులకు న్యాయం జరుగుతుంది’’అని అభిప్రాయపడ్డారు.

సత్యనారాయణ చెప్పిందంతా సానుకూలంగా విన్న అమిత్ షా… ‘‘ప్రతి కార్యకర్త ఇంట్ల నేనుంటా…మీరంతా ధైర్యంగా కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలనపై కొట్లాడండి‘’’ అని భరోసా ఇస్తూ కిషన్ రెడ్డి, బండి సంజయ్, తరుణ్ చుగ్ లతో కలిసి బేగంపేట ఎయిర్ పోర్టుకు బయలు దేరారు.

Leave a Reply