Suryaa.co.in

Telangana

కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్ఫూర్తిదాయకం

-దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలి
-అధికారంలో ఉన్నప్పుడు ఓబీసీలకు కాంగ్రెస్ ఎందుకు న్యాయం చేయలేదు
-కేంద్రంలో బీసీలకు ప్రత్యే మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
-బీసీల కులగణనను వెంటనే చేపట్టాలి
-మధ్య ప్రదేశ్ లో పీడిత్ అధికార్ యాత్రను ప్రారంభించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
-దతియా జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం పలికిన ఓబీసీ నేతలు, కార్యర్తలు

దతియ (మధ్య ప్రదేశ్), జనవరి 28: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని, కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. కేసీఆర్ లా పట్టదలతో, కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని తెలిపారు.

కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని ఓబీసీ హక్కుల కోసం మధ్య ప్రదేశ్ లో పోరాటాన్ని మొదలుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు వంటిదని విమర్శించారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

మధ్య ప్రదేశ్ లోని దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ తలపెట్టిన “పీడిత్ అధికార్ యాత్ర” ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దతియలో ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు.

యాత్రను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ…. తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో కేసీఆర్ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదని, ఎన్ని ఒడిదిడుకులు ఎదురైనా లక్ష్య సాధన కోసం పనిచేసి తెలంగాణ సాధించారని వివరించారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగించి ఉద్యమాన్ని నడిపించారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదని చెప్పారు.

ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లు కట్టే పరిస్థితిని పారద్రోలారని గుర్తు చేశారు. రైతులకు పెట్టబడిసాయం చేయడమే కాకుండా పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే యంత్రాంగాన్ని సృష్టించారని తెలిపారు. తెలంగాణను సీఎం కేసీఆర్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాలు కలిగేలా చేశారని గుర్తు చేశారు. కానీ ఝాన్సీ రైల్వే స్టేషన్ ను చూస్తే మధ్య ప్రదేశ్ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని, పెద్ద పరిశ్రమలు లేని కారణంగా చదువుకున్న పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితులు మధ్య ప్రదేశ్ లో మారాలని ఆకాంక్షించారు.

దేశానికి స్వతంత్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓబీసీ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని, ఎందుంటే ఓబీసీలు ఐక్యంగా లేరు కాబట్టి ప్రభుత్వాలు ఆ డిమాండ్ ను పెడచెవిన పెడుతున్నాయని, కాబట్టి ఓబీసీలకు ఐక్యం చేయడానికి దామోదర్ యాదవ్ ముందడుగు వేయడం ప్రశంసనీయమని స్పష్టం చేశారు. ఓబీసీలకు, మహిళలకు, ఇతర అణగారిన వర్గాలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన వాటా లేకపోవడం ఆందోళనకరమని అన్నారు.

“కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ వంటి వారు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దేశంలో ఓబీసీ న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎవరి తప్పు అది ? అనేక సంవత్సరాలు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు ఎక్కువ చేయలేకపోయింది ? ఓబీసీలకు ఎందుకు మద్ధతివ్వలేదు ? ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య ఎందుకు తక్కువగా ఉంది ? ఇది ఎవర తప్పు ? ఇవన్నీ ఆలోచించదగిన అంశాలు” అని వ్యాఖ్యానించారు. ఇతర పార్టీలకు చెందిన పెద్ద పెద్ద నాయకులు వచ్చి పెద్ద పెద్ద మాటలు చెబుతారని, కానీ పనిమాత్రం చేయబోరని విమర్శించారు.

ఉద్యమిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తారన్న విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఇది దామోదర్ సింగ్ యాదవ్ ఉద్యమం కాదని, ఇది ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేస్తున్న ఉద్యమమని అన్నారు. చిన్న ఆరంభమని అనుకోవద్దని, నదులు కూడా చిన్నగా మొదలవుతాయని, కానీ అవి విశ్వరూపం చూపిస్తే ఎవరూ ఎదురు నిలబడలేరని స్పష్టం చేశారు. దామోదర్ యాదవ్ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, దేశవ్యాప్తంగా అది విస్తరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. యువకులు, మహిళలకు ప్రధాన స్రవంతిలోకి వచ్చి ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

మధ్య ప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి రావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఆ రాష్ట్రానికి చెందిన ఝాన్సీ రాణి, అవంతిబాయి వంటి పోరాటయోధులు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకమని అన్నారు. ఇదే రాష్ట్రానికి చెందిన ఓబీసీ మహిళా ఉమా భారతి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయడమే కాకుండా జాతీయ స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారని ప్రస్తావించారు.

కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల ఉద్యమం: దామోదర్ యాదవ్
ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించి తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కలు సాధించడానికి ఉద్యమాన్ని మొదలుపెట్టాలని ఓబీసీ ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ యాదవ్ తెలియజేశారు. సంకల్పంతో పనిచేస్తే ఏదైనా సాధించవచ్చనడానికి కేసీఆర్ ఉదాహరణ అని చెప్పారు. దేశంలో ప్రత్యేక రాష్ట్రాల కోసం సుదీర్ఘంగా అనేక ఉద్యమాలు జరిగినా సాధించని ఫలితాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వల్పకాలంలోనే సాధించారని అన్నారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అధికారంలో ఉన్న పదేళ్ల పాటు రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించారని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశంలో ఎక్కడా చేపట్టనన్ని కార్యక్రమాలు రైతుల కోసం కేసీఆర్ చేపట్టారని వివరించారు. బీసీల సంక్షేమానికి ఎనలేని కృషి చేశారని వివరించారు. కాగా,పీడిత్ అధికార్ యాత్రను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

LEAVE A RESPONSE