-
విశాఖలో చిన్ని బినామీ కంపెనీకి 64 ఎకరాలు ఎలా ఇచ్చారంటూ కేశినేని నాని రాజకీయ రచ్చ
-
దానితో నాకు సంబంధం లేదన్న ఎంపి చిన్ని
-
నానిని సైకోగా అభివర్ణించిన చిన్ని
-
చిన్ని ఆఫీసుకి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోమన్న నాని
-
‘కృష్ణా’లో కేశినేని ‘ఫ్యామిలీ వార్’
( సుబ్బు)
వాళ్లిద్దరూ అన్నదమ్ములు. అందులో ఒక సోదరుడు గత ఎన్నికల ముందు వరకూ విజయవాడకు రెండుసార్లు టీడీపీ నుంచి ఎంపీగా గెలిచినాయన. ఆ తర్వాత పార్టీ కంటే నేనే ఎక్కువన్న నోటిదురుసు-అహంకారవైఖరితో నోరుపారేసుకుని, టీడీపీకి దూరమయి.. నాటి సీఎం జగన్తో కండువా కప్పించుకుని ‘ఫ్యాన్’ ఆన్ చేసుకున్నారు. నిజానికి ఆయనకు ముక్కుసూటిమనిషి అనే పేరు ఎంత ఉందో, నిలువెల్లా అహంకారమే అన్న పేరూ అంతే లేకపోలేదు. ‘పార్టీ కంటే తానే ఎక్కువ. జనం నన్ను చూసి ఓటేశారు తప్ప, పార్టీని చూసి కాదనేంత అహంకారం’. కానీ అది ఆత్మాభిమానం అన్నది ఆయన భావన.
గత ఎన్నికల్లో వైసీపీ పోటీ చేసిన ఆయన సొంత సోదరుడి పైనే ఓడిపోయారు. నిజంగా తనను చూసే జనం ఓటేసి ఉంటే, మరి ఆ ఎన్నికలో ఎందుకు ఓడించారన్నది సోదరుడి ప్రశ్న. ఇంతకూ ఆయన పేరు కేశినేని నాని. ఇప్పుడాయన రాజకీయాల్లో లేరు. అలాగని గమ్మున కూర్చోవడం లేదు.
సోదరుడిపై సోషల్మీడియాలో.. సరికొత్త పోస్టులతో కత్తులు నూరుతున్నారు. కొత్తగా విశాఖలో సోదరుడి బినామీ సంస్థకు 60 ఎకరాల భూమి ఎలా ఇస్తారంటూ కొత్త తలనొప్పికి తెరలేపారు. ఆ కంపెనీ తెరవెనక సూత్రధారులను కూడా తెరపైకి తెచ్చి, నానా గత్తర చేస్తున్నారు.
మరి సిట్టింగ్ ఎంపీ అయిన సోదరుడు గమ్మునే ఉంటారా ఏంటి? అందునా అధికార పార్టీనాయె! ఆయనా ఎదురుదాడి చేస్తున్నారు. సోషల్మీడియా రోడ్లపై ఓ సైకో మతిభ్రమించి తిరుగుతున్నారని, ఆ సైకోను పట్టించుకోవద్దని ఘాటుగా బదులిస్తున్నారు. ఆయన పేరు కేశినేని చిన్ని. అంటే మాజీ ఎంపి కేశినేని నాని సోదరుడన్నమాట!
ఇప్పుడు ఈ అన్నదమ్ములు విసుకురుకుంటున్న సవాళ్లు-ప్రతి సవాళ్లు.. సోషల్మీడియాలో హాట్ హాట్గా మారాయి. ఇద్దరిలో ఎవరూ తగ్గకుండా, ఒకరిపై మరొకరు సంధించుకుంటున్న ఆరోపణాస్త్రాలు రాజకీయ అగ్గి రాజేస్తున్నాయి. కాకపోతే చిన్ని ప్రస్తుతం ఎంపీ కావడం, నాని ఏ పార్టీలోనూ లేకపోవడంతో.. సహజంగా నాని చేసే ఆరోపణలకే ఎక్కువ ప్రచారం-ప్రాధాన్యం లభిస్తోంది.
నాని చేసిన ఆరోపణలకు సంబంధిత కంపెనీ ప్రతినిధులు కూడా, విదేశాల నుంచి జూమ్లో మీడియా సమావేశం నిర్వహించారంటే.. కేశినాని ఆరోపణలకు ఏ స్థాయి ప్రాధాన్యం లభించిందో స్పష్టమవుతోంది. కాకపోతే రాజకీయంగా కేశినేని నానికి మద్దతునిచ్చే వారు లేకపోయినా.. ఆయన చేసిన ఆరోపణలను వైసీపీ అస్త్రంగా సంధించడమే ఇక్కడ విశేషం.
విజయవాడ మాజీ ఎంపి కేశినేని నాని, ఆయన సోదరుడు, ప్రస్తుత ఎంపీ కేశినేని చిన్ని మధ్య సోషల్ మీడియా వేదికగా వార్ నడుస్తోంది. బుధవారం ఎంపీ చిన్నిపై ఎక్స్లో విమర్శలు చేస్తూ నాని ట్వీట్ చేశారు.
దీనికి ప్రతిగా.. సైకోలను పట్టించుకోవద్దని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ చిన్ని ట్వీట్ చేశారు. దానికి ప్రతిగా.. చిన్ని తన కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తొలగించాలని, విజయవాడ మాజీ ఎంపి కేశినేని నాని ట్వీట్ చేశారు.
చిన్ని చేయని అక్రమ దందాలు లేవని, ఇసుక వ్యాపారం, ఫ్లెయాష్, గ్రావెల్, భూదందాలు, పేకాట గృహాలు నడిపించారని, రేషన్ బియ్యం మాఫియా దగ్గర వసూళ్లు చేశారని ఆరోపించారు. చిన్ని కార్యాలయానికి ఎన్టీఆర్ పేరు తీసేసి చార్లెస్ శోభరాజ్ పేరు పెట్టుకోవాలని ప్రజల కోరిక అంటూ నాని ట్వీట్ చేశారు. దీనితో వేడి మరింత పెరిగినట్టయింది.
కేశినేని నాని చేసిన ట్వీట్కు ఎంపీ కేశినేని చిన్ని కౌంటర్ ట్వీట్ ఇచ్చారు. సోషల్ మీడియా రోడ్లపై మతి భ్రమించి ఓ సైకో తిరుగుతున్నారని, సోషల్ మీడియాలో కసి, పగ, ద్వేషంతో రగిలిపోతున్నారని పేర్కొన్నారు.
విజయవాడ అభివృద్ధిపై ఆ సైకో విషం చిమ్ముతున్నారని, అలాంటి ట్వీట్లకు స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఎంపీ కేశినేని చిన్ని ట్వీట్ చేశారు.
మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు, ఎంపీ కేశినేని చిన్నిపై సోషల్ మీడియా వేదికగా చిన్ని సృష్టించిన బినామీ కంపెనీకి విశాఖలో ఏకంగా 60 ఎకరాలు పంపిణీ చేయడం ఏంటని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. మంత్రి నారా లోకేష్ పేరును ఎంపీ చిన్ని దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. మరోవైపు టీసీఎస్కు భూమి కేటాయించడాన్ని ఆయన ప్రశంసించారు.
అయితే కేశినేని నేరుగా తన సోదరుడి అవినీతి అక్రమాలను ప్రస్తావించడంతోపాటు, వాటి వివరాలు కూడా బయటపెడుతుంటే.. ఎంపి చిన్ని మాత్రం నానికి సంబంధించిన అవినీతి గురించి ప్రస్తావించకపోవడం ప్రస్తావనార్హం. ఫలితంగా ఈ సోషల్మీడియా సమరంలో, నానిదే పైచేయిగా కనిపిస్తోందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.