పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలి

– ఘటనలో కేటీఆర్ పీఏపైనా ఆరోపణలు
– టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మంత్రి కేటీఆర్ ను విచారించేందుకు అనుమతించాలని గవర్నర్ ను కోరామని తెలిపారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. టీఎస్పీఎస్సీని పూర్తిగా రద్దు చేసి, విచారించాలన్నారు. పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్ తమిళి సైను కలిసిన ఆయన.. పేపర్ లీక్ లో జరిగిన అవతవకలపై ఫిర్యాదు చేశారు.

కేటీఆర్ శాఖకు సంబంధించిన ఉద్యోగులే పేపర్ లీక్ లో కీలకంగా వ్యవహరించారని, ఇందుకు ఆ శాఖ మంత్రి కేటీఆరే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పేపర్ ను దొంగిలించి కోట్లకు అమ్ముకుని లక్షలాది మంది నోరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆరోపించారు. ఈ ఘటనలో కేటీఆర్ పీఏపైనా ఆరోపణలు వస్తున్నట్టు చెప్పారు.ఆర్టికల్ 317 ప్రకారం గవర్నర్ కు విశేష అధికారాలున్నాయని, వాటి ప్రకారం ఇప్పుడున్న బోర్డులో ఉన్న అందర్నీ సస్పెండ్ చేసే అధికారం గవర్నర్ కు ఉంటుందని రేవంత్ చెప్పారు.

టీఎస్పీఎస్సీ పేపర్ లేక్ కేసులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ పై తమకు నమ్మకం లేదని, పారదర్శక విచారణకు గవర్నర్ ను అనుమతి కోరామని రేవంత్ రెడ్డి తెలిపారు. ఇది లక్షలాది విద్యార్థులు కాదు.. లక్షలాది కుటుంబాలకు సంబంధించిన సమస్య అని అన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులందరినీ సస్పెండ్ చేసి.. పారదర్శక విచారణ చేస్తారని భావించామని, కానీ ప్రభుత్వం ఆ పని చేయలేదన్నారు. పేపర్ లీకేజీ లో ప్రభుత్వ పెద్ద ల పాత్ర ఉందని రేవంత్ ఆరోపించారు. మంత్రి కేటీఆర్ ను ప్రాసిక్యూట్ చేయడానికి గవర్నర్ కు అప్లికేషన్ పెట్టామన్నారు.

గత్తంలో వ్యాపం కుంభకోణం లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కోడ్ చేస్తూ అప్లికేషన్ ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి కేటీఆర్ తో పాటు టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి , సెక్రటరీ అనితా రామచంద్రన్ ను ప్రాసిక్యూట్ చేయడానికి కాంగ్రెస్ కు అవకాశం ఇవ్వాలని గవర్నర్ ను కోరామని తెలిపారు. టీఎస్పీఎస్సీ బోర్డు సభ్యులు కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున విచారణ పూర్తయ్యే వరకు, గవర్నర్ తనకున్న విశేష అధికారాలతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను రద్దు చేయాలని కోరామన్నారు. ఇందుకు గవర్నర్ సానుకూలంగా స్పందించారని, లీగల్ ఓపినీయన్ తీసుకుని నిర్ణయం తీసుకుంటానని గవర్నర్ చెప్పారని రేవంత్ తెలిపారు.

ఉగాది వేడుకల్లో పాల్గొన్న రేవంత్
శోభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా గాంధీభవన్ లో జరిగిన ఉగాది వేడుకలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాజరయ్యారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో కలిసి చిలుకూరి శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో జరిగిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలకు శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అండగా ఉండడమే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, రాష్ట్రంలో బలహీన వర్గాల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబదుతుందన్నారు రేవంత్. రాహుల్ గాంధీ పాదయాత్ర సందేశాన్ని జనంలోకి తీసుకెళ్లాలని శ్రేణులకు సూచించారు. ప్రజలకు నచ్చేలా పనిచేస్తే తప్పకుండా ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇస్తారన్నారు.

Leave a Reply