Suryaa.co.in

Andhra Pradesh

ధర్మవరం సందుల్లోనే వైసీపీకి బుద్ధి చెబుదాం

-సత్య కుమార్ కు సందులు తెలియకపోవచ్చు.. సమస్యలు తెలుసు
-ఢిల్లీలో ఉండాల్సిన వ్యక్తి మన కోసం ధర్మవరం వచ్చారు
-ఆయనను గెలిపించాల్సిన బాధ్యత మనదే
-ముదిగుబ్బ మండల నాయకులు, కార్యకర్తలతో పరిటాల శ్రీరామ్

సత్య కుమార్ కి ధర్మవరం నియోజకవర్గంలో సందులు తెలియదని.. ఎమ్మెల్యే కేతిరెడ్డి ఎద్దేవా చేస్తున్నారని ఆయనకు అదే ధర్మవరం సందుల్లోనే సమాధానం చెబుదామని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ముదిగుబ్బ మండల నాయకులతో ఆత్మీయ పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి అభ్యర్థి సత్య కుమార్ తో పాటు మాజీ ఎమ్మెల్యే పార్థసారథి ఇతర ముఖ్య టీడీపీ, బీజేపీ, నాయకులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ సత్యకుమార్ స్థాయికి ఆయన ఎక్కడో ఢిల్లీలో ఉండాల్సిందని… కానీ ఆయన మన కోసం ధర్మవరం వచ్చారని అన్నారు. అలాంటి వ్యక్తిని గెలిపిస్తే ధర్మవరం పేరు ఢిల్లీలో వినిపిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డికి సత్యకుమార్ పేరు ప్రకటించినప్పటి నుంచి నిద్ర పట్టడం లేదని.. అందుకే ఆయన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సత్య కుమార్ కు ధర్మవరం నియోజకవర్గంలో సందుల గురించి తెలియకపోవచ్చు కానీ.. ప్రజా సమస్యలు తెలుసునని శ్రీరామ్ అన్నారు. ఆయనకు ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో కూడా తెలుసునని స్పష్టం చేశారు. కబ్జాలు చేసేందుకు నీలాగా సందుల వెంబడి తిరగరని.. ఆయన ప్రజల సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారని అన్నారు. బిజెపితో పొత్తు అంటే కొంతమంది అభద్రతా భావానికి గురవుతున్నారని.. కానీ అలాంటి అపనమ్మకాలు పెట్టుకోవద్దని శ్రీరామ్ అన్నారు.

గతంలో కదిరి ఎమ్మెల్యేగా పనిచేసిన పార్థసారథి ముస్లిం మైనార్టీలకు ఎంత అండగా నిలిచారో.. మనకు తెలుసునన్నారు. ఇప్పుడు ఆయన కంటే ఎక్కువగా సత్య కుమార్ మనకు అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. నాయకులందరూ రేపటి నుంచే ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కూటమి అభ్యర్థిగా ఉన్న సత్యకుమార్ గెలుపుకు కృషి చేయాలన్నారు. కొత్త సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు.

LEAVE A RESPONSE