ఈ ఏడాది మరో 400 సీఎన్జీ స్టేషన్లు ప్రారంభించనున్న మేఘా గ్యాస్

-రెండు లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం..
– మేడ్చల్ జిల్లా కీసరలో 100వ సీఎన్జీ స్టేషన్ ప్రారంభించిన సీఈఓ వెంకటేశ్

హైదరాబాద్, జూన్ 07 : ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 400 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 సి.ఎన్.జి స్టేషన్లని ఏర్పాటు చేసి తన ఘనతను చాటుకుంది.

తాజాగా తెలంగాణలోని మేడ్చల్ జిల్లా కీసర వద్ద 100వ సి.ఎన్.జి స్టేషన్ ప్రారంభించింది. మేఘా గ్యాస్ సీఈఓ పలిమిపాటి వెంకటేశ్ ఈ స్టేషన్ను ప్రారంభించారు. మేఘా గ్యాస్ తన తొలి సి.ఎన్.జి స్టేషన్ను ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా, ఆగిరిపల్లిలో ప్రారంభించి.. తన ప్రస్థానం మొదలు పెట్టింది. 100వ స్టేషన్ను బుధవార కీసరలో ప్రారంభించింది.

ఇప్పటి వరకు తెలంగాణలో 46, ఆంధ్ర ప్రదేశ్లో 28, కర్ణాటకలో 12, ఉత్తర ప్రదేశ్లో 4, మధ్య ప్రదేశ్లో 4, తమిళనాడులో 3, పంజాబ్లో 3 సి.ఎన్.జి స్టేషన్లను మేఘా గ్యాస్ ఏర్పాటు చేసింది. రాజస్థాన్లో కూడా తన సేవలను అందించనుంది.

హైదరాబాద్ కేంద్రంగా నడిచే మేఘా సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో అత్యంత భద్రతా ప్రమాణాలను పాటిస్తూ.. సహజ వాయువును సరఫరా చేస్తోంది. 2015లో ప్రారంభమైన మేఘా గ్యాస్ తన సేవలను ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, కర్ణాటకలోని బెల్గాం మరియు తుమకూరులో ప్రారంభించింది.

తెలంగాణలోని నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాలకు విస్తరించింది. వినియోగదారులకు నిరంతరం అందుబాటులో ఉంటూ దేశవ్యాప్తంగా 10 రాష్ట్రాల్లో 64 జిల్లాల్లో ఎలాంటి అవాంతరం లేకుండా సేవలు కొనసాగిస్తోంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక వినియోగదారుల కోసం పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరా చేస్తోంది.

ఈ సందర్భంగా మేఘా గ్యాస్ సీఈఓ వెంకటేశ్ మాట్లాడుతూ.. 100వ సి.ఎన్.జి స్టేషన్ ప్రారభించి మా కంపెనీ ప్రయాణంలో ముఖ్యమైన మైలురాయి చేరుకోవడం తమకెంతో గర్వకారణంగా ఉందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 400 సీఎన్జీ స్టేషన్లను, 2 లక్షల పీఎన్జీ కనెక్షన్లను ఇస్తామన్నారు. ఇంటింటికి తక్కువ ఖర్చుతో హరిత ఇంధనాన్ని పంపిణీ చేస్తూ.. ముందుకు సాగుతామని వెల్లడించారు.

దేశవ్యాప్తంగా సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (సి.జి.డి ) పనులను మేఘా గ్యాస్ చేపడుతోంది. ఈ సి.జి.డి ప్రాజెక్ట్లో భాగంగా సీఎన్జీ స్టేషన్లు, సిటీ గేట్ స్టేషన్లు, మదర్ స్టేషన్లు, ప్రధాన పంపిణీ నెట్వర్క్ పైప్ లైన్లను వేస్తోంది. ఇప్పటి వరకు సుమారుగా 3,000 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి.. గ్యాస్ పంపిణీని సులభతరం చేస్తోంది. ఇది తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండడమే కాకుండా.. కర్బన ఉద్గారాలను తగ్గిస్తూ.. అటు ప్రజానీకానికి, పర్యావరణానికి తోడుగా నిలుస్తోంది.

Leave a Reply