40 వేల కోట్ల తెలంగాణ ఆస్తులను అమ్ముతున్న మోడీ ప్రభుత్వం

• తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం
• హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందన్న మంత్రి కేటీఆర్
• ఈ 6 సంస్థలకు గతంలో సూమారు 7200 ఎకరాల భూమి కేటాయించిన రాష్ట్రం
• ప్రభుత్వ ధరల ప్రకారం కనీసం 5 వేల కోట్ల రూపాయాలకు పైగా ఈ భూములు విలువ చేస్తాయి
• బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం 40 వేల కోట్లు ఉండనున్న ఆయా భూముల విలువ ఆయా భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలి
• హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజాఉపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు కేంద్రానికి ఎక్కడుందని మంత్రి ప్రశ్న
• కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ

ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని మంత్రి శ్రీ కేటీఆర్ ఆరోపించారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి “కహానీలు” చెపుతున్న మోడీ ప్రభుత్వం, కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బీజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుసేరు అమ్ముతుందని కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును పట్టించుకోని మోడీ ప్రభుత్వం.. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మవద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతో పాటు ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పున:ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మరోసారి కేంద్రాన్ని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాపార వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. ఇందులో భాగంగానే తెలంగాణలో ఉన్న హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెట్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, HMT, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(CCI), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందన్నారు కేటీఆర్.

తమ అమ్మకపు ప్రణాళికల్లో కేంద్రం పెట్టిన ఈ అరు సంస్థలకు గతంలోని రాష్ట్ర ప్రభుత్వాలు సుమారు 7200 ఎకరాల భూమిని కేటాయించాయన్న మంత్రి కేటీఆర్, ఇప్పుడు ఆ భూముల విలువ ప్రభుత్వ లెక్క ధరల ప్రకారం కనీసం 5వేల కోట్ల రూపాయలపైనే ఉంటుందన్నారు. బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం వాటి విలువ 40 వేల కోట్లు ఉంటుందని తెలిపారు. స్థానిక ప్రజలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించడంతో పాటు రాష్ట్రంలో పారిశ్రామికాభివృధ్ది జరగాలన్న ఉదాత్తమైన లక్ష్యంతో గతంలో ఆయా కంపెనీలుకు అత్యంత తక్కువ ధరకు, అనేక సందర్భాల్లో ఉచితంగానే భూములు కేటాయించిన సంగతిని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందన్నారు కేటీఆర్. ఆయా సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో ప్రయివేట్ పరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రవేటు పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు కేటీఆర్. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవే వంటి ప్రజాఉపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పియస్‌యూల అమ్మకంపైన పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపంగా కొనసాగిన ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునరుద్దరణ చేపట్టి వాటిని బలోపేతం చేయాలని సూచించారు. ఇలా చేయకుండా తెలంగాణలోని ఆయా కంపెనీల ఆస్థులను అమ్మి సొమ్ము చేసుకుని బయటపడతామంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామని కేటీఆర్ హెచ్చరించారు. తిరిగి ప్రారంభించేందుకు అవకాశం లేకుంటే ఆయా సంస్థలున్న ప్రాంతంలోనే నూతన పరిశ్రమల ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలని కేటీఆర్ కోరారు.

Leave a Reply