భవిష్యత్తులో మరిన్ని జాబ్‌మేళాల నిర్వహణ

– నిరుద్యోగ యువతకు ఉపాథి కల్పనే ప్రధాన లక్ష్యం
– ప్రెస్‌మీట్‌లో వి.విజయసాయిరెడ్డి ప్రకటన

ఆచార్య నాగార్జున వర్సిటీ. గుంటూరు: ప్రెస్‌మీట్‌లో విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..:
ఇప్పటికే 30,473 ఉద్యోగాలు:
సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు విద్యాభ్యాసం పూర్తి చేసుకుని, ఉద్యోగ అవకా«శాల కోసం ఎదురు చూస్తున్న యువతకు అవకాశం కల్పించాలని, వారికి ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం జాబ్‌మేళాలకు శ్రీకారం చుట్టాం. మూడు దశల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. తొలి జాబ్‌మేళా తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో, రెండోది విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో జరగ్గా, ఇప్పుడు మూడో కార్యక్రమం ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్నాం.
తొలి రెండు జాబ్‌మేళాల్లో 347 కంపెనీలు పాల్గొని మొత్తం 30,473 మందికి ఉద్యోగాలు ఇచ్చాయి.

ఇప్పుడు 26,289 ఖాళీలు భర్తీ:
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో శని, ఆదివారాలు (7, 8వ తేదీలు) నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో 210 కంపెనీలు పాల్గొంటున్నాయి. ఆ కంపెనీల్లో మొత్తం 26,289 ఖాళీలు ఉండగా, వాటన్నింటినీ భర్తీ చేయనున్నారు.

జాబ్‌మేళాలకు హాజరు కావాలనుకునే ఉద్యోగార్థుల కోసం ప్రత్యేకంగా.. ‘వైయస్సార్‌సీపీజాబ్‌మేళాడాట్‌కామ్‌’ వెబ్‌సైట్‌ రూపొందించగా, ఇక్కడ ఇంటర్వ్యూల కోసం 97వేలకు పైగా అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల వారికి ఈ జాబ్‌మేళాలో అవకాశం కల్పిస్తున్నాం.

ఏయే రంగాల కంపెనీలు..:
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌ సర్వీసెస్, ఐటీ కంపెనీలు, రీటెయిల్‌ లాజిస్టిక్‌ కంపెనీలు, ఫార్మా కంపెనీలు, కన్సట్రక్షన్‌ కంపెనీలు, హెల్త్‌ కేర్‌ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్‌ కంపెనీలు, ఆటొమొబైల్‌ కంపెనీలు, ఎడ్యుకేషనల్‌ సర్వీసెస్, మార్కెటింగ్‌ అండ్‌ సేల్స్‌ సర్వీసెస్‌ తదితర రంగాలకు చెందిన కంపెనీలు పాల్గొంటున్నాయి.

లక్ష్యానికి మించి ఉద్యోగావకాశాలు:
వాస్తవానికి ఈ జాబ్‌మేళాలు నిర్వహించాలనుకున్నప్పుడు, మూడు ప్రాంతాల్లో 15 వేల ఉద్యోగాలు ఇవ్వాలని అనుకున్నాం. కానీ అంచనాలకు మించి రెండు జాబ్‌మేళాల్లోనే 30,473 మందికి ఉద్యోగాలు రాగా, ఈ జాబ్‌మేళా పూరై్తన తర్వాత ఆ సంఖ్య 50 వేలు దాటనుంది.

ఏ ఇబ్బంది కలగకుండా..:
ఈ జాబ్‌మేళా కోసం రిజిస్టర్‌ చేసుకున్న వారికి ఎక్కడా ఇబ్బంది లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశాం. అభ్యర్థులు ముందుగా, యూనివర్సిటీ మెయిన్‌ ఎంట్రెన్స్‌ వద్ద క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయాలి. మొబైల్‌ ఫోన్లో స్కాన్‌ చేయగానే, ఏ బ్లాక్‌లో ఏయే ఉద్యోగాల ఇంటర్వ్యూలు అన్న వివరాలు తెలుస్తాయి. డైరెక్షన్‌ బటన్‌ నొక్కితే అక్కడికి ఎలా వెళ్లాలన్నది తెలుస్తుంది. ఆ తర్వాత బ్లాక్‌ ఇంఛార్జ్‌ బటన్‌ నొక్కితే ఆయన పేరు, ఫోన్‌ నెంబరు వివరాలు తెలుస్తాయి. అలాగే కంపెనీల జాబితాలో ఏ బ్లాక్‌లో ఏ కంపెనీ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయన్నది తెలుస్తుంది.

ఉద్యోగార్థులు ఇక్కడ కేవలం ఒకే కంపెనీ ఇంటర్వ్యూకు హాజరు కావాలని లేదు. వారికున్న అర్హతలను బట్టి, ఎన్ని కంపెనీల ఇంటర్వ్యూలకు అయినా హాజరు కావొచ్చు.

ప్రతి బ్లాక్‌లో హెల్ప్‌ డెస్క్, ఇంటర్నెట్, జీరాక్స్‌ వంటి అన్ని సదుపాయాలు ఉంటాయి. అభ్యర్థులకు మంచినీరు, మజ్జిగ, భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాం. ఉద్యోగార్థులకు ట్రేడ్‌ యూనియన్‌ నుంచి, పార్టీ నుంచి దాదాపు 800 మంది వలంటీర్లు సేవలందిస్తారు.

జాబ్‌మేళాలో ఉద్యోగాలు రాని వారు ఏ మాత్రం నిరాశ చెందొద్దు. వారికి స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో శిక్షణనిస్తాం. అలాగే భవిష్యత్తులో మరిన్ని జాబ్‌మేళాలు నిర్వహిస్తాం. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారమయ్యే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని విజయసాయిరెడ్డి వివరించారు.

Leave a Reply