– లేకపోతే మీ వ్యక్తిత్వానికే నష్టం
– ఇప్పటికే కాపు జాతికి అందనంత దూరమయ్యారు
– ఎక్కడా నిలకడ ఉండని మిమ్మల్ని జనం ఎందుకు నమ్ముతారు?
– చిరంజీవి, దాసరి, పవన్కు మద్దతునివ్వని మీరేం కాపునేత?
– కాపుల్లో మీరొక్కరే నేతగా ఉండాలన్నదే మీ స్వార్థం
– చిరంజీవి కాపులకు ఏమీ చేయలేదనడానికి మీరు నోరెలావచ్చింది?
– అలిగితే రాజీనామా చేసే మిమ్మల్ని ఏ పార్టీ నమ్ముతుంది?
– మీరు రాగానే లేవకపోతే రాజీనామా చేస్తారా? ఇదేం పద్ధతండి?
– మీ రాజీనామాలన్నీ మీ అహం కోసమే తప్ప కాపు జాతి కోసం కాదు కదా?
– ఇక మారండి.. లేకపోతే కాపు జాతే మిమ్మల్ని విడిచిపెడుతుంది
– గత ఓటమి గుణపాఠం నుంచి నేర్చుకుంది ఇదేనా?
– ముద్రగడకు ఆయన అనుచరుడు వెంకట రమణ ఘాటు లేఖ
( మార్తి సుబ్రహ్మణ్యం)
జగనన్న సర్కారులో రివర్స్ టెండరింగ్ మాదిరిగా.. కాపు వర్గంలో ఇదో రివర్స్ లెటర్ సంచలనం! జనసేనాధిపతి పవన్ కల్యాణ్పై వరస లేఖాస్త్రాలు సంధిస్తున్న కాబోయే వైసీపీ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గత చరిత్ర, ఇప్పటి తరాలకు వెల్లడిస్తూ.. ఆయన ఒకప్పటి అనుచరుడైన సలాది వెంకట రమణ.. మాజీ మంత్రి ముద్రగడకు రాసిన లేఖాస్త్రం, ఇప్పుడు కాపు వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
ఈ లేఖ ఇప్పుడు సోషల్మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముద్రగడ వ్యవహారశైలి ఏమిటన్నది, ఇప్పటివరకూ తూర్పు గోదావరి జిల్లాల వారికి మాత్రమే తెలుసు. ఆయన ఎప్పుడూ ఎందుకు అలుగుతుంటారని కిర్లంపూడికే తెలుసు. ఆయన అసలు తరచూ ఎందుకు రాజీనామాలు చేస్తుంటారు? ఎందుకు పార్టీలు మారుస్తుంటారు? ఆయన ఇగోను చల్లబరిచేందుకా? కాపుల కోసమా అన్నది ఇప్పటివరకూ ఎవరికీ తెలియని రహస్యం. అయితే ఆయన ఒకప్పటి అనుచరుడు సలాది వెంకట రమణ తన లేఖలో, ఆ రహస్యాన్ని బట్టబయలు చేశారు. సలాది వెంకటరమణ.. కాబోయే వైసీపీ నేత ముద్రగడపై సంధించిన లేఖాస్త్రం పూర్తి పాఠం
గౌరవనీయులైన మద్రగడ పద్మనాభం గార్కి..
అమలాపురం నుండి మీతో సుమారు 15 సంలుగా మిమ్ములను అనుసరిస్తూ మీరు తీసుకొన్న ప్రతి నిర్ణయంలో మిమ్ములను అనుసరించే…
సలాది వెంకటరమణ
సమస్కరిస్తూ వ్రాయునది.
అయ్యా…
నేను తొలిసారిగా మిమ్మల్ని 1978 సంరం.లో జనతా పార్టీ M.L.A.గా మీరు గెలిచి అసెంబ్లీకి వచ్చిన రోజున అసెంబ్లీ గార్డెన్లో ఒక ఫోటో దిగినారు.
అప్పుడు నేను అమలాపురం నుండి జనతాపార్టీ నుండి…M.L.A. గా గెలిచిన P.V.S. రామారావు గారి అనుచరుడుగా నేను అక్కడికి వచ్చియున్నాను.
ఆ ఫోటోలో మీరు P.V.S.రామారావు గారు,పడాల అమ్మిరెడ్డి గారు, పాఠంశెట్టి సత్తిరాజు గారు, M.V.S.సుబ్బరాజు గారు, బిరుదా ఫకీర్రావు గారు, మీరూ అందరూ అందరూ జనతాపార్టీ M.L.A లుగా ఆ ఫోటోలో దిగినారు.
అప్పుడు మీ వద్దకు నేను వచ్చి మిమ్మల్ని చూసి, మీతో కరచలనం చేసి మిమ్మల్ని అభినందించినాను. అప్పుడు మీ వయస్సు 22 సం.రం.లు. నాతో సమానమైన వయస్సు మిమ్మల్ని చూసి నేను ఎంతో సంతోషించినాను.
1978 సంరం.లో మీతో పాటు తొలిసారిగా అసెంబ్లీకి వచ్చిన… Y.S.రాజశేఖర్రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, ఎం.వెంకయ్యనాయుడు, మరియు 5 సం.ల తర్వాత వచ్చిన K.చంద్రశేఖర్రావు (K.C.R)
వీరు నలుగురు ఏ స్థాయిలో ఉన్నారు వారి కుటుంబాలు ఏస్థాయిలో ఉన్నాయి?
వారు, వారి కులాల వారి ద్వారా వారిని నమ్ముకున్న వారు ఏస్థాయి అభివృద్దిలో ఉన్నారు? ఒక సారి మీరు ఆలోచించండి.
మీ కుటుంబంతో పోలిస్తే, వాళ్ల కుటుంబాల కోసం వరుస చెబుతాను…
నారా చంద్రబాబు నాయుడు తండ్రి 2 ఎకరాల సాదారణ రైతు.
Y.S.రాజశేఖర్రెడ్డి తండ్రి సున్నపు రాయి గనుల్లో గుమస్తా…
ఎం. వెంకయ్యనాయుడు తండ్రి నెల్లూరు జిల్లా మారుమూల గ్రామంలో సాదారణ రైతు.
K.చంద్రశేఖరరావు గారి తండ్రి కూడా సాధారణ రైతు.
మీ కుటుంబ నేపద్యం చూస్తే మీ తాతగారు పద్మనాభం గారు సుమారు 700 ఎకరాల భూస్వామి.
కిర్లంపూడి కేంద్రంగా చుట్టుప్రక్కల 10, 12 గ్రామాలకు మునసుబుగా వారు జీవితాంతం ఉన్నారు.
మీ తండ్రి గారు ముద్రగడ వీర రాఘవరావు గారు 2 సార్లు M.L.A గా చేసి యున్నారు.
వీరు మీ ఆస్థిని 300 ఎకరములకు తగ్గించి యున్నారు.
మిక్కిలి నిజాయితీ పరుడుగా దానశీలుడుగా నిమ్మదస్తుడుగా మీ తాతగారు, మీ తండ్రిగారు పేరుగాంచి యున్నారు.
దానికి నిదర్శనం…
ప్రత్తిపాడు, ఆచుట్టు ప్రక్కల గ్రామాల్లో అన్ని వర్గాల వారు ప్రతి ఇంట్లో ఒక పిల్లాడికి రాఘవరావు, ఆడపిల్లకు రాఘవమ్మ అని పేరు పెట్టడం నేను గమనించి యున్నాను.
మీ ప్రాంతం నుండి వచ్చిన ఉద్యోగులు కొంత మంది ఈ విషయాన్ని నాకు తెలియ జేస్తూ నా పేరు కూడా ఆయనదే అని చెప్పినారు.
చెప్పిన అతను పెరిక కులానికి చెందినవాడు.
ఇది మీ కుటుంబ గొప్పదనం ఇంతటి గొప్ప కుటుంబ నేపధ్యం గల మీరు, ఏ పరిస్ధితుల్లో ఉన్నారో మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
ఇప్పుడు మీకున్న ఆస్థి మాకు తెలిసిన… మీ ఇంటి చుట్టూ ఉన్న ఆస్థి సుమారు 7 లేక 8 ఎకరాలు తప్ప, మీ నాన్నగారు ఇచ్చిన ఏ భూమి మీ వద్ద లేదు.
కాకినాడలో కళ్యాణ మండపం, కిర్లంపూడిలో పాత సినిమా ధియేటర్ను మీరు మీ కుటుంబానికి మిగిల్చిన ఆస్థి.
మీతో రాజకీయ జీవితం ప్రారంభించిన అనాముఖులైన ఆ నలుగురు కుటుంబాలు వారి సొంత కులాలు ఏ స్ధితిలో ఉన్నాయి?
మీ కుటుంబాన్ని మీరు ఏ స్థితికి తీసుకు వచ్చారు?
కుల పోరాటాలు చేసి మీరు ఈ కులానికి ఏమి సాధించి పెట్టారు మీరు?
ఈ కులాన్ని మీరు, మీకు రాజకీయ గుర్తింపు లేని సమయాల్లో రోడ్డు ఎక్కించడం, తదుపరి ఆపివేయడం మమ్మల్ని అందరినీ పోలీసులు కేసులు, జైళ్ళు, బెయిళ్ళు, మీరు పరామర్శించడం మాకు ఇతర కులాలు అందరూ ఈ కులాన్ని విరోధులుగా చూసే స్థాయికి తీసుకెళ్ళారు.
మీతో పాటు పైన ఉదహరించిన నలుగురు నాయకులు, వారు ఏ స్థాయికి వెళ్ళారు.
వారి కుటుంబాలు ఏ స్థాయిలో ఉన్నాయి? వారి కులాలను ఎంత అభివృద్ధి చేశారు?
మీరు ఒకసారి ఆలోచించండి.
మనం కాపు రిజర్వేషన్ ఉద్యమం చేసే సమయంలో మా బోనం వెంకట చలమయ్య (B.V.C కాలేజ్ అధినేత) నాతో ఒక మాట అన్నారు.
ఒరే రమణ ఎందుకురా ఈ బి.సి రిజర్వేషన్లు వీటి కోసం ఆందోళనలు? తద్వారా యువకులను ప్రక్కదారి పట్టించడం. మన జాతిలో యువతీ యువకులు చక్కగా చదువుకుంటే, సాఫ్ట్వేర్ రంగంలోకి వెళితే ఏ రిజర్వేషన్లు అక్కర్లేకుండా, సామాన్యుడు కూడా లక్షాధికారులు అవుతారు, అందుకే ఈ కాలేజ్లు నిర్మిస్తున్నాను.
అలాగే మనలో ఉన్నటు వంటి పెద్దలు, ఇటువంటి కాలేజ్లు ఏర్పాటు చేసి యువతను ముందుకు తీసుకుని వెళితే , భవిష్యత్లో మనకు రిజర్వేషన్లుతో పని లేదురా.. అని ఆయన అప్పట్లో అనడంలోని పరమార్ధం ఏమిటో, నేను ఈ రోజు చూస్తున్నాను.
మా ప్రాంతంలో సాధారణ రైతులు- రైతు కూలీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు, పిల్లలు ఎంతో ఉన్నత స్ధితిలోకి దేశ విదేశాల్లో స్ధిరపడియున్నారు.
ఇటువంటి విజన్ మీరు ఎందుకు ఆలోచించ లేదో నాకు అర్ధం కావడం లేదు.
మా బోనం వెంకట చలమయ్య గారు అతి సాధారణమైన వ్యక్తి. ఒకే ఒక్కడికి కలిగిన ఆలోచన ..మా కోనసీమలో సుమారు 50 వేల కుటుంబాలు, ఉన్నత స్ధితిలో స్ధిరపడుటకు కారణమైనది.
ఇప్పుడు జాతికి ఎవరు ఉపకారం చేశారు? ఆయన ఆలోచన ముందు మీ ఆలోచన ఏ పాటిది?
మీరు మన కులంలో ఏ ఒక్క వ్యక్తి.. తమ తమ రంగాల్లో అభివృద్ధి చెందిన వారు, మీ వద్దకు వస్తే మీరు వారిని ఎప్పుడు ఆదరించరు!
దానికి ఉదాహరణ చిరంజీవి, దాసరి నారాయణరావు, తులసి రామచంద్రప్రభు లాంటి ఎందరో… పారిశ్రామిక వేత్తలు, విద్యావేత్తలు, వ్యాపార వేత్తలు ఎందరో మీ వద్దకు వచ్చి సంఫీుభావం తెలిపినా… మీరు వారికి తగిన గుర్తింపు ఇవ్వరు. ఎందుకో మీకు ఇగో ఫీలింగ్ ఇక్కడ మెగా కుటుంబం గూర్చి కొన్ని విషయాలు చెప్పాలి.
మీరు చెన్నారెడ్డి మంత్రి వర్గంలో మంత్రిగా ప్రమాణం చేసిన 5వ రోజున…
మాగంటి రవీంధ్రనాధ్ చౌదరి గారితో చిరంజీవి గారు, పద్మనాభం గారిని మా ఇంటికి బ్రేక్ఫాస్ట్కు తీసుకురావాలని ఆహ్వానించడం, దానికి మీరు, మీతో పాటు నల్లా సత్యనారాయణ గారు మేమందరం కూడా, మీతో పాటు చిరంజీవి గారి ఇంటికి వెళ్ళినాము. ఆయన ఎంతో సాదరంగా ఆహ్వానించి మీతో ఎన్నో విషయాలు చర్చించు కున్నారు.కానీ ఈ మధ్య లేఖలో మీరు మెగా కుటుంబం, కులానికి ఏమి చేసింది అని అడుగుతున్నారు. రంగా గారు చనిపోయినప్పుడు చిరంజీవి గారు విజయవాడ వచ్చుటకు ప్రయతిస్తే , అప్పటికే విజయవాడలో ఉన్న పరిస్ధితుల రీత్యా అక్కడకు వెళ్ళకూడదని, ప్రభుత్వంలో ఉన్న కొందరు పెద్దలు, చిరంజీవి సన్నిహితులు సూచనల మేరకు ఆయన ఆగినారు, ఆ విషయం మీకునూ తెలుసు!
ఆ మరునాడు ప్రెస్మీట్ పెట్టి ఆ సంఘటనపై ఖండించి, తాను రాక పోవడంపై కారణాలు తెలియజేశారు. వాటికి సంబంధించి మెగా కుటుంబం , కాపు కులానికి ఏ విధమైనటువంటి ఉపకారం చేయలేదని మీరు ఈ మధ్య లేఖలో ఉదహరించారు.
దానికి సమాధానంగా నేను చెప్పిన విషయాలు గ్రహించండి.
1978 సం.రంలో మీ రాజకీయ ప్రస్థానం, ఏ సినీ నేపధ్యం లేని అతిసాధారణ కుటుంబంలో నుండి చిరంజీవి నటప్రస్థానం ఒకేసారి మొదలైనాయి. తాను స్వశక్తితో ఇంతటి ఉన్నత స్ధితిని సాధించారు. ఈ ప్రయాణంలో సినీ రంగంలో ఉన్నటువంటి కుట్రలు, కుతంత్రాలు, ఒడుదుడుకులు ఎదుర్కొని ఇంతటి ఉన్నత స్ధితికి చేరుకున్నారు.
చిరంజీవి సినీ ప్రవేశం చేసినప్పటికీ, అప్పటివరకు సినీరంగంలో మన జాతి 5 శాతం కూడా ఉండేది కాదు. అది కూడా లైటింగ్ బాయ్స్, క్రైన్ బాయ్స్, మేకప్ అసిస్టెంట్స్ తదితర విభాగాల్లో ఉండేవారు.
చిరంజీవి ఎదుగుదలతో పాటు.. మన జాతిలో ఎంతో మందిని, సినీ రంగంలో వివిధ శాఖల్లో ఉన్నత స్ధితిలోకి తీసుకుని వచ్చారు. ఈ రోజు సినీరంగంలో కాపు కులానికి చెందిన అన్ని శాఖల్లోను, 65 శాతం వరకు మన వారు ఉపాధి పొందుచున్నారు.
ఇందంతా చిరంజీవి అనే వ్యక్తి వలన, కాపు జాతికి జరిగిన అభివృద్ధి. అంతే కాకుండా చిరంజీవి అనే వ్యక్తి.. సమాజానికి కావాల్సిన ఎన్నో ప్రయోజనకర సదుపాయాలు చేసియున్నారు.
అతను గుప్తదాత. ఎవరు వెళ్ళి నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం కావాలి అంటే ఎంతో కొంత సహాయం చేసే గుణం. సహాయం పొందిన వారు చెప్పు కుంటారు గాని సహాయం చేసిన వ్యక్తి చెప్పే గుణం కాదు. ఇటువంటి వ్యక్తులను మీరు విమర్శించుట, ఎంతవరకు సమంజసం? దీన్ని మీరు గమనించగలరు.
ఇకపోతే 1978 సం.రం నుండి మీ వ్యక్తిగత రాజకీయ విధానాలను నేను గమనించినది.
1983 సం.రం వరకు జనతా పార్టీలో ఉండి 6 మాసాలు ముందే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టిడిపి పార్టీలో చేరినారు. 1983 ఎమ్మెల్యేగా గెలిచారు. మిమ్మల్ని డ్రైనేజీ బోర్డు ఛైర్మన్గా నియమించారు. తర్వాత మీరు ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి కిర్లంపూడి వచ్చేశారు.
నేను అప్పటికి హైదరాబాద్లో ఉన్నాను.
తదుపరి నాదెండ్ల భాస్కరరావు వ్యవహారం జరిగితే , మీరు ఎన్.టి రామారావు గారికి మద్దతుగా నిలబడి 1985 సం.రంలో మీరు మరలా ఎమ్మెల్యేగా గెలిచారు. మిమ్మల్ని మొదటి క్యాబినేట్లో ట్రాన్స్పోర్టు మంత్రిగా నియమించారు.
1986 సం.రంలో విజయవాడ సిటిబస్ల వ్యవహారంలో మీరు కోపం ప్రదర్శించి మంత్రి పదవికి రాజీనామా చేసి, కిర్లంపూడికి గోదావరి ఎక్స్ప్రెస్లో వచ్చేశారు.
అదే సమయంలో నేను, మీ యర్రమంజిల్ మినిస్ట్రి క్వాటర్స్కి నేను వచ్చాను.
అప్పటికి లక్ష్మిపతి, చక్రపాణి, శివ, ఎల్లపు లక్ష్మణరావు వగైరాలు ఉన్నారు.
ఏమిటి ఈ హడావిడి అని అడిగినాను మళ్ళీ రాజీనామా చేసేశారు, గోదావరి ఎక్స్ప్రెస్ ప్రయాణమవుతున్నారు అని చెప్పినారు.
మీరు కారు ఎక్కినప్పుడు మేము అక్కడ ఉన్నాము.
మళ్ళీ సంప్రదింపు జరిగినాయి.
కొంతమంది పెద్దలు అనగా దేవరపల్లి సూర్యారావు, బొడ్డు భాస్కర రామారావు వగైరా పెద్దలు వచ్చి మిమ్మల్ని శాంతింపజేసి మళ్ళీ ఎన్.టి.ఆర్ వద్దకు తీసుకుని వెళ్ళినారు.
అప్పుడు మిమ్మల్ని ఎక్సైజ్ శాఖకు మార్చారు.
1987 సం.రంలో కో-ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎలక్షన్లో మీరు, బొడ్డు భాస్కర రామారావుని ఛైర్మన్గా చేసే ప్రయత్నం చేశారు. మేము మెట్ల సత్య నారాయణరావుని ఛైర్మన్గా చేయాలని ప్రయత్నించి నాము. ఆ ప్రయత్నంలో భాగంగా బొడ్డు భాస్కర రామారావుని, కోనసీమ అంతా ఏకమై డైరెక్టర్గా ఓడించాం.
మీకు మండిపోయింది.
నా మీద కూడా మీరు కేకలు వేసినారు. మెట్ల సత్యనారాయణ రావుకి పదవి రాకుండా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ద్వారా, ఎన్.టి.ఆర్ పై ఒత్తిడి తెచ్చి ఆకాశం శ్రీరామ చంద్రమూర్తిని, సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్గా నియమించేలా చేశారు.
మీరు ఎక్కడ రాజీనామా చేస్తారోనని ఆ నిర్ణయం తీసుకున్నారు.
1988 సం.రం ప్రారంభంలో.. ఉత్తర కంచిలో జరిగిన చిన్న వివాదాన్ని అధికారంలో ఉన్న మీరు, లౌక్యంగా పరిష్కరించవలసిన మీరు .. పత్తిపాడు పోలీస్స్టేషన్ ఎదురుగా నిరాహార దీక్షా శిబిరం ఏర్పాటు చేసి, మీ ప్రభుత్వంపై మీరే నిరసన తెలియజేశారు.
ఆ ఉద్యమంలో కూడా మేము మీ నిర్ణయం ఏదైనా, మీకు మద్దతుగా మీ వెనుక వచ్చాము.
షరా మామూలే.. మరలా రాజీనామా చేశారు.
1988 సం.రంలో కాపునాడు ఉద్యమం, కాకినాడ ఆనంద భారతిలో ఆకుల శివయ్య నాయుడు, మిరియాల వెంకట్రావు, పోతుల సీతారామయ్య గార్ల ఆధ్వర్యంలో మీరు ముఖ్య అతిధులుగా పాల్గొని విజయవాడలో కాపునాడుకి పిలుపు ఇచ్చారు.
మీకు మద్దతుగా మా నల్లా సత్యనారాయణ గారు, మున్సిపల్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేసి కోనసీమలో భారీగా జనాలను సమీకరించి, వందలాది వాహనాల్లో మీ నాయకత్వంలో విజయవాడకు వచ్చాం.
తదుపరి మీరు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కె.జానారెడ్డి గారు, కె.ఈ. కృష్ణమూర్తి గారు కలిపి తెలుగునాడు పార్టీ ఏర్పాటు చేసినారు.
దాని నిమిత్తం కూడా మీరు తిరుపతి, గుంటూరు, నెల్లూరు, నల్గొండ, కర్నూల్ లలో ఏర్పాటు చేసిన సభలకు, సమావేశాలకు కూడా మేము వచ్చాం.
తదుపరి తెలుగునాడు పార్టీని, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కత్తిపూడిలో భారీ బహిరంగ సభ ద్వారా, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.
తదుపరి రంగా హత్య అనంతరం జరిగిన 1989 సం.రంలో, మీ ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అప్పటి మీ నియోజక వర్గంలో గ్రామాల్లో అన్ని వర్గాల వారు మిమ్మల్ని రోడ్డుపై చీరలు పరిచి పువ్వులు జల్లుతూ మిమ్మల్ని నడిపించేవారు.
ప్రత్తిపాడు నియోజక వర్గంలో మీకు ఇప్పుడు ఆ పరిస్ధితి ఉన్నదా?
మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో మీకు శాఖల కేటాయింపులో లోపం జరిగింది. దాన్ని వెంటనే రోశయ్య గారు, మాగంటి రవీంధ్రనాధ్ చౌదరి గారు, చెన్నారెడ్డి వద్దకు వెళ్ళి అతనికి ఆ శాఖ ఇవ్వకూడదు రాజీనామా చేసేస్తాడు అని చెబితే.. వెంటనే చెన్నారెడ్డి ఎక్సైజ్ మరియు సివిల్ సప్లైస్స్ శాఖలు ఇచ్చి మంత్రిగా కొనసాగించారు.
తదుపరి రాజీవ్గాంధీ హత్యానంతరం పి.వి.నరసింహారావు గారు.. చెన్నారెడ్డిని తప్పించే క్రమంలో, రెడ్డి సామాజిక వర్గానికి కాకుండా వేరే సామాజిక వర్గాలకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని… కుసుమ కృష్ణమూర్తి, జనార్ధన పూజారి ఇద్దరూ మీ వద్దకు రాయబారంగా వస్తే… మీరు తిరస్కరించి వై.ఎస్.రాజశేఖర్రెడ్డికి ఇవ్వాలని మీరు ప్రతిపాదించారు.
ఆ కారణంగానే ఎన్.జనార్ధన రెడ్డి క్యాబినేట్లో, మీకు స్థానం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి కావాల్సిన అటువంటి వ్యక్తికి, మంత్రి పదవి కూడా లేకుండా పోయింది.
సంగీతం వెంకటరెడ్డి, పంతం పద్మనాభంకి క్యాబినేట్లో స్థానం దక్కాయి. తదుపరి నేదురుమల్లి జనార్ధనరెడ్డిని తప్పించి, కె.విజయ భాస్కరరెడ్డిని ముఖ్యమంత్రి చేసిన క్యాబినేట్లో కూడా మీకు మంత్రి పదవి దక్కలేదు.
కొప్పన మోహనరావుకి మంత్రి పదవి దక్కింది. అప్పుడు మీకు కోపం పెరిగిపోయింది.
ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని నిర్ణయించుకున్నారు.
పిలిచి ముఖ్యమంత్రి పదవి ఇస్తానంటే వేరే వారి పేరు చెబుతారు. మీకు మంత్రి పదవి ఇవ్వకుంటే కోపంతో రగిలిపోతారు. లాబీయింగ్ ఎవరైనా చేస్తామంటే వద్దంటారు.
ఆ కోపంలో నుండి వచ్చిందే ఈ కాపు బిసి రిజర్వేషన్ల ఉద్యమం! దాని నిమిత్తం మీరు అమలాపురం వచ్చారు.
నల్లా చంద్రరావు గారి ఇంటికి వెళ్దామని మనం బయలుదేరు తుండగా, ఉదయం విలేఖరి నిమ్మకాయల శ్రీరంగనాధ్ మీతో మాట్లాడుతూ…
పద్మనాభం గారు! మీరు ఇప్పుడున్న పరిస్ధితుల్లో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు, అది ప్రభుత్వ ఆధీనంలో లేని సమస్య, దాన్ని కోర్టు కూడా అనుమతించదు…ఇటీవల మండల కమీషన్ ఏర్పాటై అట్టడుగున వున్న వారినే తప్ప అగ్రవర్ణాల వారిని అనుమతించదు. ఒక కులానికి ప్రయోజనం కోసం, ఏ రాజకీయ నాయకుడు ప్రయత్నించ కూడదు. అందరికి ఉపయోగపడే ప్రయోజం కోసం ఉద్యం చేయండి. దానికి అన్ని వర్గాల నుండి మద్దతు లభిస్తోంది.
దానికి కావాలంటే మీరు ఆగిపోయిన పోలవరం ప్రాజెక్టుని నిర్మించాలని, అని ఉద్యమం చేయండి, అన్ని వర్గాలకు మీరు నాయకుడు అవుతారు అని మీకు చెప్పడం జరిగింది.
మీరు దానిని పెడచెవిన పెట్టి ,ఈ కుల పోరాట సమస్యను నెత్తిన పెట్టుకుని కులాన్ని, మమ్మల్ని రోడ్డున పడేశారు.
కె.విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం మీరు, కాపు ఉద్యమ నాయకుడైన సలాది స్వామినాయుడు, నల్లా సూర్యచంద్రరావు, ఆకుల రామకృష్ణలు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష విరమింప జేయుటకు కంటితుడుపు హామీలిచ్చి దీక్ష విరమింప జేశారు.
దానికి మీరు విజయోత్సవ సభ అని విజయ భాస్కరరెడ్డి గారిని సన్మానించారు.
1994 సం.రంలో జరిగిన ఎన్నికలలో.. ప్రత్తిపాడులో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తే, మిమ్మల్ని ఇతర వర్గాల ప్రజలు తిరస్కరించారు. విలేఖరి రంగనాధ్ చెప్పిన విషయం వెంటనే నిరూపితమైనది.
వెంటనే మీరు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బి.జే.పి పార్టీలో చేరడం జరిగినది.
మీరు జీవితంలో వైట్ అండ్ వైట్ తప్ప, కాకి కలర్ ప్యాంటు, వైట్ షర్టుతో చూసే అదృష్టం కూడా మాకు కల్పించారు.
మీ కూడా మేము అనకాపల్లి వచ్చాము.
బిజేపి పార్టీ మిమ్మల్ని ఎం.పిగా పోటీ చేయమంటే వద్దు అని చెప్పి, కృష్ణంరాజు గారిను నిలబెట్టి మీరు అన్ని నియోజక వర్గాలూ తిరిగి అతడ్ని గెలిపిస్తే.. అతని వద్దకు మీరు వెళ్ళేటప్పటికి, ఆయన కుర్చిలో కూర్చుని మిమ్మల్ని ప్రక్క కుర్చిలో కుర్చోండి అన్నందుకు.. లేచి నిలబడనందుకు మీకు కోపం వచ్చి, యధావిధిగా ఎప్పటిలాగే మీరు బిజేపి పార్టీ రాజీనామా చేశారు.
1999 సం.రం వచ్చింది.
బొడ్డు భాస్కర రామారావు, జిఎంసి బాలయోగి గారు మీ వద్దకు వచ్చి, టి.డి.పిలో చేరి కాకినాడ ఎం.పి స్థానం నుండి పోటీ చేయమనడం, మీరు టిడిపిలో చేరడం, ఎం.పిగా గెలవడం జరిగింది.
2004 సం.రం యధావిధిగా టిడిపికి రాజీనామా చేసి.. ప్రతిపాడులో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఆటో గుర్తుపై పోటీ చేయడం జరిగి, మీకు 6000 ఓట్లు వచ్చినవి.
2009 సం.రంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి, ఈ జిల్లాకు మిమ్మల్ని నాయకత్వం వహించమని రాయబారం పంపడం జరిగినది.
మీరు తిరస్కరించి వై.ఎస్.రాజశేఖర్రెడ్డి వద్దకు వెళ్ళి , పిఠాపురం కాంగ్రెస్ టికెట్ పుచ్చుకుని పోటీ చేయడం, ప్రజారాజ్యం అభ్యర్ధి శ్రీమతి వంగా గీత గారి చేతిలో మూడవ అభ్యర్ధిగా ఓడిపోవడం జరిగింది.
2014 సం.రం ఎన్నికలకు మీరు హాలీ డే ప్రకటించారు.
2016 సం.రంలో చంద్రబాబు కాపు కులానికి రిజర్వేషన్ కల్పిస్తానని హామి ఇచ్చాడు రిజర్వేషన్ల ప్రక్రియ ఇంకా చేయరేమిటని ఈ లేఖలు వ్రాయడం మొదలు పెట్టినారు.
మీ ఒత్తిడి వల్ల ఆయన చేస్తారని భావించి, మిమ్మల్ని నమ్మి మీమందరం మీ వెనుక నడిచాము. తుని సభను విజయవంతం చేయడానికి, అన్ని ప్రాంతాల నుండి మీకు మద్దతుగా వచ్చినారు. ఆ సభకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఎందరో హేమాహేమీలైన కాపు రాజకీయ నాయకులు హాజరైనారు. ఒక్క నాయకుడుని కూడా ప్రసంగించకుండా , సభకు వచ్చిన అశేష జనవాహిణి రోడ్డు రోకోకు, రైలు రోకోకు తరలించడం ఎంతవరకు సమంజసం?
ఆ సంఘటన ద్వారా అన్ని జిల్లాలోని పోలీసులు సభకు వెళ్ళిన వారి వివరాలు తీసుకుని, ఆయా పోలీస్స్టేషన్లలో ఎందరో యువకుల్ని, మా లాంటి నాయకుల్ని ఎంతో ఇబ్బందులకు గురి చేశారు.
అయినా సహించి మీరు కంచాలు బాదమంటే.. ఇంటిళ్ళపాది పిల్లజల్ల, ముసలి ముతక అందరం కంచాలు బాదారు. ఈ ఉద్యమంలో మీరు నిస్వార్ధంగా మా కోసం మీ కుటుంబాన్ని పణంగా పెట్టి పోరాడుతున్నారని, మేము గుడ్డిగా నమ్మాము.
ఈ ఉద్యమంలో రహస్య అజెండా ఉన్నదని , మేము ఎవరం మిమ్మలను అనుమానించ లేదు.
2019 సం.రం ఎన్నికలలో జనసేన విడిగా పోటీ చేస్తే , దాన్ని సమర్ధిస్తూ ఈ ఉద్యమ కాలమంతా మీతో ఉన్నటివంటి .. వాసిరెడ్డి ఏసుదాసు, జనసేనాని పవన్ కళ్యాణ్కు అనుకూలంగా మాట్లాడారని అతడ్ని దూరం పెట్టారు.
మీరు సరైన నిర్ణయం తీసుకోవడం లేదని, ఆకుల రామకృష్ణ స్వతహాగా అతను స్వంత నిర్ణయం తీసుకున్నాడు.
మీరు ఎట్టి పరిస్ధితులలోను జనసేనను సమర్ధించలేదు.
ఎన్నికల సమయంలోనే ఒక నెల ముందు మీరు, అమలాపురంలో చిక్కం కిట్టు ఇంటికి భోజనానికి వచ్చి.. మీరందరు ఉండగా నేను వచ్చాను. ఏమండి రమణగారు ఏమిటి రాజకీయ విశేషాలు అని అడిగారు.
దానికి నేను సార్ నాకు ఫ్యాన్ అక్కర్లేదు ఏ.సి ఉన్నది,సైకిల్ వద్దు స్కూటర్ ఉన్నది, నాకు ఉదయం నుండి రాత్రి వరకు గ్లాసు అవసరం ఎక్కువ అని చెప్పాను.
ప్రస్తుతం జనసేన వారాహి యాత్ర ద్వారా.. మీలో అంతర్లీనంగా ఉన్నటు వంటి ఎన్నో విషయాలు, ప్రపంచానికి మీరే స్వయంగా చాటి చెప్పి, అన్ని వర్గాల ప్రజల్లోని మీ నీతి, నిజాయితీల్లోను అనుమానించి.. మీలో ఇటువంటి చౌకబారు సహాయాల్లో కూడా, అందరి వద్ద చేతులు చాచుతారని మేము ఎప్పుడు ఊహించలేదు.
మీ ఇంటి వద్ద ఒక 10 సార్లు అయిన మీరు పెట్టిన టిఫిన్లు, భోజనములు చేసియున్నాను. ఆ విశ్వాసంతోనే మీ గురించి మీకు తెలియ జెప్పాలని చాలా భాదతో ఈ లేఖ వ్రాయిస్తున్నాను.
నా వద్దకు ఎందరో యువకులు వచ్చి , మిమ్మల్ని నానా మాటలు అంటుంటే, నేను భరించలేక నేను సూచన చేస్తున్నాను.
ఇప్పటికైనా…
మీ వయస్సు రీత్యా.. శ్రీమతి పద్మావతి గారి ఆరోగ్య రీత్యా.. మీరు ఏ విధమైన టెన్షన్లు లేకుండా? ఏ వివాదాలకు తావు లేకుండా? వ్యవహరించి మీ అబ్బాయికైనా?
మంచి భవిష్యత్ను ఏర్పాటు చేయండి.
పద్మనాభం గారు మన తరం వేరు,ఇప్పటి యువతరం వేరు,
మీరు ఎంతో ఉన్నత కుటుంబం అని పొగిడిన.. రెడ్డి గారి తాతను తండ్రిని బేడీలు వేసి పోలీసులు తీసుకుని వెళ్ళడం ఉన్న ఫోటోను, 24 గంటల గడవక ముందే ప్రపంచానికి చూపించారు. అది ఇప్పటి యువత ఘనత.
అటువంటి యువత అంతా నిస్వార్ధపరుడు అయినటువంటి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి వెంట మద్దతుగా నిలబడుతుంది.
లోగడ చంద్రశేఖర్రెడ్డి పబ్లిక్ ప్రెస్మీట్లో.. పవన్కళ్యాణ్ ఈ జిల్లా నుంచి పోటీ చేస్తే ఎన్ని కోట్లు అయినా ఖర్చు పెట్టి ఓడించి తీరుతాను అని చెప్పియున్నాడు.
మీరు అతని ఆధ్వర్యంలో ఎక్కడైనా పోటీ చేస్తే, ఇప్పుడు ఉన్నటివంటి పరిస్ధితులకన్నా… ఇంకా చులకన అయిపోతారు .
ఇప్పుడు ఉన్నటువంటి యువతకు ఆవేశం వస్తే , మనవంటి పెద్దలను కూడా లెక్క చేయరు.
ఈ విషయాన్ని గమనించి , మన గౌరవ మర్యాదలు మనం కాపాడుకోవడం మంచిదని భావిస్తున్నాను.
ఇక సెలవు
మీ
సలాది వెంకటరమణ
అమలాపురం.