ముంబై దాడుల ప్రధాన హ్యాండ్లర్‌కు 15 ఏళ్ల జైలు

పాకిస్థాన్‌లో ఉగ్రవాద వ్యతిరేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులో 2008 ముంబై ఉగ్రదాడుల ప్రధాన హ్యాండ్లర్‌ (నిర్వాహకుడు)కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా నేతల టెర్రర్ ఫైనాన్సింగ్ కేసులతో సంబంధం ఉన్న సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ.. నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన సాజిద్ మజీద్ మిర్‌ (40)కు ఈ నెల మొదట్లో లాహోర్‌లోని యాంటీ టెర్రరిస్ట్ కోర్టు 15 సంవత్సరాల జైలు శిక్ష విధించినట్టు తెలిపారు.

ఇలాంటి కేసుల్లో నిందితుల నేరాన్ని మీడియాకు వెల్లడించే పంజాబ్ పోలీస్‌కి చెందిన కౌంటర్ టెర్రరిజం విభాగం (CTD) ఈ విషయంలో పెదవి విప్పలేదు. మీర్‌కు కోర్టు శిక్ష విధించిన విషయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. కాగా, జైలులో జరుగుతున్న ఇన్-కెమెరా ప్రొసీడింగ్ నేపథ్యంలో మీడియాను కూడా అనుమతించలేదు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్ట్ అయిన మిర్ ప్రస్తుతం కోట్ లఖ్‌పత్ జైలులో ఉన్నాడు. మిర్‌కు 15 ఏళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు రూ. 4 లక్షల జరిమానా కూడా విధించింది. కాగా, తొలుత మిర్ చనిపోయాడని భావించారు. 26/11 ముంబై దాడుల్లో మొత్తం 166 మంది ప్రాణాలు కోల్పోయారు. మిర్ తలపై 5 మిలియన్ డాలర్ల నజరానా కూడా ఉంది. భారత మోస్ట్ వాంటెడ్ జాబితాలో మిర్ కూడా ఉన్నాడు.

మిర్ 2005లో నకిలీ పాస్‌పోర్టు ఉపయోగించి భారత్‌కు వచ్చాడు. ముంబై దాడుల నేపథ్యంలో ఆయనను ‘ప్రాజెక్టు మేనేజర్’ అని పిలిచేవారు. మరోపక్క, ముంబై ఉగ్రదాడుల ప్రధాన సూత్రధారి, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్‌కు లాహోర్ యాంటీ టెర్రర్ కోర్టు ఇప్పటికే ఉగ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో 68 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Leave a Reply