– దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులే
– ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు
– జాతీయ సగటు కంటే రూ.40 వేలు ఎక్కువ
– రాష్ట్రంలో దాదాపు 92 శాతం కుటుంబాలు అప్పుల్లోనే
– కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైదరాబాద్: ‘‘మూసీ పునరుజ్జీవం’’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇండ్ల కూల్చివేయడాన్ని భారతీయ జనతా పార్టీ పక్షాన తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ పథకం పేరుతో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతికి తెరదీస్తోంది.
రూ.1 లక్షా 50 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలాగా ఉపయోగించుకోవాలనుకుంటోంది. ఉద్యోగులకు జీతాలివ్వడమే గగనమైంది. గత పాలకులు చేసిన దాదాపు రూ.6 లక్షల కోట్ల పైచిలుకు అప్పులకు 10 నెలల్లోనే రూ.60 వేల కోట్లు వడ్డీల రూపంలో చెల్లిస్తూ ప్రజాధనాన్ని వృధా చేస్తోంది.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించడానికే నానా తంటాలు పడుతూ సంక్షేమ పథకాలను అమలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఈ డబ్బుల్లేక రాష్ట్ర ప్రభుత్వం తీవ్రమైన ఆర్దిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది.
ఈ పరిస్థితుల్లో మరో లక్షన్నర కోట్ల రూపాయల మేరకు అప్పు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో పేదల ఇండ్లను కూల్చాలనుకోవడం దుర్మార్గం. ఇప్పటికే మూసి ప్రక్షాళన పేరుతో గత మూడు దశాబ్దాలుగా జైకా, జపాన్ సహా ఇతరత్రా మార్గాల ద్వారా పెద్ద ఎత్తున నిధులు కూడా ఖర్చు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో పాలకులు తమ స్వార్ధ ప్రయోజనాల కోసం నిధులు ఖర్చు చేస్తున్నారే తప్ప మూసీ పరిస్థితి ఏ మాత్రం మారలేదు.
గత పాలకులు లక్ష కోట్ల రూపాయలకుపైగా అప్పు చేసి కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా వాడుకుంటే, ఇప్పుడు కాంగ్రెస్ పాలకులు ‘మూసీ పునరుజ్జీవం’ పేరుతో మరో లక్షన్నర కోట్లు అప్పు చేసి ఏటీఎం మాదిరిగా వాడుకోవాలని చూస్తుండటం బాధాకరం. ఈ అప్పుల భారమంతా వివిధ రకాల పన్నుల రూపంలో ప్రజలపై భారం పడుతుంది.
ఇప్పటికే రాష్ట్ర ప్రజలు తీవ్రమైన ఆర్దిక ఇబ్బందుల్లో ఉన్నారు. నాబార్డ్ సంస్థ ఇచ్చిన ‘‘ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ సర్వే’’ నివేదిక ప్రకారం.. దేశంలోనే అత్యధికంగా అప్పుల్లో ఉన్నది తెలంగాణ వాసులే. రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై సగటున రూ.1,29,599 అప్పు ఉంది. జాతీయ సగటు కంటే రూ.40 వేలు ఎక్కువ. రాష్ట్రంలో దాదాపు 92 శాతం కుటుంబాలు అప్పుల్లోనే ఉన్నాయి. జాతీయ సగటు 52 శాతం కుటుంబాలు మాత్రమే.
వాస్తవానికి భారతీయ జనతా పార్టీ ‘మూసీ ప్రక్షాళన’కు వ్యతిరేకం కానేకాదు. కానీ తెలంగాణ రాష్ట్రం, ప్రజల ఆర్దిక పరిస్థితి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ తరుణంలో మళ్లీ లక్షన్నర కోట్ల రూపాయలకుపైగా అప్పులు చేసి మూసీ పునరుజ్జీవం పేరుతో ప్రజలపై మోయలేని భారం మోయడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తోంది.
పేదల ఇండ్లను కూల్చివేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ మూసీ బాధితుల పక్షాన రేపు (ఈనెల 25న) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాను విజయవంతం చేయాలని కోరుతున్నా. మూసీ బాధితులు, ప్రజలు పెద్ద ఎత్తున మహాధర్నా కార్యక్రమంలో పాల్గొనాలని విజ్ఝప్తి చేస్తున్నాం.