-అయ్యన్నపాత్రుడు మంత్రి అయ్యేసరికి జగన్ పాలుతాగే పిల్లాడు
-ఎన్ని అక్రమ కేసులు పెట్టినా అయ్యన్నని టచ్ కూడా చేయలేరు
-జగన్ అధికారంలోకొచ్చాక టిడిపివాళ్లపై 3 వేల కేసులు పెట్టారు-33 మందిని చంపేశారు
– నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
”తాత ఎన్టీఆర్ దేవుడు. నాన్న చంద్రబాబు రాముడు. నేను అలా కాదు. అందరినీ గుర్తుపెట్టుకున్నాను. టిడిపిపై దాడులు చేస్తున్న ఎవ్వరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదు” అంటూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వైసీపీకి, పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని అక్రమ కేసులతో వేధించి అరెస్టు చేయాలని వేలాది మంది పోలీసుల్ని నర్సీపట్నంలో మొహరించారు. సమాచారం తెలుసుకున్న నారా లోకేష్ గురువారం నర్సీపట్నం చేరుకుని అయ్యన్నపాత్రుడు కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం టీడీపీ నేతలను అక్రమ కేసులు, అరెస్టులతో వేధించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని, వైసీపీ
నేతలు దౌర్జన్యాలు పాల్పడితే రాష్ట్రంలో పోలీసులు పట్టించుకోవడంలేదని, ప్రభుత్వ అరాచకాలను ప్రతిపక్షంగా టిడిపి నేతలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు.
టీడీపీ వాళ్లపై ఇప్పటివరకూ 3 వేలకు పైగా అక్రమ కేసులు పెట్టారని, 33 మంది టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేశారని, 54 మంది టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయించారని పేర్కొన్నారు. చింతమనేని ప్రభాకర్ పై ఇప్పటివరకూ 30 కేసులు పెట్టారని, అయ్యన్నపాత్రుడిపై 9 కేసులు పెట్టారని,
మరో కేసు బనాయించి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని నిలదీస్తూనే వుంటారని, ఏం చేస్తారో చేసుకోవాలంటూ హెచ్చరించారు.
అక్రమ కేసులో అయ్యన్నపాత్రుడిని అరెస్ట్ చేసేందుకు పోలీసుల మొహరింపుతో అది నర్సీపట్నం ఉక్రెయినా అనే అనుమానం వచ్చిందన్నారు. అయ్యన్నపాత్రుడు తొలిసారి మంత్రి అయినప్పుడు జగన్
పాలు తాగే పిల్లాడి వయస్సని, అయ్యన్న ముందు పిల్ల బచ్చా వేషాలు వేయొద్దని సూచించారు. నా తల్లిని తిట్టారు, మా నాయకుల్ని కొట్టారు, మా ఆఫీసులపై దాడి చేశారు..అధికారం పోగానే ఐవరీకోస్ట్, ఏ విదేశాలకో వెళ్లిపోతామనుకుంటున్నారని…ప్రపంచంలో ఏ మూల దాక్కున్నా లాక్కొచ్చి మరీ మీ లెక్కలు సరిచేస్తామని వైసీపీ నేతల్ని హెచ్చరించారు.
అచ్చెన్నను అరెస్ట్ చేసి ఏం సాధించారో వెల్లడించాలన్నారు. కోడెలను వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసింది జగన్ సర్కారు కాదా అని ప్రశ్నించారు. అధికార వైసీపీ చెప్పినట్టల్లా తలూపి టిడిపిపైనా, నాపై కేసులు పెట్టిన పోలీస్ ఉన్నతాధికారి పరిస్థితి ఏమైందో చూసుకుని పోలీసులు వ్యవహరించాలని సూచించారు.