-తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం .. ప్రశ్నించే గొంతుకు ప్రాణం పోసిన గడ్డ మల్కాజ్ గిరి
-నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్ గిరి ప్రజలదే
-మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంతన్న బహిరంగ లేఖ
కొడంగల్ లో నడిరాత్రి ప్రజాస్వామ్యాన్ని నిర్దాక్షిణ్యంగా హత్యచేసిన సందర్భాన్ని చూసి మల్కాజ్ గిరి చలించింది. కేవలం 14రోజుల వ్యవధిలోనే నన్ను తమ గుండెల్లో పెట్టుకుంది. ప్రశ్నించే గొంతుకై తెలంగాణ మొత్తానికి రక్షణగా నిలబెట్టింది. ఈరోజు తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి పునాదులు పడింది మల్కాజ్ గిరిలోనే. నా రాజకీయ ప్రస్థానంలో కొడంగల్ తో సమానంగా మల్కాజ్ గిరికి ప్రాధాన్యత ఉంది.నన్ను దేశానికి పరిచయం చేసిన ఘనత మల్కాజ్ గిరి ప్రజలదే. ఐదేండ్లు మీరు ఆశించిన ప్రశ్నించే గొంతుగా ప్రజల పక్షాన రాజీలేని పోరాటం చేశాను. విస్తృత బాధ్యతల నేపథ్యంలో వ్యక్తిగతంగా కొన్నిసార్లు అనుకున్నంతసమయమ ఇవ్వలేకపోయి ఉండవచ్చు. దేశ రక్షణ కోసం తల్లి బిడ్డను పంపినట్టు… నన్ను మీరు తెలంగాణ రక్షణ కోసం గెలిపించి పంపారు.. ఇన్నాళ్లు ఆ బాధ్యతను త్రికరణ శుద్దిగా నిర్వర్తించానని భావిస్తున్నా. ఐదేళ్లే కాదు.. నా గుండెల్లో మీ స్థానం శాశ్వతం. మల్కాజ్ గిరి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాడు మీరు పోసిన ఊపిరి.. నా చివరి శ్వాస వరకు తెలంగాణ ఉజ్వల భవిత కోసం తపిస్తూనే ఉంటుంది..