– తూర్పులో 17, 18 డివిజన్లల్లో ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరించిన ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జీవితం ఒక చరిత్ర అని విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కొనియాడారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 17, 18 డివిజన్లలో కొప్పుల శ్రీనివాస్ బ్రదర్స్ ఏర్పాటు చేసిన నందమూరి తారక రామారావు విగ్రహాల ఆవిష్కరణను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హజరై ఆవిష్కరించారు.
ఈ సందర్బంగా పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు చెందిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. పేదలకు అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకం చూసినా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలోనే ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీయేనన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా పేద ప్రజల ఆకలిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తీరుస్తున్నారని చెప్పారు.
ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసిన మహానీయుడు ఎన్టీఆర్ అన్నారు. రెండు రూపాయాలకు కిలో బియ్యం, ఆస్తిలో మహిళలకు హక్కు, బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించారని చెప్పారు. రూ.35లతో ఎన్టీఆర్ ప్రారంభించిన ఫించను పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు రూ.4 వేలకు పెంచి అందచేస్తున్నారని చెప్పారు. సినిమా రంగంలో ఎన్టీఆర్ రారాజుగా వెలుగొందారని, ఏ పాత్రలో అయినా ఎన్టీఆర్ అందరి మనన్ననలు పొందారని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమలు చేస్తారని చెప్పారు. డివిజన్లో సబ్వే పనులను త్వరలో ప్రారంభిస్తామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు.
పార్టీ నాయకుడు వేముల దుర్గారావు, రాయి రంగమ్మ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల సంక్షేమం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం వల్లనే సాధ్యమని చెప్పారు. అన్న నందమూరి తారక రామారావు విగ్రహాలను డివిజన్లో ఏర్పాటు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమములో బొప్పన భవకుమార్, చెన్నుపాటి ఉషారాణి, కొప్పుల శ్రీనివాస్ చౌదరి, మొకర ఆదిబాబు, గోగుల రమేష్, పోలిపల్లి ముని, మైలమూరి పీరుబాబు, బలగాని శ్రీను తదితరులు పాల్గొన్నారు.