– వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు
– శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి
మంగళగిరి : తమ సమస్యల పరిష్కారం కోసం అర్జీదారులు నేడు టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తారు. వారి నుండి ప్రభుత్వ శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డిలు అర్జీలు స్వీకరించి అర్జీదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. అధికారులతో ఫోన్లలలో మాట్లాడి.. వచ్చిన అర్జీల సమస్యలను వారికి తెలియజేసి వెను వెంటనే పరిష్కరించేలా ఆదేశిచారు.
• 2018 లో నాడు చంద్రబాబు నాయుడు మహిళల మీద ఉన్న గౌరవ అభిమానాలతో పశువైద్యశాలల్లో పనిచేయుటకు 6400 మంది డ్వాక్రా మహిళలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి కల్పించారని. పశు సఖి వర్కర్స్ గా రైతులకు డాక్టర్స్ కు వారధిగా పనిచేస్తున్న తమను గత ప్రభుత్వం తొలగించి తమకు అన్యాయం చేసిందని దయ చేసి తమను తిరిగి విధుల్లోకి తీసుకొని న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.
• పల్నాడు జిల్లా అచ్చెంపేటకు చెందిన సందేపోగు రాజు నేడు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. తమకు వారసత్వంగా వచ్చిన భూమిని ఆన్ లైన్ చేయమంటే అధికారులు పట్టించుకోవడంలేదని.. దయ చేసి తమ భూమిని ఆన్ లైన్ చేసేలా చూడాలని వేడుకున్నారు.
• విజయవాడకు చెందిన గోవిందరావు విజ్ఞప్తి చేస్తూ.. విజయనగరం జిల్లా డెంకాడ మండలం బంటుపల్లి గ్రామంలో తన తండ్రి పొలం కొనుగోలు చేశారని.. తాము విజయవాడలో ఉండి అక్కడి పొలాన్ని కౌలుకు ఇవ్వగా.. అధికారులు కబ్జాదారులు కుమ్మక్కై రికార్డుల్లో పేర్లు మార్చారని దీనిపై విచారించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
• కర్నూలు జిల్లా నందవరం మండలం కనకవీడు గ్రామానికి చెందిన ఈదిగ వీరన్న విజ్ఞప్తి చేస్తూ.. 1971 లో తమ నాన్నగారు కొనుగోలు చేసిన భూమిని సీ. నాగేశ్వరరావు అనే వ్యక్తి అక్రమంగా ఆన్ లైన్ చేయించుకున్నాడని.. దీనిపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని అయినా ఎటువంటి పరిష్కారం దొరకలేదని.. దయ చేసి ఈ అక్రమ ఆన్ లైన్ ను రద్దు చేసి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు.
• గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన గోనుగుంట్ల పూర్ణచంద్రరావు విజ్ఞప్తి చేస్తూ.. తాను ఉపాధ్యాయుడిగా పనిచేసి రిటైర్డ్ అయ్యానని.. రిటైర్డ్ అయిన తరువాత తనకు రావాల్సిన బకాయి డబ్బులు ఇవ్వమంటే అధికారులు ఏదోక సాకుతో తిప్పుకుంటున్నారని.. దయ చేసి తన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
• ఏలూరు జిల్లాకు చెందిన పలువురు పోలవరం నిర్వాసితులు అర్జీలు ఇస్తూ.. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నాడు 18 సంవత్సరాలు దాటి పెళ్లి కాని అమ్మాయిలకు కూడా పరిహారం ఇస్తామని చెప్పారని.. నేడు పరిహారం ఇవ్వకుండా అధికారులు తమను ఇబ్బంది పెడుతున్నారని. పరిహారం ఇవ్వడానికి ఉన్న సమస్యను పరిష్కరించి తమకు కూడా నిర్వాసిత పరిహారం అందజేయాలని తల్లవరం గ్రామానికి చెందిన కుంజం విజయలక్ష్మీ, ఇరపం లక్ష్మీ, కొండ్రుకోటకు చెందిన యండపల్లి పరిమళ తదితరులు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు.