రోడ్డుపైనా రాజకీయాలు?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 జనవరి, 2023న తీసుకొచ్చిన జివో నెంబర్ ఆర్.టి.01 (జివో నెంబర్ ఒకటి) మీద పత్రికల్లో, టివిల్లో పెద్ద పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ రాజకీయనాయకులు దుమ్మురేపేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మహన్ రెడ్డి  ప్రతిపక్షాలను రోడ్డు మీద తిరగకుండా, వారు ప్రజల్లోకి రాకుండా చేయడానికే ఈ జీవో తెచ్చారని అవాస్తవాలు మీడియా ద్వారా ప్రచారం జరుగుతుంది. ఇంతకి మీడియాగాని, పత్రికా మిత్రులుగాని, దీనిపై దుమారం రేపుతున్న, వ్యతిరేకిస్తున్న రాజకీయనాయకులుగాని ఈ జివో చదివి ఉంటే మాత్రం దీన్ని వ్యతిరేకించే బదులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతారని నా అభిప్రాయం.

మన రోడ్లపై రాజకీయ పార్టీలు, ఇతరులు కల్పించే అవరోధాలను తొలగించింది ఇది. మన నగరాల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో రోడ్లను ప్రజల రాకపోకలకి మాత్రమే వినియోగించాలని నొక్కివక్కాణించి మేలు చేసింది. రోడ్లపై అనవసర సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి ప్రజాజీవనాన్ని ఇబ్బందులు పాలు చేయకూడదనే సదుద్ధేశ్యంతో అత్యంత విఫులంగా ఇచ్చిన ఈ ప్రభుత్వ ఉత్తర్వు అన్నింటా ’నెంబర్ వన్’ ఇది. తెల్లారితే రోడ్డు ఎక్కితే గమ్యం చేరేవరకూ రోడ్లపైనే కొందరు వ్యక్తులు, పార్టీలు ఏర్పాటు చేసే సమావేశాలు, సభలు, ఫంక్షన్లు లాంటి అవరోధాలతో ప్రజలు ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు పడుతూనే ఉన్నాము.

కనీసం అంబులెన్స్ కూడా వెళ్లడానికి వీలులేకుండా రోడ్లను మూసివేసి సమావేశాలు ఏర్పాటు చేయడం చూశాం. ఇప్పడు పాత పోలీస్ చట్టం 1861 ఊటంకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రోడ్లపై సమావేశాలను నిషేధిస్తూ సమగ్రమైన ఉత్తర్వులు జారీచేసి సామాన్య రోడ్డు వాడకందారులకు ఎంతో మేలు చేసింది. ఈ జీవో నెంబర్ వన్ లో పోలీస్ చట్టం 1861 సెక్షన్ 3, 30 30 ఎ, 31 రోడ్లపై సమావేశాలు, ర్యాలీలకు అనుమతులు తీసుకోవాలని సూచించిది.అలాగే ఎపి పంచాయతిరాజ్ చట్టం 1994, ఎఫి మున్సిపాలిటీల చట్టం, 1965,ఎపి మున్సిపల్ కార్పోరేషన్ల చట్టం, 1994లో వివరించిన రోడ్లన్నింటికి ఇది వర్తింస్తుందని చక్కగా జీవోలో వివరించారు.

ఇరుకు రోడ్లు, ప్రజల రాకపోకలకు అడ్డంకంగా ఉన్న రోడ్లపై ఎటువంటి ర్యాలీలు, సమావేశాలకు జిల్లా అధికారులు అనుమతులు ఇవ్వరాదని కూడా సూచించి సామాన్య ప్రజల నెత్తిన పాలుపోసింది. అంటే ఇక ఇరుకు రోడ్లపై సమావేశాలుండవు, సభలుండవు రోడ్లు కేవలం రాకపోకలకే వాడాలనే ప్రభుత్వ ఉద్యేశ్యం స్వాగతించాల్సిందే. అత్యంత గొప్ప విషమం ఎమంటే రాజ్యాంగంలోని అధికరణ 19(1)భి ద్వారా ప్రజలకు ధఖలుపడిన ’శాంతి పూర్వక సమావేశాలు నిర్వహించుకునే హక్కు‘ను గౌరవించడంతో పాటు శాంతియుత ప్రజాప్రయోజనాలకోసం సమావేశాలు నిర్వహించుకోవడానికి ప్రజలు రాకపోకలకు అడ్డంకి లేకుండా ఉండే ప్రదేశాలను గుర్తించాలని అధికారులకు ఉత్తర్వులో సూచించడం చెప్పుకోదగ్గ విషయం.

ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి తప్పించి, ప్రజలకు మేలు చేసే ఈ ఉత్తర్వును రాజకీయ పార్టీలతో పాటు మీడియా కూడా తప్పుపట్టడం ఎంతవరకూ సబబు……. ప్రజల పక్షాన ఉండాల్సిన మీడియా రాజకీయాలకు(రాజకీయ నాయకులకు) లొంగి ప్రజాహితమై ఆంధ్రప్రదేశ్ ఈ ప్రభుత్వ ఉత్తర్వులను వ్యతిరేకించడం మంచిది కాదు..అందరు ఈ జీవో ను చదివి ఇందులో ప్రజాప్రయోజనం ఉందో లేదో తెలుసుకోవాలి, కేవలం మీడియా, రాజకీయనాయకులు మాటలే వాస్తవాలని భ్రమించవద్దని విన్నపం..

– షఫి, ఫోన్ 9912277786

Leave a Reply