ప్రతిభావంతులను వ్యవస్ధకు అందించేలా పబ్లిక్ సర్వీస్ కమీషన్లు

-ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ 
-విశాఖపట్నం వేదికగా రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్యక్షుల స్టాడింగ్ కమిటీ సదస్సు
-విజయవాడ రాజ్ భవన్ నుండి వర్చువల్ మోడ్ లో పాల్గొన్న గవర్నర్ హరిచందన్

విజయవాడ, జూలై 8: రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రాజ్యాంగబద్ధమైన హోదా, స్వతంత్ర అధికారాల ఆలంబనగా ప్రతిభావంతులను వ్యవస్ధకు అందించేలా పనిచేయాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. ఉన్నత ప్రమాణాలు పాటిస్తూ మరే ఇతర అధికారాల ప్రభావం లేకుండా స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వర్తించాలన్నారు. విశాఖపట్నం వేదికగా శుక్రవారం జరిగిన రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ అధ్యక్షుల స్టాండింగ్‌ కమిటీ సదస్సుకు విజయవాడ రాజ్‌భవన్‌ నుంచి వర్చువల్‌ మోడ్‌లో ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌరవ హరిచందన్ మాట్లాడుతూ ప్రభుత్వ పరమైన ఉద్యోగ నియామకాల్లో పబ్లిక్ సర్వీస్ కమీషన్లు కీలక భూమిక పోషిస్తాయని, ప్రతిభకు పెద్దపీట వేసేలా నియామక ప్రక్రియలు కొనసాగాలని సూచించారు.

కాలానుగుణ నోటిఫికేషన్లు, సకాలంలో నియామకాలు పూర్తిచేయటం పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రధాన బాధ్యతలలో ఒకటన్న గవర్నర్, పత్రికా ప్రకటన మొదలు అభ్యర్ధికి ఉద్యోగ నియామక పత్రం అందించే వరకు ప్రతి అంశంలోనూ పారదర్శకత, సమగ్రత, విశ్వసనీయత తప్పనిసరన్నారు. గోవా పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ జోస్‌ మాన్యుయెల్‌ నొరోన్హా మాట్లాడుతూ రాష్ట్ర పీఎస్‌సీల 24వ జాతీయ సదస్సును 2023లో నిర్వహించనున్నామన్నారు. విజయవాడ రాజ్‌భవన్‌ నుండి గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా, విశాఖపట్నం నుండి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి వసుధా మిశ్రా, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌ గౌతమ్ సవాంగ్, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, కేరళ, తెలంగాణ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ అధ్యక్షులు ఇతర అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply