– నిందితులపై చర్యలు తీసుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది
– ప్రధాని, హోంమంత్రి రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి
– ఈ సంఘటన మానవ హక్కుల ఉల్లంఘన
– చండీగఢ్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
చండీగఢ్: తెలంగాణకు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి వై.పూరన్ కుమార్ మరణం నన్ను తీవ్రంగా బాధించింది. ఇది నిజంగా చాలా దురదృష్టకరమైన ఘటన అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. సోమవారం ఆయన ఇటీవల కుల వివక్ష భావన, ఉన్నతాధికారుల మానసిక వేధింపుల నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడిన అడిషనల్ డీజీ పురణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా కుమార్ భార్య అమ్నీత్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్లో పరామర్శించి సంఘీభావం తెలిపారు. కుమార్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు భరోసా ఇచ్చారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్థానిక మీడియాతో మాట్లాడారు.
హరియాణాలో అదనపు డీజీ గా పని చేసిన ఆయన, అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రా’ విభాగంలో కూడా సేవలందించారు అని తెలిపారు. ఉత్తమ సేవలకు గాను రాష్ట్రపతి మెడళ్ళను కూడా అందుకున్న ప్రతిభావంతులు ఆయన. అలాంటి గొప్ప అధికారి ఈ నెల 7 న ఆత్మహత్య చేసుకోవడం తీవ్రంగా కలచి వేసే అంశం అని డిప్యూటీ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు ఆయన రాసిన ,మరణ వాగ్మూలం (సూసైడ్ నోట్) లో డీజీపీ కపూర్, ఎస్పీ నరేంద్ర అనే ఇద్దరు అధికారులు తనను అడుగడుగునా అవమానించి, వేధించడం వల్లే చనిపోతున్నానని స్పష్టంగా పేర్కొన్నారు అని తెలిపారు. చట్టం ప్రకారం ఇలాంటి సాక్ష్యం ఉన్నప్పుడు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి కదా అన్నారు. అయితే, రోజులు ఏడు రోజులు గడుస్తున్నా హర్యానా ప్రభుత్వం, చండీగఢ్ పోలీసులు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది అని డిప్యూటీ సీఎం తెలిపారు.
ఆయన శవపరీక్ష కూడా జరగలేదు. ఆయన మృతదేహానికి ఇప్పటికీ పోస్ట్మార్టం కూడా చేయకపోవడం, వృద్ధురాలైన ఆయన తల్లికి, భార్యకు, కూతుళ్లకు కనీశం శవాన్ని చూడటానికి కూడా అనుమతించకపోవడం అత్యంత అమానుషం, దారుణం అన్నారు. ఇది మౌలిక మానవ హక్కుల ఉల్లంఘన.
నిందితులలో ఒకరైన మిస్టర్ కపూర్పై అప్పటికే కులవివక్ష ఆరోపణలు ఉన్నా, ఆయనను ప్రభుత్వం డీజీపీగా కొనసాగించడం సిగ్గుచేటు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వందేళ్లు దాటిన మనిషి కూడా మరింతకాలం బతకాలి అనే కోరుకుంటాడు. చావుబ్రతుకుల్లో హాస్పిటల్ బెడ్డు మీద ఉన్నవారు కూడా ‘మాకు బతకాలని ఉంది… మమ్మల్ని కాపాడండి’ అని వైద్యులను వేడుకొంటారు.
అలాంటిది ఒక ఐపీఎస్ స్థాయి అధికారి ఇక నేను బతకలేను అని చెప్పి ప్రాణం తీసుకున్నారంటే ఆయన ఎంత వేదన అనుభవించి ఉంటారో, ఎంత కష్టం ఆయనకు కలిగి ఉంటుందో ఊహించండి అని డిప్యూటీ సీఎం వివరించారు. ఆయన ఎంతటి అవమానం అనుభవించారో అర్థం ఒక ఐపీఎస్ అధికారికే రక్షణ లేకపోతే ఇక సాధారణ ప్రజల గతి ఏమిటో ఆలోచించండి అన్నారు. మానవ హక్కుల సంఘాలు, పౌర సంఘాలు గడచిన వారం రోజులుగా న్యాయం కావాలని పోరాడుతున్నాయి.
హర్యానా, చండీగఢ్ రెండూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పరిధిలో ఉన్నాయి. కాబట్టి ప్రధాని, హోం మంత్రి తమ రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాలి అని డిమాండ్ చేశారు.
మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయం తెలిసిన వెంటనే పూరం కుమార్ కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారికి సంఘీభావం తెలిపారు. నన్ను తక్షణమే బాధితులను కలవమని ఇక్కడికి పంపించారు. పూరన్ కుమార్ హైదరాబాద్లో ని ఉస్మానియాలో ఇంజనీరింగ్, ఆ తరవాత ఐఐఎమ్లో ఉన్నత విద్యను అభ్యసించి, హర్యానాలో ఐపీఎస్ అధికారిగా సేవలు అందించారు. ఆయన చాలా ప్రతిభాశాలి. ఆయన మరణం ఆయన కుటుంబానికి వ్యక్తిగతంగా పుదుకోలేని నష్టమే కాదు…. వ్యవస్థకు కూడా నష్టమే అన్నారు.
ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు. ఇది మానవ హక్కుల సమస్య ,ప్రతి ఒక్కరికి ఈ దేశంలో జీవించే హక్కు ఉంది. దానిని ఎవ్వరూ కాదనలేరు అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అన్యాయాలను సహించదు. చూస్తూ ఊరుకోదు. పూరన్ కుమార్ సూసైడ్ నోట్లో పేర్కొన్న డీజీపీ కపూర్, ఎస్పీ నరేంద్రలను వెంటనే అరెస్ట్ చేసి, వారిని చట్టపరంగా విచారించాలి.
డిప్యూటీ సీఎం వెంట ఏఐసిసి ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు, చండీగఢ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ లక్కీ, సంవిధాన్ కమిటీ చైర్మన్ డాక్టర్ వినయ్ తదితరులు ఉన్నారు.