– సిట్టింగ్ నడపకూడదు
– బెల్ట్ షాపులకు మద్యం అమ్మకూడదు.. సిండికేట్ ఉండొద్దు
– సాయంత్రం 4:00గంటల నుండి రాత్రి 9:00 గంటల వరకే విక్రయించాలి
– నియోజకవర్గ ప్రజలు, యువత మద్యం మత్తును వదిలి ఆర్థికంగా ఎదగాలని నా కోరిక
– నియోజకవర్గంలో వైన్ షాపులకు టెండర్లు వేసే వారికి ముఖ్య గమనిక
– మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
– నల్గొండ ఎక్సైజ్ సూపరిండెంట్ కు వినతి పత్రాన్ని అందజేసిన మునుగోడు నియోజకవర్గ ముఖ్య నాయకులు
మునుగోడు: రాష్ట్ర వ్యాప్తంగా నూతన వైన్ షాపులకు టెండర్ల ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులకు టెండర్లు వేసే వారికి మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కొన్ని సూచనలు చేశారు.
నియోజకవర్గంలో ఇప్పటికే విచ్చలవిడిగా మద్యం అందుబాటులో ఉన్న నేపథ్యంలో బెల్ట్ షాపుల నిర్మూలన ఉద్యమం చేపట్టి, గ్రామాలలో బెల్ట్ షాపులు లేకుండా చేసిన మునుగోడు ఎమ్మెల్యే.. మరో అడుగు ముందుకేసి నూతన వైన్ షాపులను దక్కించుకుంటున్నవారికి కొన్ని విన్నపాలు చేశారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా వైన్ షాపులను దక్కించుకునే వారు ఊరి బయట మాత్రమే వైన్ షాపులను పెట్టుకోవాలని, సిట్టింగు లేకుండా చూసుకోవాలని, బెల్ట్ షాపులకు మద్యం విక్రయించొద్దని, వైన్ షాపుల యజమానులు సిండికేట్ గా మారుద్దని , మద్యాన్ని సాయంత్రం 4:00గంటల నుండి రాత్రి 9:00 గంటలకు మాత్రమే విక్రయించుకోవాలని సూచిస్తున్నారు.
ఈ నిర్ణయం ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదని, నియోజకవర్గ ప్రజలు యువత మద్యం మత్తు వదిలి ఆర్థికంగా ఎదగాలనేది నా కోరిక అంటూనే.. ఈ ప్రయత్నం వల్ల ప్రజల ఆరోగ్యం బాగుపడితే వారి జీవన ప్రమాణాలు మెరుగు పడతాయని, ఇంట్లో యజమాని తాగకుండా ఉంటే మహిళలు ఆర్థికంగా సాధికారత సాధిస్తారని అందుకే ఇటువంటి సూచనలు చేస్తున్నామని తెలిపారు.
తాను త్రాగుడికి వ్యతిరేకం కాదని, ఉదయం నుండి సాయంత్రం వరకు అదే పని మీద తాగుతూ తాగుడుకు బానిసలుగా మారుతున్న విధానానికి వ్యతిరేకం అన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసుకోవాలని ,దాని తర్వాత తాగుడు గురించి ఆలోచించాలని మునుగోడు నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు.
గ్రామాలలో పర్యటిస్తున్న సందర్భంలో యువత తాగుడుకు బానిసై విచక్షణారహితంగా ప్రవర్తించడం చూశానని, ఎంతోమంది యువకులు 30 ఏళ్ల లోపు వారే తాగుడుకు బానిసై చనిపోతే మహిళలు చిన్నతనంలోనే భర్తను కోల్పోయి, ఆ కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని తమ పిల్లలను పోషించడానికి వారు పడరాని పాట్లు పడుతున్న ఆవేదనలో నుండి వచ్చిన నిర్ణయమే బెల్ట్ షాపుల నిర్మూలన, మద్యం షాపుల సమయాల మార్పు అన్నారు.
గత పది సంవత్సరాలుగా గ్రామాలలో సామాజిక రుగ్మతగా మారిన అధికమధ్యం సేవనాన్ని తగ్గించి, కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్న ప్రయత్నమే ఇది అని అన్నారు.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిలుపుమేరకు మునుగోడు నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎక్సైజ్ సూపర్ ఇండెంట్ కార్యాలయానికి చేరుకుని, మునుగోడు నియోజకవర్గం లో వైన్ షాప్ టెండర్లు వేసే వారికి గమనిక అంటూ కొన్ని అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ఎక్సైజ్ సూపరిండెంట్ కు అందించారు. వినతి పత్రం అందించిన వారిలో చండూరు నాంపల్లి మండలాల ముఖ్య నాయకులు ఉన్నారు.