– తొలి మహిళా కళాశాల రూపశిల్పి
(రాఘవ శర్మ)
అమ్మాయిలకు నడక నేర్పారు, నడత నేర్పారు, మాట నేర్పారు, జీవిత పాఠాలు నేర్పారు. జ్ఞానతృష్ణ తీర్చి, భవిష్యత్తుకు బాట వేశారు. నేటి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా కళాశాల రూపశిల్పి రాజేశ్వరి మూర్తి. శుక్రవారానికి నూరు వసంతాలు పూర్తి చేసుకున్నారు.
న్యూయార్క్ లో ఇప్పటికీ సంతృప్తి కర జీవితాన్ని గడుపుతున్నారు. తిరుపతిలో గడిపిన జీవితాన్ని నెమరేసుకుంటున్నారు.ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతం కలిసి ఉన్న కాలం అది. అబ్బాయిల కళాశాలలో అమ్మాయిలను చేర్చుకోరాదని మద్రాసు విశ్వవిద్యాలయం సిండికేట్ 1951లో తీర్మానించింది. అప్పటికి స్వాతంత్రం వచ్చి నాలుగేళ్ళు. కందుకూరి చేపట్టిన సంఘ సంస్కరణలో ముఖ్యమైన స్త్రీ విద్యకు గండిపడింది.
తిరుపతిలో అప్పటికే డిగ్రీ కాలేజీ ఉన్నా, అమ్మాయిలు చేరడానికి వీలులేకుండా పోయింది. ఈ గండిని పూడ్చడానికి, 1952లో టీటీడీ ‘ శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల’ను స్థాపించింది. ఆంధ్ర రాష్ట్రంలో అదే తొలి మహిళా కళాశాల. మంచితనం, నిదానం కలగలిసిన రంగనాయకమ్మ ప్రిన్సిపాల్ గా కాలేజీని నెట్టుకొచ్చి, రెండేళ్ళ తరువాత ని ష్క్రమించారు.
ఆ కళాశాలకు ఒక సెల ఏరు ఒచ్చింది. అది గబగబా పారే సెల ఏరేకాదు, గలగలా మాట్లాడే సెల ఏరు కూడా. ఇక్కడికి వచ్చాక కొండ పై నుంచి దుమికే జలపాతమైంది. అలల్లా చేతులూపుకుంటూ నడక సాగించింది. ఆ నడక పరుగైంది. తన పరుగుతో కళాశాలనూ పరుగు పెట్టించింది. ఆ సెల ఏటిపేరు రాజేశ్వరి మూర్తి.
గంభీరమైన భాష ఆమె నోటి వెంట జలజలా జాలువారుతుంటుంది. స్త్రీల కళాశాల వచ్చిన రెండేళ్ళకు తిరుపతిలో ఎస్వీయూనివర్సిటీ వచ్చింది. రసాయన శాస్త్ర విభాగంలో ప్రొఫెసర్ గా చేరిన కే.సూర్యనారాయణ మూర్తి సతీమణే రాజేశ్వరి మూర్తి. అదే సంవత్సరం మహిళా కళాశాలకు ప్రిన్సిపాల్ గా ఆమె పగ్గాలు చేపట్టారు.
అంతే.. ఆ కళాశాల పరుగులంఘించింది. అప్పటికింకా కళాశాలకు సొంత భవనాలులేవు. ప్రాక్టి కల్స్ కోసం అబ్బాయిల కళాశాలకు వెళ్ళాల్సి వచ్చేది. శ్రీవేంకటేశ్వర స్త్రీల కళాశాల కాస్తా ‘శ్రీపద్మావతి మహిళా కళాశాల’ (ఎస్పీడబ్ల్యూ) గా మారింది. మరో రెండేళ్ళకు ; 1956లో డిగ్రీ కళాశాలయ్యింది.
మహిళా కళాశాలకు భవనం ఎలా ఉండాలి? తరగతి గదులు ఎలా ఉండాలి? లెబోరేటరీలు ఎలా ఉండాలి? హాస్టళ్ళు ఎలా ఉండాలి? ప్రహరీ గోడ ఎంతెత్తుండాలి? చివరికి టాయిలెట్లు ఎక్కడుండాలి? అన్నీ రాజేశ్వరి మూర్తి ఆలోచనలకు ఇదిగో ఎస్పీడబ్ల్యు కళాశాల ఇలా రూపుదాల్చింది.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని వంద ఎకరాలను ఆమె సేకరించారు. కాకినాడకు సమీపం లోని పెద్దాపు రానిని చెందిన ఒక సంప్రదాయ కుటుంబంలో 1921 డిసెంబర్ 10వ తేదీన రాజేశ్వరి జన్మించారు. పెళ్ళి అయ్యాక భర్త ప్రోత్సాహంతో చదువు మొదలు పెట్టారు. గణిత శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వారికి పిల్లలు లేరు.
మహిళా కళాశాల ప్రిన్సిపాల్ గా బాధ్యతలు చేపట్టాక విద్యార్థినులందరినీ తన పిల్లలుగా భావించారు. రాత్రి, పగలు అనకుండా కళాశాలే ఆమెకు ఇల్లు అయిపోయింది.అదే ఆమెకు జీవితం అయిపోయింది.
క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్విజ్ పోటీలు; ఒకటేమిటి వారి వికాసానికి ఎన్ని అవసరాలు ఉన్నాయో, వాటి కోసం ఎన్ని అవకాశాలున్నాయో అన్నిటినీ వినియోగించారు.
విదేశాలతో, ముఖ్యంగా అమెరికాతో విద్యాపర సంబంధాలను నెలకొల్పారు.కేరళ, కర్ణాటక, మద్రాసు రాష్ట్రాల నుంచి ఏరికోరి అధ్యాపకులను ఎంపిక చేశారు.
రాష్ట్రంలోనే ఒక అత్యుత్తమ కళాశాలగా తీర్చిదిద్దారు. ఆ కళాశాల తొలి బ్యాచ్ విద్యార్థినులు పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని వస్తే, అధ్యాపకులుగా చేరడానికి వారికే అవకాశం ఇచ్చారు.
టీటీడీ హాస్టళ్ళలో మాంసాహారం నిషేధం . రాజేశ్వరి మూర్తి శాఖాహారి. మాంసాహారాన్ని బైట ఒండించి విద్యార్థినులకు పెట్టించారు. ముఖ్యమంత్రిగా నీలం సంజీవరెడ్డి వచ్చినప్పుడు “మన పిల్లలు కింద కూర్చుని భోజనం చేస్తుంటే మనకు అవమానం కదండి” అని సున్నితంగా చెప్పారు. అంతే , ఆయన వెంటనే డైనింగ్ హాలులో బెంచీలు, కుర్చీలు వేయించారు.
తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్, తొల ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, మలి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహాహహులను కళాశాలకు రప్పించారు. కళాశాల కోసం నిత్యం పోరాడే వారు. సమస్యవస్తే పై అధికారులతో నయినా సరే పోట్లాడేవారు. ఎస్పీడబ్ల్యూ కళాశాల ఎదురుగా, రైలు పట్టాల పక్కన ఉన్న రెండు భవనాలు ఈ కళాశాలవే.
టీటీడీ అధికారుల నివాసాల కోసం ఈవో ఆ భవనాలను స్వాధీనం చేసుకున్నారు.అంతే, రాజేశ్వరి మూర్తికి కోపం వచ్చింది. “కనీసం ప్రిన్సిపాల్ గా ఉన్న నన్ను అడగకుండా మా కాలేజీ భవనాలు ఎలా స్వాధీనం చేసుకుంటారు?” అంటూ టీటీడీ ఈవోపై అపర కాళికలా విరుచుకుపడ్డారు. ఈవో ఆమె పై అధికారి. అది అమె నిబద్ధత.
మరొక ఈవో తో ఆమెకు భిన్నాభిప్రాయాలు పొడచూపాయి. ఆమె రాజీనామా చేసి 1975లో అమెరికా వెళ్ళిపోయారు. ఒక ఆడ బిడ్డను తల్లి తీర్చి దిద్దినట్టు ఎస్పీడబ్ల్యూ కళాశాలను ఆమె అలా తీర్చిదిద్దారు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చేరారు. అయినా తన మానస పుత్రికను ఒదులుకోలేదు. తరచూ తిరుపతి వస్తూనే ఉన్నారు. వచ్చినప్పుడల్లా ఎస్పీ డబ్ల్యూ కళాశాలకే కాదు, ఎస్వీయూనివర్సిటీకి కూడా లక్షల రూపాలు ఇస్తూనే ఉన్నారు.
కొలంబియా విశ్వవిద్యాలయానికి పరిపాలనాధికారిగా పనిచేశారు. అమెరికా పౌరులకు మాత్రమే ఇచ్చే అత్యుత్తమ పాలనాధికారి అవార్డు రాజేశ్వరి మూర్తికి లభించింది. తనకొచ్చిన ఆ అవార్డును ఎస్పీడబ్ల్యూ కాలేజికి ఇస్తున్నట్టు ప్రకటించారు. ఆమె దగ్గర చదువుకున్న అనేక మంది దేశ విదేశాలలో ఉన్నత స్థానాలకు చేరుకున్నారు.
ఏడేళ్ళ క్రితం 93 ఏళ్ళ వయసులో చివరి సారిగా తిరుపతి వచ్చారు. ఇప్పటికీ ఎస్పీడబ్ల్యూ కాలేజీ విద్యార్థినులను తన పిల్లలనే అంటారు. ఆమె తొలి బ్యాచ్ విద్యార్థులు అప్పటికే ఎనభై ఏళ్ళకు చేరుకున్నారు. ఏడేళ్ల క్రితం వచ్చినప్పుడు ఆలిండియా రేడియో కోసం ఆమెను ఇంటర్వ్యూ చేశాను.
ఆ వయసులో కూడా ఉరకలేసే ఉత్సాహం!ఎంత చెలాకీగా మాట్లాడారో! ఎన్ని విద్యాసంబంధ విషయాలు సంభాషించారో! న్యూయార్కులో ఉంటూ, నూరేళ్ళ వయసులో కూడా ఇప్పటికీ ఆమె తన వంట తానే చేసుకుంటారు!