Suryaa.co.in

Editorial

రాజు ర్యాగింగ్.. జగన్ షాకింగ్!

– భుజం మీద చేయేసిన రఘురామ
– బిత్తరపోయిన జగన్‌రెడ్డి
– జగన్ పక్కనే కూర్చుని మరీ ర్యాగింగ్
– రోజూ సభకు రావాలన్న రాజు
– తప్పకుండా వస్తానన్న జగన్‌రెడ్డి
– తడబడుతూ.. సిగ్గుపడుతూ కనిపించిన జగన్
– తనకు జగన్ పక్క సీకు ఇవ్వాలని కేశవ్‌ను కోరిన రాజు
– రాజు ధైర్యాన్ని మెచ్చుకున్న టీడీపీ-బీజేపీ ఎమ్మెల్యేలు
– బయటకు వచ్చిన రాజును ప్రశంసలతో ముంచెత్తిన చిత్తూరు కార్యకర్తలు
– రాజుగారి ర్యాగింగ్ మామూలుగా లేదుగా అంటూ నెటిజన్ల కామెంట్లు
– సభకు రావాలని సలహా ఇచ్చానన్న రఘురామరాజు
– పక్కకుపోయిన గవర్నర్ ప్రసంగం
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఎవరైనా కాలేజీలో సహచర విద్యార్ధినీ విద్యార్ధులను ర్యాగింగ్ చేస్తుంటారు. కానీ అసెంబ్లీలో కూడా సహచర ఎమ్మెల్యేలను ర్యాగింగ్ చేస్తారని ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు. చూడలేదు కూడా. కానీ ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు.. తన ‘అత్యంత మిత్రుడైన’ వైకాపా అధినేత జగన్‌రెడ్డిని సభలోపల, లాబీలలో అచ్చంగా చేసిన ర్యాగింగ్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

జగన్‌రెడ్డి-రఘురామకృష్ణంరాజు ఎంత ప్రాణమిత్రులో చెప్పాల్సిన పనిలేదు. అది ప్రపంచవిదితమే. వారిద్దరి అన్యోన్యత చూసి మిత్రలోకమే నెవ్వెరపోతుటుంది. ఆ విషయం ప్రధాని నుంచి శ్రీకాకుళం సర్పంచు వరకూ తెలిసిందే. అలాంటి ప్రాణమిత్రుల మధ్య అమరావతి అసెంబ్లీ సాక్షిగా ఒక ఆసక్తికర-రసవరత్తర సన్నివేశం చోటుచేసుకుని, సోషల్‌మీడియాకు చేతినిండా-నోటినిండా పనికల్పించింది.

ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైకాపా అధినేత జగన్ సభకు హాజరవుతారా? లేదా? అన్న అనుమానాలకు తెరదించుతూ, ఆయన తన పదిమంది ఎమ్మెల్యేలతో ప్లకార్డులు పట్టుకుని, సభలోకి ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నించారు. దానిని పోలీసులు అడ్డుకోవడంతో.. జగనన్న ప్రజాస్వామ్యం, పోలీసు విధులు, పోలీసుల పక్షపాతం గురించి క్లాసు ఇచ్చారు. అది వేరే వ్యవహారం.

అసెంబ్లీ లాబీలోకి అడుగుపెట్టిన జగన్‌కు ఓ ఆరడుగుల ఆజానుబాహుడు, తనమైన బలమైన చేతిని ఆయనకంటే పొడుగుతక్కువగా ఉన్న జగన్ భుజంపై వేయడంతో, జగన్ ఖంగుతిని తలెత్తి చూస్తే.. ఇంకెవరు?.. తన ప్రాణమిత్రుడు-ఆప్తమిత్రుడైన రఘురామకృష్ణంరాజు!

దానితో కలవరపడ్డ జగన్ ఏదో మాట్లాడేలోపే.. ‘ఏం.. జగన్ ఎలా ఉన్నావు’ అంటూ రఘరామకృష్ణంరాజు ఉభయకుశలోపరి స్టార్టు చేశారు. అందుకు సిగ్గుతోకూడిన అవమానం ఫీలయిన జగన్‌రెడ్డి తెగ మొహమాటపడుతూ, చేతులు పిసుక్కుంటూ బాగున్నానని సమాధామిచ్చారు. ఇదంతా చూస్తూ అక్కడే నిలబడ్డ వైసీపీ ఎమ్మెల్యేలకు మూర్ఛవచ్చినంత పనయింది. అసలు రఘురామరాజు ఏమిటి? మా జగనన్న భుజం మీద చేయివేసి పేరు పెట్టి పిలవడమేమిటి? అన్నదే వారి షాక్‌కు కారణం. అయితే వారికి తెలియనిదేమిటంటే.. జగన్ కూడా అదే షాక్‌లో ఉన్నారని!

ఇంతకూ జగనన్నతో రాజు ఏం మాట్లాడి ఉంటారన్నది అందరి ఉత్కంఠ. భుజం మీద చేయి, చేతిలో చేయి వేసి.. ‘‘జగన్ నవ్వు రోజూ అసెంబ్లీకి రావాలమ్మా. ప్రతిపక్ష నాయకుడి హోదా ఇస్తేనే సభకు వస్తానని మారాం చేయడం కరెక్టుకాదు. నీ పార్టీ ఫ్లోర్‌లీడర్‌గా సభకు రావడం నీ ధర్మం. మరి వస్తావుగా’’ అని అన్నారు. దానికి ‘తప్పకుండా వస్తా. మీరే చూస్తారుగా’’ అని జగనన్న బదులిచ్చారు. ఈ సంభాషణ జరుగుతున్న సమయంలో అటుగా వెళుతున్న, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశ వ్‌తో ‘నాకు జగన్ పక్క సీటు ఇవ్వండి’’ అనడం.. ఆయన అందుకు అలాగేనని నవ్వుకుంటూ వెళ్లిపోవడం జరిగిపోయింది. ఈ వ్యవహారమంతా 10 మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఉత్కంఠ-సంభ్రమాశ్చర్యంతో చూడటం కనిపించింది.

అంతటితో ఆగని రాజు.. జగనన్న కళ్లలో కళ్లు పెట్టి ష్యూర్ అనడం.. జగనన్న కూడా ష్యూర్ అనడం జరిగిపోయింది. అక్కడితో ఆగని రాజు ర్యాగింగ్ అసెంబ్లీ లోపల కూడా కొనసాగడం మరో విశేషం. జగన్ పక్కన చేరిన రాజు.. రేపు కూడా అసెంబ్లీకి రావాలనడం.. దానికి జగన్ ఆయన ముఖం వైపు అదోలాచూడటం కనిపించింది.

కాగా కాగలకార్యం గంధర్వులు తీర్చినట్లు.. తాము జగన్‌కు చెప్పలేక, భయంతో మౌనంగా ఉన్న విషయాన్ని, రాజు తమ పార్టీ అధినేతకు సలహాలివ్వడం వైసీపీ ఎమ్మెల్యేలకు ఖుషీనిచ్చింది. జగన్ రోజూ అసెంబ్లీకి వస్తేనే తమకు విలువని భావిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలు, ఆ ముక్క ఆయనకు చెప్పేందుకు భయపడుతున్నారు. జగన్ కూడా వారి అభిప్రాయాలు తీసుకోవడం లేదు. ఈలోగా కాగలకాంగర్యం రాజు గంధర్వుడు తీర్చడంతో హ్యాపీ ఫీలయ్యారు.

ఇదిలాఉండగా.. జగన్-భేటీపై అటు టీడీపీ.. ఇటు సోషల్‌మీడియాలో రకరకాల కథనాలకు తెరలేచింది. దానిపై స్పందించిన రఘురామరాజు.. ‘‘నేను-జగన్ సహచర ఎమ్మెల్యేలం. నేను జగన్‌పై కేసు పెట్టడం-ఆయన గతంలో నన్ను చంపించాలని ప్రయత్నించడం-నాపై అక్రమ కేసులు పెట్టడం అవన్నీ రాజకీయపరమైనవి. దానికీ దీనికీ ఎలాంటి సంబంధం లేదు. దేనిదాని దానిదే. కేసులు కేసులే-రాజకీయం రాజకీయమే. నేను హుందాతనం పాటించి జగన్‌తో మాట్లాడా. పార్లమెంటులో ఎంపీలు పార్టీలకు అతీతంగా కలసి ఉంటారు. ఇక్కడ సభలో మేమంతా సహచర శాసనసభ్యులం. జగన్‌ను రోజూ సభకు రమ్మనమని సలహా ఇచ్చా. ఆయన కూడా అందుకు సానుకూలంగా స్పందించారు. అసలు జగన్ సభకు రావడం లేదని వార్తలు వచ్చినప్పుడు, ఆయన సభకు రావాలని మొట్టమొదట మాట్లాడింది నేనే.

ఇప్పుడు జగన్ అనుకోకుండా ఎదురుపడితే అదే చెప్పా. వాళ్ల ఎమ్మెల్యేలకు పాపం ఆ ధైర్యం లేదేమో నాకేం తెలుసు? జగన్ భుజం మీద చేయి ఎందుకు వేశారంటే అతను నాకన్నా చిన్నవాడు. నేను వైసీపీలో ఉన్నప్పుడు కూడా జగన్ భుజం మీదనే చేయి వేసి మాట్లాడేవాడిని. కాకపోతే గూగుల్‌లోకి వెళ్లి పాత ఫొటోలు వెతుక్కోండి. దీనిపై మాట్లాడేవారి ఊహలకు నేనెలా బాధ్యుడిని? కొందరు నేను ర్యాగింగ్ చేశారంటున్నారు. ఇంకొందరు ఆత్మీయంగా మాట్లాడారంటున్నారు. ఇతరుల ఊహలను నేనెలా అడ్డుకుంటా’’ అని రఘురామరాజు వ్యాఖ్యానించారు.

కాగా సభ ముగిసిన తర్వాత రాజును కలిసిన టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలు.. ‘ఏంటి రాజుగారూ.. జగన్‌ను భలే ర్యాగింగ్ చేశారే’ అని మెచ్చుకుంటే.. ‘సభకు రమ్మని చెప్పి మంచిపనిచేశారు. సభలోపల మీరిద్దరూ వాగ్వాదం చేసుకుంటే చూడాలని ఉంద’ని ఇంకొందరు ఎమ్మెల్యేలు చెప్పారు.

అసెంబ్లీ బయట ఎమ్మెల్యేలను కలిసేందుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలు, లోపల జరిగిన విషయాలను సోషల్‌మీడియాలో చూసి.. బయటకు వచ్చిన రాజును అభినందలు, పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘జగన్‌కు భలే గుణపాఠం చెప్పారు. మన పార్టీ సీనియర్లు చేయలేని పని మీరు చేశారు. మీరు అంతే ఉండాలి సార్’‘అంటూ చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన కార్యకర్తలు కితాబిచ్చారు. అయితే ఈ వ్యవహారం అటు ఎలక్ట్రానిక్ మీడియా-ఇటు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేయడంతో, ీ లకమైన గవ ర్నర్ ప్రసంగం పక్కకు పోయినట్లయింది.

LEAVE A RESPONSE