కనిపించిన నెలవంక …

– రంజాన్‌ మాసం ప్రారంభం
– ఉపవాస దీక్షలు చేపట్టనున్న ముస్లింలు

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్‌ మాసం రానే వచ్చింది. గురువారం సాయంత్రం నెలవంక దర్శనమివ్వడంతో నవ్య నగరం మంగళగిరి అంతటా పండుగ వాతావరణం నెలకొంది. శుక్రవారం తెల్లవారు జాము నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇస్లాం మతంలో రంజాన్‌ నెలకు విశేష ప్రాధాన్యత ఉంటుంది. సమత, మమతల కలయికగా.. దానధర్మాలకు ప్రతీకగా.. రంజాన్‌ మాసం నిలుస్తున్నది. ఇస్లాం మతానికి మూలధారమైన ఖురాన్‌ ఈ నెలలోనే ఆవిర్భవించింది. ఈ నెలలో ఇస్లాం మత సూత్రాలకు ముస్లింలు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రత్యేక శైలిలో జీవనాన్ని గడుపుతారు. అరబ్బీలో ‘రమ్జ్‌’ అంటే కాల్పడమని అర్థం. నెలపాటు ఉపవాస దీక్షలతో శరీరం, ఆత్మలోని మలినాలు ప్రక్షాళన కావడంతోపాటు సర్వపాపాలు దహించుకుపోతాయని ముస్లిం మ తపెద్దలు చెబుతారు. మహ్మద్‌ ప్రవక్త బోధించిన నియమాల ప్రకారం ‘సహర్‌’ నుంచి ‘ఇఫ్తార్‌’ వర కు నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉంటారు. రంజాన్‌ను పార్సి భాషలో రోజా, అరబ్బీలో సౌమ్‌ అని పిలుస్తారు. పవిత్ర ఖురాన్‌ సంపూర్ణంగా అవతరించిన దినం కూడా రంజాన్‌ మాసంలోనే ఉండడం విశేషం. నగరంలో పలు మసీదులను విద్యుద్దీపాలతో సుందరంగా అలకరించారు.

ఐదు సూత్రాలు…
కలిమా, నమాజ్‌, రోజా, జకాత్‌, హజ్‌ అనేవి ఇస్లాంకు మూలస్తంభాలు. హజ్‌ తప్పా మిగతా నాలుగు సూత్రాలు అమలయ్యేది ఒక రంజాన్‌ నెలలో మాత్రమే. ఆర్థిక స్థోమత ఉన్న వారు తప్పకుండా హజ్‌ యాత్ర నియమాన్ని కూడా సంపూర్ణం చేయాలి.ఇస్లాంలోకి ప్రవేశించే మార్గమే కలిమా.నమాజ్‌ను నిత్యం ఐదు పూటలు పాటించాలి.రోజా, జకాత్‌ (దానధర్మాలు) వంటి వాటికి రంజాన్‌ మాసంలోనే గొప్ప అవకాశం. నమాజ్‌ లేనిదే రోజా సంపూర్ణం కాదు. ప్రతి నమాజ్‌లోనూ కలిమా పఠనం జరుగుతుంది.హజ్‌ తప్పా మిగతా మూలస్తంభాలను నిలబెట్టడంలో రంజాన్‌ మాసం ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉపవాసాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది.

సమయపాలన ముఖ్యం..
ధర్మనిష్టతో ఉపవాసాలు ఉండాలి. నిర్ణీత సమయాల్లోనే సహరీ, ఇఫ్తార్‌ పాటించాలి. అందరూ ఒకేసారి కచ్చితమైన వేళలు పాటించేందుకు వీలు గా సైరన్‌ మోగిస్తారు. ఉపవాసంలో మంచినే పాటించాలి. చెడుకు దూరంగా ఉండాలి. ఐదు పూట లా విధిగా నమాజ్‌ చేయాలి. ఖురాన్‌ పఠనం, సారాంశంపై అవగాహన, అల్లాహ్‌ నామస్మరణ, అ ల్లాహ్‌ చింతన ఆచరించాలి. రంజాన్‌లో చేసే ఏ పవిత్ర కార్యాలకైనా 70 రెట్ల పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ మాసం చివరిలో ప్రతి ముస్లిం ఫిత్రా దానం చెల్లించుకోవాలి.
ఆర్థిక స్థోమత ఉన్న వారు జకాత్‌ దానం చేయాలి. మత గ్రంథాల ప్రకారం వయోజనులైన స్తీ, పురుషులు విధిగా రోజా దీక్ష పాటించాలి. వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు, ప్ర యాణంలోకి ఉన్న వారికి మినహాయింపు ఉంటుంది. రంజాన్‌ మాసంలో షబ్‌-ఏ-ఖదర్‌ అన్వేషణ కై చివరి పది దినాల్లో బేసి సంఖ్య తేదీల్లో ఐదు రాత్రుల జాగారం ఉండి ప్రార్థన జరిపితే వెయ్యి నెలలపాటు నమాజ్‌ చేసినట్లు ముస్లింలు భావిస్తారు.

ఖురాన్‌ పఠనం..
అన్ని మసీదుల్లోనూ గురువారం రాత్రి నుంచే తరావీహ్ నమాజ్ లు ప్రారంభమయ్యాయి. పవిత్ర ఖురాన్‌లో 30 పారాలుంటాయి. రోజుకు ఒక పారా చొప్పున నెల మొత్తానికి సరిచేస్తారు. ప్రస్తుత కాలంలో ఖురాన్‌ కంఠస్తం చేసే (హాఫీజ్‌ల) సంఖ్య మెరుగ్గా ఉండడంతో ప్రతి మసీదులోనూ రంజాన్‌ మాసంలో ఒక హాఫీజ్‌ను ఏర్పాటుచేసుకొని నెల మొత్తం సంపూర్ణంగా ఖు రాన్‌ పఠనంతోనే తరావీ నమాజులుపాటించనున్నట్లు మతపెద్దలు తెలిపారు.

నాగరాజు నాయుడు, జర్నలిస్ట్

Leave a Reply