బ్యాంకులో వేయాల్సిన డబ్బును జేబులో వేసుకుంటున్న రామోజీ

– ఇప్పటికీ భారీగా డిపాజిట్లు తీసుకుంటున్న రామోజీ
– వారి వ్యాపారమే అక్రమం
– చిట్ ఫండ్ సభ్యులకు ముప్పు కలింగించేలా వ్యవహారాలు
– వేల కోట్ల సొమ్ము చట్టవిరుద్ధంగా దారి మళ్ళింపు
– అన్నింటికీ ఆధారాలు ఉన్నాయ్..
– రోజూ ఈనాడు పేపర్ లో చట్టం, న్యాయం, ధర్మం.. అంటూ నీతులు
– రామోజీ చేసేదంతా.. చట్ట విరుద్ధం, న్యాయ విరుద్ధం, ధర్మ విరుద్ధం
– మార్గదర్శి చిట్ ఫండ్స్ లో అంతా చీటింగే
– రామోజీరావు ఒక వైట్‌ కాలర్‌ క్రిమినల్‌
– రామోజీ అక్రమాలకు బాబే రక్షకుడు
– మీడియా కింగ్.. చిట్ ఫండ్స్ చీటర్
– మార్గదర్శి అక్రమాలను ప్రశ్నిస్తే కక్ష సాధింపా..?
– చిట్ ఫండ్ తో సంబంధం లేదని నాడు రామోజీ తప్పుడు అఫిడవిట్లు ఇచ్చాడు
– విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌ విషయంలో టీడీపీ, ఎల్లో మీడియాది పనికిమాలిన వాదన
– ఇప్పటం అంశంలో రామోజీ, బాబు, పవన్ లు అభాసుపాలయ్యారు
– మంత్రి అంబటి రాంబాబు

మీడియా కింగ్.. చిట్ ఫండ్స్ లో అంతా చీటింగే:
గత రెండు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా చిట్‌ ఫండ్‌ కంపెనీలలో సోదాలు జరుగుతున్నాయి. ఆ సోదాల్లో ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారో వారందరిపై చట్టప్రకారం కేసులు పెట్టి శిక్షించే కార్యక్రమం జరుగుతోంది. ఇందులో ఈనాడు రామోజీరావుకు చెందిన మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కంపెనీ కూడా చట్టాన్ని ఉల్లంఘించిన అంశాలు తేటతెల్లంగా కన్పిస్తున్నాయి. చట్టవ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న వారు ఎంతటివారైనా సరే వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దీనినిబట్టి, పత్రికారంగంలో మీడియా కింగ్‌గా పేరుపొందిన రామోజీరావు నడిపే సంస్థలన్నీ చట్టవ్యతిరేకంగానే ఏర్పడ్డాయని స్పష్టమవుతోంది. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి హయాంలో మార్గదర్శి ఉల్లంఘనలపై పెట్టిన కేసుల దగ్గర నుంచి సీనియర్ రాజకీయ నాయకుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ పోరాటం చేస్తున్నారు. చిట్ ఫండ్ వ్యాపారానికి సంబంధించి అనేక చట్టాలను ఉల్లంఘించి రామోజీరావు విచ్చలవిడిగా ప్రవర్తించారు. మార్గదర్శి చిట్‌ఫండ్‌ కంపెనీ ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు బెంగుళూరు, చెన్నై లలో కూడా అనేక శాఖోప శాఖలు ఏర్పడ్డాయి. వ్యాపారం చేయవచ్చుగానీ, అది చట్టబద్దంగానే చేయాలి. ఇటీవల జరిగిన సోదాల్లో చట్టవ్యతిరేకంగా వ్యాపారం చేస్తున్నాడని, చిట్‌ఫండ్‌ యాక్టును రామోజీరావు దుర్వినియోగం చేస్తున్నాడనేది తేటతెల్లమయ్యింది.

మార్గదర్శి నుంచి వేల కోట్ల నిధులు ఇతర సంస్థలకు డైవర్ట్ః
చిట్స్ వేసే సభ్యుల నుంచి వసూలు చేసిన సొమ్మును ఏ చిట్ ఫండ్ కంపెనీ అయినా ప్రత్యేకమైన అకౌంట్లో జమ చేయాలి. ప్రతి చిట్‌కి ఒక ప్రత్యేకమైన అకౌంట్‌ ఓపెన్‌ చేయాలి. కానీ మార్గదర్శి చిట్‌ ఫండ్‌ వారు అన్నిటికీ కలిపి ఒకే అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. సరైన ష్యూరిటీలు చూపలేదని, చిట్‌ పాడుకున్న తర్వాత ఇవ్వాల్సిన అమౌంట్‌ ను సైతం చిట్ సభ్యులకు సక్రమంగా ఇవ్వడం లేదు. ఆ డబ్బంతా మార్గదర్శి యాజమాన్యమే కొన్ని నెలల పాటు తమ దగ్గరే పెట్టుకోవడం వల్ల రిజర్వ్‌ ఫండ్స్‌ ఏర్పడుతున్నాయి. దాంతో వేల కోట్ల రూపాయలు రిజర్వ్‌ ఫండ్‌ను వారికున్న ఇతర సంస్థలకు డైవర్ట్‌ చేస్తున్నారు. రామోజీకే చెందిన, ఈనాడు, ఈటీవీ, ఉషా కిరణ్ మూవీస్, రామోజీ ఫిలిం సిటీ, ఉషోదయ పబ్లికేషన్స్, కళాంజలి, డాల్ఫిన్ హోటల్స్, కలోరమా ప్రింటర్స్, రామోజీ ఫౌండేషన్, ప్రియా ఫుడ్స్‌, ప్రియా పచ్చళ్ళు.. ఇలా అనేకమైన సంస్థలకు ఆ నిధులు మళ్ళించి, ఆ రిజర్వ్‌ ఫండ్‌ను వాటిల్లో పెట్టుబడులుగా పెడుతున్నారు. పైసా పెట్టుబడి లేకుండానే రామోజీరావు చిట్ దారుల డబ్బును ఉపయోగించి ఇతర వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని దశాబ్ధాలుగా ఇలా చట్టవిరుద్ధంగానే ఆయన వ్యాపారం చేస్తున్నారు. ఎవరైనా చిట్ దారులు ప్రశ్నిస్తే.. మాపై కక్ష సాధింపు చర్య అంటూ పత్రిక ఉంది కదా అని వారి పత్రికల్లోనే దుమ్మెత్తిపోస్తున్నాడు రామోజీ. అన్యాయమైన, అక్రమమైన పద్ధతుల్లో చిట్‌ దారులను అన్యాయం చేస్తున్నారు. ఎవరైనా ఈ దేశంలో చట్టానికి అనుకూలంగానే నడుచుకోవాలే తప్ప వ్యతిరేకంగా ప్రవర్తించడానికి వీళ్లేదు. ప్రభుత్వాలు వీళ్ళ తప్పులను చూస్తూ ఊరుకోవడం కూడా సరైన విధానం కాదు. అందుకే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

రామోజీరావు ఒక వైట్‌ కాలర్‌ క్రిమినల్‌:
రామోజీ ఒక ఆర్ధిక నేరగాడు కాబట్టే.. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలిగాడు. ఒక్క పైసా పెట్టుబడి లేకుండా ఏర్పాటు చేసిన సామ్రాజ్యం రామోజీది. 31.03.2022 నాటి మార్గదర్శి చిట్‌ ఫండ్‌ వారి బ్యాలెన్స్‌ షీట్‌ చూస్తే.. కంపెనీ షేర్‌ క్యాపిటల్‌ రూ. 2 కోట్లు మాత్రమే ఉంటే, రిజర్వ్‌ఫండ్‌ మాత్రం రూ. 1697 కోట్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు రూ.768 కోట్లు. ఆ బ్యాలెన్స్‌ షీట్లో ప్రైజ్‌ మనీ చెల్లించింది మాత్రం రూ. 580 కోట్లు మాత్రమే. అయితే మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టింది రూ. 450 కోట్లు. దీనినిబట్టి, మార్గదర్శి బ్యాలెన్స్‌ షీట్లోనే ఫండ్స్‌ డైవర్ట్‌ చేసిన అంశం స్పష్టంగా కనిపిస్తోంది. అలా డైవర్ట్‌ చేయడం చట్ట విరుద్ధం. అంతేకాదు బ్యాలెన్స్‌ షీట్లో ఎంత వచ్చింది.. ఎంత వెళ్లింది అనేది మాత్రం చూపించడం లేదు. పైగా సోదాలకు వెళ్లిన అధికారులకు సహకరించడంలేదు. తనకు మీడియా ఉంది కదా.. వచ్చిన అధికారుల ఫోటోలు, వీడియోలు తీసి బెదిరిస్తున్నారు. ఎంతటి వారైనా చట్టానికి అతీతులు కాదన్న విషయాన్ని ఈనాడు రామోజీ గుర్తించాలి.

మార్గదర్శి అక్రమాలను ప్రశ్నిస్తే కక్ష సాధింపా..?:
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్‌ రెడ్డి గారు తెల్లారే సరికి దిగిపోవాలని రామోజీరావు కలలు కంటుంటాడు. రామోజీరావు, మా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకమని, అందుకే మేము అతనిపై ఆరోపణలు చేస్తున్నామని అనడం ధర్మం కాదు. ఆయన చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తుంటే.. వాటిని అడ్డుకుంటుంటే కక్ష సాధింపు ఎలా అవుతుంది..?. ప్రజల నుంచి అక్రమంగా తాను డిపాజిట్లు తీసుకోను అని హైకోర్టుకు చెప్పిన రామోజీ.. మళ్లీ అదే పని చేస్తున్నాడు. ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తున్నాడు. చిట్స్ సభ్యులు ష్యూరిటీగా ఎవరిని తీసుకెళ్లినా వారు పనికి రారని, ప్రభుత్వ ఉద్యోగి కావాలని, ఆతర్వాత వెరిఫికేషన్, విచారణ అంటూ నెలల తరబడి కాలంవెల్లబుచ్చి.. ఆ డబ్బునంతా నెలల తరబడి, తన దగ్గరే ఉంచుకుంటున్నాడు. దాంతో అంతిమంగా చిట్ దారులు నష్టపోతున్నారు. రామోజీ లాభపడుతున్నాడు. చివరికి ఫిల్మ్‌ సిటీ ఉద్యోగులకు కూడా ప్రజల డబ్బు నుంచే జీతాలు ఇస్తున్నారు.

రామోజీరావు చేస్తున్నది తప్పు అని ప్రజలు గుర్తించాలి:
చిట్‌ ఫండ్‌ నడిపే వ్యక్తి.. వేరే వ్యాపారాలు చేయకూడదు. కానీ రామోజీరావు మార్గదర్శి చిట్స్‌ నిర్వహిస్తూనే వేరే వ్యాపారాలు చేయడం కూడా చట్ట విరుద్ధం. అలా చేయడం వల్ల ఎప్పుడైనా ఏమైనా జరిగి కుప్పకూలిపోవొచ్చు. ఎన్నో పెద్ద పెద్ద చిట్ ఫండ్స్ కంపెనీలు ఒక్కసారి కుప్పకూలిన సంఘటనలు ఎన్నో చూశాం. చిట్ ఫండ్స్ పై ఇప్పుడే కాదు నిరంతం సోదాలు జరుగుతాయి. సభ్యులు, ఖాతాదారులు చేతులు కాలాక ఆకులు పట్టుకునేలా కాకుండా, ముందుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. చిత్తశుద్ధిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ చెప్తున్నది మాత్రం ఒక్కటే రామోజీరావు చేస్తున్నది తప్పు అని ప్రజలు గుర్తించాలి. రామోజీని వదిలేస్తే.. మిగిలిన చిట్‌ ఫండ్‌ కంపెనీలకు మేం ఏమని సమాధానం చెప్పుకోవాలి..?. ఒకసారి నేరం చేసిన తర్వాత, నేర ప్రవృతి కలిగిన వ్యక్తిని విచారించి చర్యలు తీసుకోవాల్సిందే. అక్రమంగా జరుగుతున్న వ్యాపారాలను ప్రోత్సహించడం సమంజసం కాదు. అది ఎప్పుడైనా నష్టాన్ని తెచ్చిపెట్టే ప్రమాదం ఉందని ప్రజలు గమనించాలి.

చిట్ ఫండ్ తో సంబంధం లేదని నాడు రామోజీ తప్పుడు అఫిడవిట్లు:
ఒక్క రామోజీరావు మార్గదర్శిపైనే కాదు… 18 కంపెనీల్లో సోదాలు నిర్వహించారు. ఆధారాలు దొరికితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. నాకు ఫైనాన్సియర్స్‌తోగానీ, చిట్‌ఫండ్‌తోగానీ సంబంధం లేదని ఆనాడు రామోజీ తప్పుడు అఫడవిట్లు దాఖలు చేసి తప్పించుకున్నాడు. దాంతో అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు ఆ కేసును కొట్టేయడం కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అదే కేసు సుప్రీం కోర్టులో ఉంది. ఆయన మీడియా ఐకాన్‌ అయితే కావచ్చుగానీ.. చట్టానికి అనుకూలంగానే వ్యవహరించాల్సిందే. చట్టానికి ఎవరూ అతీతులు కాదు. చిట్ ఫండ్స్ కు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయి కాబట్టే, మార్గదర్శితో పాటు, మిగతా అన్ని కంపెనీలలో సంబంధింత అధికారులు సోదాలు చేశారు. వాటిల్లో బోలెడన్ని బొక్కలు దొరికాయి.

రామోజీ అక్రమాలకు బాబే రక్షకుడు:
– మీడియా ప్రశ్నలకు సమాధానంగా…
చంద్రబాబుకు బుర్ర చెడిపోయింది. ఆయన్ను చూసి వైఎస్ఆర్సీపీ ఉలిక్కిపడుతుంది అనడం హాస్యాస్పదం. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు- రామోజీరావుకు రక్షకుడు. రామోజీ అక్రమంగా చేస్తున్న వ్యాపారాలను ప్రోత్సహించాడు. తనకు అనుకూలంగా రామోజీరావు వార్తలు రాస్తాడు కాబట్టి, చంద్రబాబు ఆనాడు మార్గదర్శి అక్రమాలను పట్టించుకోలేదు. ఇప్పుడు జరుగుతున్న సోదాల్లో బయటపడిన అక్రమాలకు.. చంద్రబాబు, రామోజీరావు సమాధానం చెప్పగలరా..?. నూటికి నూరు పాళ్లు, చిట్‌ ఫండ్‌ చట్టాల ఉల్లంఘనకు రామోజీరావు పాల్పడుతున్నాడు. ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మాపైన ఉంది.

ఇప్పటం అంశంలో రామోజీ, బాబు, పవన్ లు అభాసుపాలయ్యారు:
దున్నపోతు ఈనింది.. అంటే దూడను కట్టేయమన్న చందంగా విజయసాయిరెడ్డి గారి సెల్‌ ఫోన్‌ గురించి పనికిమాలిన చర్చను టీడీపీ, ఎల్లో మీడియా చేస్తుంది. వారి మాటలు, చేష్టలు టీడీపీ దీనస్థితిని తెలియజేస్తుంది. చాలా చౌకబారుతనంగా టీడీపీ రాజకీయం ఉంది. ఇప్పటం గ్రామంలో జరిగిన చిన్న ఘటనను టీడీపీ, పవన్‌ కళ్యాణ్‌ గగ్గోలు పెట్టి నానా బీభత్సం చేశారు. నాలుగు ఆక్రమణల గోడలు కూలిస్తే.. అసలు ప్రభుత్వాన్నే కూల్చివేయాలనే స్థాయిలో అనుభవం లేని పవన్‌ కళ్యాణ్‌ రెచ్చిపోయి మాట్లాడాడు. చివరికి నిన్న హైకోర్టు తీర్పుతో.. వారి అసలు బండారమంతా బయటపడింది. చట్టప్రకారమే అక్కడ అంతా జరిగినా, అఫిడవిట్‌లో తప్పులు రాసి స్టే తెచ్చుకున్నారని హైకోర్టు చేప్పింది. రాజకీయాల్లో ఒకరిని మోసం చేస్తే పర్లేదు.. చివరికి కోర్టులనే వీరు మోసం చేస్తున్నారు. దాంతో ఇప్పటంలో ఆక్రమణదారులకు సంబంధించి పిటీషనర్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా వేసిన అంశాన్ని చూస్తే రామోజీరావు, పవన్‌ కళ్యాణ్, చంద్రబాబు కుట్రలు చేసి ఈ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయాలని చూస్తే.. ఏం జరుగుతుందో స్పష్టమైంది. ఇలాంటి కుట్రలు చేస్తే.. ఏం జరుగుతుందో ఇప్పటికైనా దుష్టచతుష్టయం తెలుసుకోవాలి. కాస్తయినా, బుద్ధీ, జ్ఞానం తెచ్చుకుని ప్రవర్తించాలి అని మంత్రి అంబటి వివరించారు.

Leave a Reply