Suryaa.co.in

Andhra Pradesh

రామోజీరావు వ్యక్తి కాదు…వ్యవస్థ

-ధర్మానికి కట్టుబడి సమాజహితం కోసం అనునిత్యం పని చేశారు
-రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిది
-రామోజీరావు పార్ధీవదేహానికి నివాళులర్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు

అమరావతి :- యుగపురుషుడిలా వెలిగిన రామోజీరావు మరణం జీర్ణించుకోలేనిదని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సమాజ హితం కోసం అనునిత్యం కష్టపడ్డ వ్యక్తి రామోజీరావు అని కొనియాడారు. హైదరాబాద్ లోని ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్ధీవదేహానికి పూలమాల వేసి చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి నివాళులర్పించారు. రామోజీరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ….‘రామోజీరావు మృతి బాధాకరం. రామోజీరావు నాకు 40 ఏళ్లుగా సుపరిచితులు. అనునిత్యం తెలుగు జాతి కోసం, సమాజ హితం కోసం ఆయన కృషి చేశారు. మామూలు గ్రామంలో జన్మించిన ఆయన అసాధారణ విజయాలు సాధించారు…వ్యవస్థలను నిర్మించారు. మార్గదర్శి, ఈనాడు, ఈటీవీ వంటి సంస్థలతో ప్రజలకు చేరువయ్యారు. ఏ ఇంట్లోనైనా నిద్ర లేవగానే ఈనాడు చదవితేనే బయటకు వస్తారు. ప్రజల్ని చైతన్య పరచడానికి రాజీలేని పోరాటం చేశారు.

తాను చెప్పినట్లుగానే రామోజీరావు ధర్మం వైపు నిలబడి మంచి కోసం పని చేశారు. చనిపోయే వరకు అనునిత్యం పని చేసి…పనిలో ఉండగా చనిపోతేనే ఆనందంగా ఉంటుందని కోరుకున్న వ్యక్తి ఆయన. రామోజీరావు స్థాపించిన ఈనాడు, ఈటీవీ, ఇతర సంస్థలు ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి. మీడియా రంగంలోనే కాకుండా చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలు అందించారు. దేశంలోనే అత్యున్నత ప్రమానాలతో రామోజీ ఫిల్మ్ సిటీని నిర్మించారు.

ఫిల్మ్ సిటీ వల్ల హైదరాబాద్ లో టూరిజం పెరిగి రాష్ట్రానికి ఆదాయం వచ్చింది. అలాంటి ఆలోచనలు చేసిన మహావ్యక్తి దూరమవ్వడం బాధాకరం. తెలుగుజాతి వెలుగు రామోజీరావు. తెలుగుజాతి గుండెల్లో ఆయన చిరస్థాయిగా ఉంటారు. రామోజీరావు లేకపోయినా ఆయన రగిల్చిన స్ఫూర్తి అందరిలో ఉంటుంది. అనేక సందర్భాల్లో రామోజీరావుతో చర్చించి నేను నిర్ణయాలు తీసుకున్నాను’’ అని చంద్రబాబు నాయుడు కొనియాడారు.

LEAVE A RESPONSE