Suryaa.co.in

Telangana

రేవంత్ రెడ్డికి పగటి కలల వ్యాధి

– బిఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కుట్రలు
– రేవంత్ రెడ్డికి పని చేయడం చేతగాదు
– హరీష్ గురించి మాట్లాడటం ఆకాశం మీద ఉమ్మేయడమే
– హరీశ్ రావు, కేటీఆర్ ను విడదీయలేరు
– రేవంత్ రెడ్డిపై.. ఆయన పెయిడ్ బ్యాచ్ పై ఎన్ని కేసులు నమోదు చేస్తారు?
– ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
– సోషల్ మీడియా వేదికగా మాజీ మంత్రి హరీశ్ పై రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారం పై గచ్చిబౌలి సీసీఎస్ లో ఫిర్యాదు చేసిన మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, వై సతీష్ రెడ్డి

హైదరాబాద్: బిఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిన నాటి నుంచి కాంగ్రెస్ నాయకులకు నిద్ర పట్టడం లేదు. కేసీఆర్ ప్రసంగించిన నాటి నుంచి రేవంత్ రెడ్డికి, మంత్రులకు వణుకుడు మొదలైంది. అందుకే బిఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి అండ్ కంపెనీ కుట్రలు పన్నుతున్నది. సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ అన్నారు.

పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో దాసోజు ఏమన్నారంటే.. పని లేని పెద్ద మనిషి పిల్లి తల గొరిగిండు అన్నట్లుంది రేవంత్ తీరు. రేవంత్ రెడ్డికి పని చేయడం చేతగాదు, వాగ్దానాలు నెరవేర్చే ఆలోచన లేదు. అన్ని వర్గాల ప్రజలు సతమతమవుతుంటే మొద్దు నిద్ర నటిస్తున్నరు. విమర్శల దాడి నుంచి తప్పించుకునేందుకు తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. కుట్ర పూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారు. రాజకీయ పబ్బం గడుపుతున్నారు. ముఖ్యంగా బిఆర్ఎస్ మీటింగ్ అయిన రెండో రోజు నుంచి ప్రజా నాయకుడైన హరీశ్ రావు మీద పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. దుష్ప్రచారం చేస్తున్నారు.

ప్రజల తరుపున ప్రభుత్వాన్ని నిలదీస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ కుట్రలు చేస్తుండటం సిగ్గుమాలిన చర్య. నేరుగా ఎదుర్కొనే దమ్ము లేక, అడ్డదారిలో నీతి మాలిన చేష్టలు చేస్తుండటం చేతగాని, చేవలేని తనానికి నిదర్శనం. ప్రజలను నమ్మించి, నయవంచన చేసిన రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతిక విలువలు లేనే లేవు. అందుకే ఫేక్ పేపర్ క్లిప్స్ సృష్టించి షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెయిడ్ బ్యాచ్ లతో పేజీలు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

చిల్లర చేష్టలతో దుష్ప్రచారం చేసినంత మాత్రానా సద్గుణంలో శిఖర సమానుడైన హరీశ్ రావు కి పోయేదేమి లేదు. నిత్యం ప్రజల మధ్యన ఉంటూ, ప్రజా సమస్యల గురించి గళమెత్తే హరీష్ అన్న గురించి మాట్లాడటం ఆకాశం మీద ఉమ్మేయడమే.

కేటీఆర్, హరీశ్ రావు సొంత అన్నదమ్ముల లెక్క ఉంటరు.
ఇద్దరి మద్య వైరుధ్యాలు సృష్టించే పని చేస్తున్నారు. వెరిఫైడ్ ట్విట్టర్, ఫైరిఫైడ్ ఫేస్ బుక్ పేజీలతో ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి జేబు సంస్థలు, పెయిడ్ సంస్థలతో ఇలా ప్రచారం చేస్తున్నారు. సైబర్ క్రైం పాల్పడితే చర్యలు తీసుకోవాలి అనే ముఖ్యమంత్రి , ఇలాంటి పనులు చేస్తున్న మీపై ఉక్కు పాదం మొపుతారా?

బిఆర్ఎస్ కార్యకర్తలపై చిన్న వాటికే కేసులు పెట్టే డీజీపీ , ఇప్పుడు రేవంత్ రెడ్డిపై ఆయన పెయిడ్ బ్యాచ్ పై ఎన్ని కేసులు నమోదు చేస్తారు? బిఆర్ఎస్ నాయకులను పోలీసు స్టేషన్లలో గంటల కొద్దీ పెట్టి నరకం చూపిస్తున్నారు. కానీ కాంగ్రెస్ వాళ్లపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. కాంగ్రెస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా వ్యహరిస్తుండం దారుణం. తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

రేవంత్ రెడ్డికి పగటి కలల వ్యాధి వచ్చింది. అందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీటలు వారుతున్నది. ఈ తప్పుడు ప్రచారం వల్ల బిఆర్ఎస్ బీటలు వారవు, హరీశ్, కేటీఆర్ గారి మధ్య దూరం పెరగదు. ఇలాంటి ప్రచారం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా?

పరిపాలన చేయమంటే, ఇలాంటి చిల్లర ప్రచారం ఏమిటి? ఇందుకోసమేనా మార్పు కావాలి, కాంగ్రెస్ కావాలని అని పని చేసింది? రాముడికి హన్ముంతుడు ఎట్లనో, కేసీఆర్ కు హరీశ్ రావు అట్ల. కృష్ణార్జున లెక్క హరీశ్ రావు, కేటీఆర్ లు.. వారిని విడదీయలేరు.

ప్రజలను నమ్మించి, నయవంచన చేసి నిన్ను, నీ పార్టీని వదిలిపెట్టరు. భరతం పడుతరు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఇలాంటి తప్పుడు ప్రచారాలపై కోర్టులను ఆశ్రయిస్తాం. లీగల్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నం.

LEAVE A RESPONSE