– నువ్వు గెలిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా
– రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి
– పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం కూడా చేయడు ఇంట్లోనే ఉంటాడు
– అయినా సరే ఆయనకు 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ వచ్చి నా నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా
– రేవంత్ రెడ్డి పై పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తారు
– ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే నిర్ణయిస్తారు
– రేషం లేని బతుకు రేవంత్ రెడ్డిది
– అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు
– ఇది నామినేషన్, విజయోత్సవ సభలా ఉంది
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారక రామారావు
కొడంగల్: అనుముల అన్నదమ్ముల కోసం, అదానీ కోసం, అల్లుడి కోసమే కొడంగల్ నియోజకవర్గంలో సంవత్సరం నుంచి కురుక్షేత్ర యుద్దాన్ని తలపించేలా రేవంత్ రెడ్డి అరాచకాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.తారకరామారావు ఆరోపించారు. తన మనుషులకు వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచిపెట్టడానికే లగచర్ల రైతులపై అక్రమకేసులు బనాయించారని విమర్శించారు.
కొడంగల్ లో జరిగిన రైతు మహాధర్నాలో పాల్గొన్న కేటీఆర్, అల్లుడికి కట్నం కింద ఇవ్వడానికే లగచర్ల భూములకు రేవంత్ సూటీ పెట్టిండన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా హామీలను అమలుచేస్తున్నానని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి, దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పట్నం నరేందర్ రెడ్డిపై పోటీ చేస్తే కొడంగల్ ప్రజలే తీర్పు చెపుతారన్నారు. 50 వేల మెజార్టీకి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని కేటీఆర్ ఛాలెంజ్ చేశారు.
కౌరవ రాజు దుర్యోధనుడు లాగా సంవత్సర కాలంగా అరాచకాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ఎదురొడ్డి కొడంగల్ ఆడబిడ్డలు అన్నదమ్ములు పోరాడుతున్నారు. సంవత్సర కాలంగా లగచర్ల ,కొడంగల్ లో కురుక్షేత్ర యుద్ధం నడుస్తుంది. 14 నెల పదవీకాలంలో రైతులు ,మహిళలు, వృద్ధులు, యువత కోసం రేవంత్ రెడ్డి ఒక పని కూడా చేయలేదు.
అనుముల అన్నదమ్ముల కోసం,అల్లుడి కోసం, ఆదానికోసం, బామ్మర్దుల కోసం ,ఆయన కుటుంబ సభ్యులకు వందల వేల కోట్లు దోచిపెట్టడానికి కొడంగల్ భూములు ధారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి బ్రహ్మాండంగా పనిచేస్తున్నాడు. కొడంగల్ నియోజకవర్గంలో తొండలు కూడా గుడ్లు పెట్టవని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పిండు. కానీ ఎక్కడ చూసినా పచ్చని పంట పొలాలతో కొడంగల్ నియోజకవర్గం కళకళాలాడుతుంది.
అల్లునికి కట్నం కింద లగచర్ల భూములు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి సూటి పెట్టిండు.లంబాడి ఆడబిడ్డలు గడప దాటి బయటకు రారు అలాంటి వాళ్లను ఢిల్లీ వెళ్లి న్యాయం కోసం అడిగేలా రేవంత్ రెడ్డి దుర్మార్గంగా వ్యవహరించాడు. అదానీ కంపెనీకి, అల్లుడి ఫార్మ కంపెనీకి భూములు గుంజుకోవడానికి రేవంత్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది.
ఎకరం 60 – 70 లక్షలు విలువ చేసే భూములకు 10 లక్షలు పరిహారం ఇవ్వడం ఏంటని అడిగినందుకు లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు బనాయించారు.కాంగ్రెస్, బిజెపి నాయకులను వదిలేసి కేవలం బీఆర్ఎస్ నేతలపైనే అక్రమంగా రేవంత్ ప్రభుత్వం కేసులు పెట్టింది. కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి జైలుకు పోయిండు.
అర్ధరాత్రి పోలీసులను ఊరు మీదికి పంపి లంబాడి ఆడబిడ్డలను రేవంత్ రెడ్డి అవమానించాడు. లగచర్ల జ్యోతి శివంగిలాగా ఢిల్లీలో లడాయి చేసింది. బంజారా ఆడబిడ్డల పోరాటంతోనే లగచర్ల రైతులకు న్యాయం జరిగింది. తన బిడ్డకు పేరు పెట్టమని జ్యోతి అడగడంతో.. భూ పోరాటంలో పుట్టింది కాబట్టి ఆమెకు భూమి పేరు పెట్టాను. కొడంగల్ రైతుల భూ పోరాటానికి బిఆర్ఎస్ అండగా నిలబడింది.
వచ్చే ఎన్నికల్లో కొడంగల్ ఆడబిడ్డలు రేవంత్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడిస్తారు. ఎప్పుడు ఎన్నిక వచ్చిన కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలని కొడంగల్ తో పాటు తెలంగాణ మొత్తం ఎదురుచూస్తుంది. అన్ని హామీలు అమలు చేస్తున్నా అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి దమ్ముంటే కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.
పట్నం నరేందర్ రెడ్డి ప్రచారం కూడా చేయడు ఇంట్లోనే ఉంటాడు. అయినా సరే ఆయనకు 50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తక్కువ వచ్చిన నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. అడ్డి మారి గుడ్డి దెబ్బలాగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేషం లేని బతుకు రేవంత్ రెడ్డిది.లంకె బిందెలు ఉన్నాయి అనుకుని అడ్డమైన హామీలు ఇచ్చానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు.
రైతు రుణమాఫీ కి ఇచ్చే నిధుల విషయంలోనూ రేవంత్ ప్రభుత్వం గోల్మాల్ చేసింది. మొత్తం రుణమాఫీకి 49,500 కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం 11 వేల కోట్లు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం గప్పాలు కొట్టుకుంటుంది. చారాన మందం కూడా రుణమాఫీ కాలేదు.తులం బంగారం ఇయ్యలేదు. స్కూటీ లేదు రుణమాఫీ చెయ్యలేదు.
కెసిఆర్ 12సార్లు రైతుబంధు ఇచ్చిండు. 73000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో కెసిఆర్ గారు వేశారు.మొన్నటి అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రైతుబంధు కోసం 7600 కోట్ల రూపాయలను జమచేసి కెసిఆర్ పెట్టారు. రైతుబంధును వేయనీయద్దని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడంతో బడే భాయ్ మోడీ చోటే బాయ్ రేవంత్ చెప్పిండని రైతుబంధు వేయకుండా ఆపిండు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకోవడానికి నాలుగు నెలలు ఆపి రైతుబంధు పేరిట నోట్లు రైతుల ఖాతాల్లో రేవంత్ రెడ్డి వేసిండు. తెలంగాణ రైతులకు ఎకరానికి 17,500 రేవంత్ రెడ్డి బాకీ ఉన్నాడు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి అంటే రేవంత్ రెడ్డి రైతుబంధు వెయ్యడు. రైతు భరోసా కింద 15000 ఇస్తానని 12000 ఇస్తున్న రేవంత్ రెడ్డి మీద చీటింగ్ కేసు పెట్టాలి.
పట్నం నరేందర్ రెడ్డి రైతుల కోసం,బంజారా అన్నదమ్ముల కోసం జైలుకు పోతే రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలను కొంటూ 50 లక్షల రూపాయలతో అడ్డంగా దొరికిండు. నేను చెప్పే మాటలు నిజం కాదు అని నిరూపించాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి మళ్ళీ ఎన్నికలకు పోవాలి. రేవంత్ రెడ్డి పై పట్నం నరేందర్ రెడ్డి పోటీ చేస్తారు. ఎవరు గెలుస్తారో కొడంగల్ ప్రజలే నిర్ణయిస్తారు.
నాయి బ్రాహ్మణులు, రజకులకు కేసీఆర్ గారు 200 యూనిట్ల కరెంటును ఉచితంగా ఇచ్చారు.. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వాళ్లను డబ్బులు కట్టమని వేధిస్తున్నాడు. వాళ్లంతా కేసిఆర్ గారిని కలిసి మొరపెట్టుకుంటున్నారు. రుణమాఫీ 100కు 100% జరిగిందని ఏ ఊర్లోనైనా రైతులు చెప్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నేను రేవంత్ రెడ్డికి చాలెంజ్ చేశాను.
కల్వకుర్తి పక్కన వెల్దండలో తన కున్న సొంత భూముల్లో రేవంత్ రెడ్డి ఫార్మ కంపెనీలు పెట్టాలి. ప్రభుత్వం ఇచ్చే 20 లక్షలకు టిఆర్ఎస్ పార్టీ తరఫున ఇంకో ఐదు లక్షలు కలిపి ఇస్తాము వాటిని తీసుకొని రేవంత్ రెడ్డి తన సొంత భూముల్లో ఫార్మ కంపెనీని పెట్టాలి.
అదాని కోసం, అనుముల అన్నదమ్ముల కోసం కొడంగల్ ను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటానంటే ఒప్పుకునేది లేదు. నీ అయ్యా మీ తాత జాగిరు కాదు. కెసిఆర్ ఉన్నంతకాలం తెలంగాణ ప్రజలకు అన్యాయం జరిగితే గద్దల్లా వాలి పోరాడుతాం.దామరగిద్ద తండా రైతుల కోసం కూడా పోరాడుతాం.
4350 కోట్ల రూపాయలతో కొడంగల్ కు నీళ్లు తెస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నాడు కానీ కాంట్రాక్టర్లకు ఆయన మనుషులకు కమిషన్ ఇవ్వడానికి తప్ప కొడంగల్ ప్రజల కోసం అయితే కాదు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో 1,53,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే సౌలత్ ని కేసీఆర్ గారు చేశారు 90% పనులు పూర్తయ్యాయి 10% పనులు పూర్తయితే ప్రజలకు నీళ్లు వస్తాయి.